ఉద్యోగులకు చేదు వార్త.. వచ్చే నెల నుంచి టేక్ హోమ్ శాలరీ తగ్గనుంది.. ఎలాగంటే..
New Wage Code: వచ్చే నెల నుంచి కొత్త వేతన కోడ్ అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జూలై 01 నుంచి వేతన కోడ్ మారితే.. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు ప్రత్యక్షంగా ప్రభావితం అవుతారు. ప్రైవేట్ రంగంలో పనిచేసే వ్యక్తులు ఈ మార్పుతో ఒకేసారి లాభనష్టాలు రెండింటినీ పొందనున్నారు. ఇంతకీ ముందుగా ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఏమిటంటే.. న్యూ వేజ్ కోడ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను పెంచనుంది. అయితే ఇందులో ఉద్యోగులకు నష్టం కలిగించే అంశం కూడా ఉంది. అదేమిటంటే.. ప్రైవేటు ఉద్యోగులకు వచ్చే టేక్ హోమ్ శాలరీ తగ్గనుంది.
కొత్త నిబంధన అమల్లోకి ఎప్పటి నుంచి రానుందంటే..
మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. కొత్త వేజ్ జూలై 01 నుంచి అమలులోకి వస్తుందని తెలుస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రైవేట్ రంగ ఉద్యోగుల బేసిక్ శాలరీ వారి మొత్తం జీతంలో కనీసం 50 శాతం ఉంటుంది. ఈ మార్పుతో ఉద్యోగులు ఇకపై తమ భవిష్య నిధికి ఎక్కువ మెుత్తం చెల్లించాల్సి ఉంటుంది.
రిటైర్మెంట్ పరంగా ఈ మార్పు మంచిదని నిపుణులు భావిస్తున్నారు. దీనితో పాటు ఉద్యోగుల కొత్త వేతన కోడ్ గ్రాట్యుటీ కూడా పెరుగుతుంది. దీని వల్ల ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయని వారు అంటున్నారు.
పీఎఫ్ కాంట్రిబ్యూషన్ ఎలాగంటే..
ఉద్యోగి సీటీసీలోని బేసిక్ శాలరీ, HRA,రిటైర్మెంట్ బెనిఫిట్ (పీఎఫ్, గ్రాట్యుటీ), అలవెన్స్ మొదలైన అనేక భాగాలు ఉన్నాయి. ఓల్డ్ శాలరీ స్ట్రక్చర్ ప్రకారం.. అసలు జీతంలో 35 నుంచి 40 శాతం బేసిక్ శాలరీ ఆధారంగా పీఎఫ్ మెుత్తాన్ని లెక్కించి డిడక్ట్ చేసేవారు. నిబంధనల ప్రకారం.. ఉద్యోగి తన వాటా అయిన 12 శాతం చెల్లించాల్సి ఉండగా, మరో 12 శాతాన్ని కంపెనీలు ప్రావిడెంట్ ఫండ్లో ఇవ్వాలి.
ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ రూ. 25,000 అయితే.. పీఎఫ్కు అతని సహకారం రూ. 3,000 అవుతుంది. కంపెనీ అదే మొత్తాన్ని (రూ. 3,000) జమ చేస్తుంది. అయితే.. యజమాని బేసిక్ శాలరీ రూ.15,000 చొప్పున నెలకు చెల్లించాల్సిన పీఎఫ్ మెుత్తాన్ని రూ.1800 లకు పరిమితం చేసుకునేందుకు అనుమతించే మరొక నిబంధన కూడా ఉంది. కాబట్టి రానున్నకాలంలో కంపెనీలు ఈ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చని తెలుస్తోంది.
కొత్త వేతన కోడ్తో జరిగిన మార్పులు ఏమిటంటే..
వేజ్ కోడ్- 2019 నిబంధనల ప్రకారం.. ఉద్యోగి బేసిక్ శాలరీ CTCలో కనీసం 50 శాతం ఉండాలి. బేసిక్ జీతంలో పెరుగుదల అంటే ఇకపై నేరుగా పీఎఫ్, గ్రాట్యుటీలో సహకారం పెరుగుదల అని చెప్పుకోవాలి. మరోవైపు దీని కారణంగా ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ తగ్గవచ్చని తెలుస్తోంది. కొత్త వేతన కోడ్ అమలుతో పీఎఫ్ కంట్రిబ్యూషన్తో పాటు ఉద్యోగుల గ్రాట్యుటీ కూడా పెరగనుంది. ఉదాహరణకు.. మీ చివరి జీతం రూ. 50,000 ఉండి.. మీరు ఒక కంపెనీలో 5 సంవత్సరాలు పనిచేసినట్లయితే.. మీ గ్రాట్యుటీ రూ. 1.25 లక్షలు అవుతుంది.
కొత్త విధానంలో గ్రాట్యుటీని 'డీమ్డ్' బేసిక్ జీతం ఆధారంగా లెక్కిస్తారు. ఇది మొత్తం జీతంలో 50 శాతానికి తక్కువ ఉండకూడదు. అంటే.. మీ మొత్తం జీతం రూ. 2 లక్షలు, బేసిక్ శాలరీ రూ. 50 వేలు ఉన్నట్లయితే.. మీ గ్రాట్యుటీ రూ. లక్షగా నిర్ణయించబడుతుంది.