టెక్కీలకు యాక్సెంచర్ భారీ షాక్: 25,000 ఉద్యోగుల తొలగింపు, భారత్లో 10వేలమంది?
అంతర్జాతీయ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ ఉద్యోగులకు షాకిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో 5 శాతం మందిని తొలగించాలని భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీకి ఐదు లక్షలమందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం వర్చువల్ ఇంటర్నల్ స్టాఫ్ మీటింగ్లో యాక్సెంచర్ సీఈవో జూలీ స్వీట్ మాట్లాడుతూ.. కంపెనీ కొన్ని అంశాలను గుర్తించిందని, ఇందులో హెడ్ కౌంట్ కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా 25,000 మంది ఉద్యోగులను తొలగించాలని యాక్సెంచర్ భావిస్తోంది.
భారీగా క్షీణించనున్న TCS ఆదాయం, లాభాలు: వాటి రికవరీకి 2-3 ఏళ్లు
మన దేశంలోనే 10,000 మందిపై ప్రభావం
యాక్సెంచర్కు ప్రపంచవ్యాప్తంగా 5.13 లక్షల మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. ఇందులో భారత్లోనే రెండు లక్షల వరకు ఉన్నారు. దీంతో ఈ తొలగింపు ప్రభావం మన దేశంలోని ఆ కంపెనీ ఉద్యోగులపై ఎక్కువగా ప్రభావం పడనుంది. ప్రపంచవ్యాప్తంగా 25వేల మందిని తొలగిస్తే, ఇందులో మన దేశం నుండి 10వేల మందిపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.
పనితీరు ఆధారంగా తొలగింపు.. కంపెనీ ఏం చెప్పిందంటే
పనితీరు ఆధారంగా ఉద్యోగులను తొలగించనున్నారు. వివిధ విభాగాల్లో ఆశించిన పర్ఫార్మెన్స్ కనబరచని వారికి షాక్ తగలనుందని తెలుస్తోంది. ప్రధానంగా ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు లక్ష్యంగా పెట్టుకునే సంస్థలు పనితీరును కొలమానంగా చూపిస్తున్నాయి. అయితే, ప్రస్తుత సమయంలో అంతర్జాతీయంగా సిబ్బందిపై ఎలాంటి అసాధారణ చర్యలు తీసుకోవడం లేదని యాక్సెంచర్ వెల్లడించింది.
బిజినెస్ క్షీణత
కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో యాక్సెంచర్ ప్రకారం సంస్థలో క్లయింట్స్కు ఉద్యోగులను కేటాయించే పని గంటలు తొలిసారి 90 శాతం కంటే తగ్గిందట. డిమాండ్ క్షీణించడంతో ఎక్కువ మంది ఉద్యోగుల కారణంగా సంక్షోభంలోకి వెళ్లినట్లు పేర్కొందట. బిజినెస్ క్షీణత వంటి ఈ సంక్షోభ సమయంలో అదనంగా వ్యయాలను తగ్గించాల్సిన పరిష్కారాలను గుర్తించినట్లు యాక్సెంచర్ తెలిపింది. కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు తగ్గాయి. దీంతో ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులపై వేటుకు సిద్ధమవుతున్నాయి. చాలా కంపెనీలు వేతనాల పెంపును పక్కన పెట్టాయి.
ఆదాయంలో తగ్గుదల
కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బపడిందని, ఈ ఏడాది తమ ఆదాయ అంచనాలు 3 శాతం నుండి 6 శాతం వరకు తగ్గుతాయని యాక్సెంచర్ అంచనా వేసింది. యాక్సెంచర్ సెప్టెంబర్ నుండి ఆగస్ట్ వరకు ఫైనాన్షియల్ ఇయర్ను అనుసరిస్తుంది. యాక్సెంచర్ ఇప్పటికే జూలైలో యూకేలో 900 మంది ఉద్యోగులను తొలగించింది. అక్కడి వర్క్ ఫోర్స్లో ఇది 8 శాతం. ఆస్ట్రేలియాలోను ఇదే పరిస్థితి.
ఇది మామూలే... కొత్తవారికి ఛాన్స్
యాక్సెంచర్ ఉద్యోగుల్లో ఎక్కువమంది మన దేశంలోనే ఉన్నారు. దీంతో ఈ ప్రభావం ఇండియన్ యాక్సెంచర్ ఐటీ ఉద్యోగులపై ఎక్కువగా కనిపించనుంది. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగాల కోత కోసం ఇప్పటికే పనితీరు మదింపు ప్రారంభమైనట్టుగా వార్తలు వస్తున్నాయి. యాక్సెంచర్ ఇండియా అధికారులు మాత్రం పనితీరు సరిగా లేని ఉద్యోగుల తొలగింపు ఏటా సాధారణమేనని, వీరి సంఖ్య 5 శాతానికి మించదని, వారి స్థానంలో కొత్త ఉద్యోగులను చేర్చుకుంటామని చెబుతున్నారు.