షాకింగ్: ఏపీలో 971 కంపెనీల గుర్తింపు రద్దు.. 5 వేల మంది డైరెక్టర్లు అనర్హులు!
దేశంలో డొల్ల కంపెనీల నియంత్రణపై డేగ కన్నేసిన మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్(ఎంసీఏ) వాటి ఏరివేతకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఎంసీఏ ఆదేశాలకు అనుగుణంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 971 కంపెనీల గుర్తింపును రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్(ఆర్వోసీ) రద్దు చేసింది.
ఈ కంపెనీలన్నీ వరుసగా రెండేళ్లు (2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాలు) వార్షిక రిటర్న్లు, బ్యాలెన్స్ షీట్లు ఫైల్ చేయలేదని తెలుస్తోంది. దీంతో సెక్షన్ 248 ప్రకారం ఈ కంపెనీలను రద్దు చేసినట్లు ఇండియన్ కార్పొరేట్ లా సర్వీసెస్ (ఐసీఎల్ఎస్) సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
ఏపీలో 30 వేల కంపెనీలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 30 వేల కంపెనీలు ఆర్వోసీ వద్ద రిజిస్టర్ చేసుకున్నాయి. ఇలా రిజిస్టర్ అయిన కంపెనీలు ఏటా కంపెనీ లావాదేవీలకు సంబంధించి ఏటా వార్షిక రిటర్న్లు, బ్యాలెన్స్ షీట్లు గడువులోగా ఆర్వోసీకి అందజేయాల్సి ఉంటుంది. వీటిలో 20 వేల కంపెనీలు చురుగ్గానే వాటి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మిగిలిన 10 వేల కంపెనీల కార్యకలాపాలపై మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కన్నేసి ఉంచాయి.
వార్షిక నివేదికలు సమర్పించని కంపెనీలు...
2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన అసెస్మెంట్ నివేదికలను గత నవంబర్లోగా సమర్పించాల్సి ఉండగా చాలా కంపెనీలు వీటిని సమర్పించలేదు. ఈ ఏడాది ఆగస్టులో ‘స్ట్రయిక్ ఆఫ్ డ్రైవ్' మూడో విడత ప్రారంభమైనప్పుడు దేశ వ్యాప్తంగా 4 నుంచి 5 లక్షల మంది డైరెక్టర్ల గుర్తింపు రద్దు కాగలదని అంచనా వేశారు. అంతకు ముందు జరిగిన రెండు విడతల్లో దాదాపు 10 లక్షల మంది డైరెక్టర్లపై వేటు పడింది. తాజాగా చేపట్టిన మూడో విడత ‘స్ట్రయిక్ ఆఫ్ డ్రైవ్'లో తెలుగు రాష్ట్రాల్లో 10 వేల డైరెక్టర్ల గుర్తింపు రద్దు అవుతుందని అనుకున్నారు.
నెల రోజులు గడువు ఇచ్చినా...
దీంతో ఆయా కంపెనీలకు ఆర్వోసీ నెల రోజులు గడువు ఇచ్చింది. కొన్ని కంపెనీలు స్పందించి వార్షిక రిటర్న్లు, బ్యాలెన్స్ షీట్లు సమర్పించగా, 1305 కంపెనీలు మాత్రం వాటి వార్షిక రిటర్న్లు, బ్యాలెన్స్ షీట్లు సమర్పించలేదు. దీంతో ఈ కంపెనీలకు ఆర్వోసీ మళ్లీ ఒకసారి నోటీసులు జారీ చేసింది.
వాటికి మాత్రం మినహాయింపు...
రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నుంచి నోటీసులు అందుకున్న వెంటనే కొన్ని కంపెనీలు తమ తప్పును గుర్తించి వాటి వార్షిక రిటర్న్లు, బ్యాలెన్స్ షీట్లు సమర్పించాయి. మరికొన్ని కంపెనీలు న్యాయపరమైన వివాదాల కారణంగా సమర్పించలేకపోయాయి. మరికొన్ని కంపెనీల రికార్డులు ఐటీ శాఖ దగ్గర ఉండిపోయాయి. ఇలాంటి సమస్యలున్న కంపెనీలను గుర్తించిన ఆర్వోసీ వాటికి మినహాయింపు నిచ్చింది. మిగిలిన 971 కంపెనీలను డొల్ల కంపెనీలుగా గుర్తించి.. వాటి గుర్తింపును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కంపెనీల బ్యాంకు ఖాతాలూ ఫ్రీజ్...
కంపెనీలను రద్దు చేయడమేకాకుండా వాటికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలను కూడా స్తంభింపజేస్తూ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ తొలిసారి చర్యలు తీసుకుంది. గుర్తింపు రద్దు అయిన ఈ కంపెనీల వివరాలతోపాటు వాటి బ్యాంక్ అకౌంట్, పాన్ నంబర్ల వివరాలను ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్(ఐబీఏ), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇన్కమ్ ట్యాక్స్(ఐటీ), జీఎస్టీ కార్యాలయాలకూ పంపించింది. ఈ కంపెనీలకు సంబంధించి ఆయా శాఖల వద్ద ఏమైనా బకాయిలు ఉన్నాయా అన్నది తెలుసుకోవడం కోసం ఇలా చేసిన ఆర్వోసీ ఆయా శాఖల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఆ కంపెనీల గుర్తింపును రద్దు చేసింది.
5 వేల మందికిపైగా డైరెక్టర్లు అనర్హులు...
అలాగే వరుసగా మూడేళ్లపాటు (2015-16, 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాలు) బ్యాలెన్స్ షీట్లను సమర్పించని వివిధ కంపెనీలకు చెందిన 5,023 మంది డైరెక్టర్లను అనర్హులుగా ప్రకటించారు. ఇలా డిస్క్వాలిఫై అయిన వారిలో అక్షయ గోల్డ్, అగ్రిగోల్డ్, బిట్కాయిన్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ వంటి కంపెనీల డైరెక్టర్లు కూడా ఉండటం గమనార్హం. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ దాదాపు 3,410 కంపెనీలు వార్షిక రిటర్న్లు, బ్యాలెన్స్ షీట్లను సమర్పించలేదని తెలుస్తోంది. అయితే తెలంగాణలో ఎన్ని కంపెనీలు రద్దయ్యాయి అన్న విషయం ఇంకా తెలియడం లేదు.
అనర్హత ఐదేళ్ల వరకు...
అనర్హత వేటుకు గురైన కంపెనీల డైరెక్టర్లు ఆ కంపెనీలోనేకాక ఏ కంపెనీలో కూడా డైరెక్టర్లుగా పని చేయడానికి వీలు లేదు. ఈ అనర్హత ఐదేళ్ల వరకూ ఉంటుంది. ఇది నవంబరు 2019 నుంచే అమలులోకి వచ్చింది. నిబంధనలు తోసిపుచ్చి ఎవరైనా ఏదైనా కంపెనీలో డైరెక్టర్గా చేరితే.. ఏడాదిపాటు జైలు శిక్ష లేదా రూ.5 లక్షల వరకూ జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
పునరుద్ధరణకు ఎన్సీఎల్టీకి...
మూడో విడత ‘స్ట్రయిక్ ఆఫ్ డ్రైవ్'లో దేశ వ్యాప్తంగా 80 వేల నుంచి లక్ష కంపెనీలు రద్దు అయినట్లు తెలుస్తోంది. కంపెనీల చట్టం సెక్షన్ 248 కింద కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఈ కంపెనీల గుర్తింపును రద్దు చేస్తోంది. ఇలా గుర్తింపు రద్దు అయిన కంపెనీలు తిరిగి వాటి గుర్తింపును పునరుద్ధరించుకోవాలంటే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ)కి వెళ్లాల్సి ఉంటుందని ఏపీ ఆర్వోసీ అధికారి ఒకరు తెలియజేశారు. ఎన్సీఎల్టీ అమరావతి బెంచ్ను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హైదరాబాద్లో ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.