ప్రపంచంతో మమేకం చేస్తుంది: ఆత్మనిర్భర్ భారత్పై మోడీ
కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అమెరికా,భారత్ వ్యూహాత్మక, భాగస్వామ్య సదస్సు సందర్భంగా మాట్లాడారు. 2020 సంవత్సరం ప్రారంభమైనప్పుడు ఇలా ఉంటుందని ఎవరూ ఊహించలేకపోయారని, కరోనా ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసిందన్నారు. ప్రజా ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని పరీక్షిస్తోందన్నారు. దేశంలో 130 కోట్ల మందికి పైగా ప్రజలు ఉన్నారని, కానీ ప్రతి 10 లక్షల్లో తక్కువ మరణాల రేటు ఉందని గుర్తు చేశారు. కరోనా రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతోందన్నారు.
కరోనా ఎన్నో అంశాలపై ప్రభావం చూపిందని, కానీ 130 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను, ఆశయాలను మాత్రం ప్రభావితం చేయలేదన్నారు. ఇటీవలి కాలంలో చాలా సంస్కరణలు చోటు చేసుకుంటున్నాయని, ఇవి వ్యాపారాన్ని మరింత సులభతరం చేస్తున్నాయన్నారు. దేశ ప్రజలంతా కలిసి ఆత్మనిర్భర్ భారత్ను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ఆయా ప్రాంతాల్లోని స్థానికులను ప్రపంచంతో కలుపుతుందన్నారు.
సవాళ్లు ఎన్ని ఉన్నప్పటికీ ఫలితాలు అందిస్తుందని మీరు విశ్వసిస్తున్న ప్రభుత్వం ఉందన్నారు. ఇక, సమ్మిట్ గురించి మాట్లాడుతూ... వ్యాపారం, వాణిజ్యం, విదేశీ వ్యవహారాలు, ఆర్థికం, దౌత్యం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్-అమెరికా మధ్య ప్రస్తుతం కొనసాగుతోన్న సంబంధాలు మరింత బలోపేతమౌతాయని అన్నారు.