ఉద్యోగాలు వదులుకున్న వారికి యాక్సెంచర్ ఆఫర్, 7 నెలల వేతనం!
ఐటీ దిగ్గజం యాక్సెంచర్ ఉద్యోగుల కోతకు కొత్త ప్లాన్తో ముందుకు వచ్చింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని రంగాల ఆదాయాలు దెబ్బతిన్నాయి. ఐటీ రంగంపై ప్రత్యక్షంగా,పరోక్షంగా ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో నియామకాలు నిలిచిపోయాయి. తాజాగా యాక్సెంచర్ ఉద్యోగులు వదులుకునే వారికి భారీ ఆఫర్ ప్రకటించింది. తాజా లే-ఆఫ్స్ ప్రభావం పడిన వారికి ఏడు నెలల వేతనం అందిస్తోంది. ఇందులో మూడు నెలల కాలం నోటీస్ పీరియడ్ కాగా, మరో నాలుగు నెలలు అదనంగా చెల్లించనుంది. పనితీరు ఆధారంగా 5 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు గతంలో తెలిపింది.
వర్క్ ఫ్రమ్ హోమ్ భేష్, చైనా గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్!: బిల్గేట్స్
నోటీస్ పీరియడ్
సాధారణంగా మెజార్టీ ఐటీ కంపెనీలు ఉద్యోగాలు వదులుకున్న వారికి రెండు నెలల నుండి మూడు నెలల వేతనాలు మాత్రమే చెల్లిస్తారు. అయితే ఐటీ సర్వీస్ గ్లోబల్ దిగ్గజం యాక్సెంచర్ మాత్రం మూడు నెలల కాలాన్ని నోటీస్ పీరియడ్గా, మరో నాలుగు నెలల అదనపు వేతనం ఇస్తోంది. ఈ ఉద్యోగాల కోత సహజమేనని, ప్రతి ఏడాది కొత్త నియామకాలు, ఉద్యోగాల కోత సహజమేనని చెబుతోంది. ఎక్కువగా టెక్నాలజీకి డిమాండ్ లేని ప్రాంతాల్లో ఉద్యోగాల కోత ప్రభావం ఉంది. అదే సమయంలో డిజిటల్ టెక్నాలజీకి డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో కంపెనీలు కొత్త ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. డిజిటల్ సేవల ద్వారా యాక్సెంచర్కు 70 శాతం ఆదాయం వస్తోంది.
ఉద్యోగాల కోత
ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో ఐదు శాతం మందిని తొలగించాలని యాక్సెంచర్ భావిస్తున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీకి ఐదు లక్షలమందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం వర్చువల్ ఇంటర్నల్ స్టాఫ్ మీటింగ్లో యాక్సెంచర్ సీఈవో జూలీ స్వీట్ మాట్లాడుతూ.. కంపెనీ కొన్ని అంశాలను గుర్తించిందని, ఇందులో హెడ్ కౌంట్ కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా 25,000 మంది ఉద్యోగులను తొలగించాలని యాక్సెంచర్ భావించినట్లుగా వార్తలు వచ్చాయి. ఇందులో మన దేశం నుండి 10వేల మందిపై ప్రభావం పడుతుందని అప్పుడు అంచనా వేశారు.
యాక్సెంచర్ ఆదాయంలో వృద్ధి
కరోనా మహమ్మారి నేపథ్యంలో కార్యకలాపాలు లేక దాదాపు అన్ని రంగాల్లో ఇటీవలి వరకు ఉద్యోగాల కోతలు చోటు చేసుకున్నాయి. ఐటీ సంస్థల ఆదాయాలపై కూడా ప్రభావం పడింది. అయితే గత త్రైమాసికంలో యాక్సెంచర్ ఆదాయం 1.3 శాతం మేర పెరిగింది. అయితే ఖర్చులు తగ్గించుకోవడం వల్లే ఈ లాభాలు వచ్చినట్లుగా కూడా భావిస్తున్నారు.