ఉద్యోగాల కోత, జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోం ఇబ్బందులు...: ఐటీ సంస్థలపై సర్వే
హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను హడావుడిగా కార్యాలయాలకు రప్పించే ఆలోచనతో లేవని హైదరాబాద్ సాఫ్టువేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్(HYSEA) సర్వేలో వెల్లడైంది. అలాగే ఉద్యోగులు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి వద్ద నుండి పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం 90 శాతం మంది ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఈ ఏడాది ఐటీ సంస్థల వృద్ధి ఫ్లాట్గా ఉంటుందని భావిస్తున్నారు. మహమ్మారి వల్ల ఐటీ, ఐటీ ఇంజినీరింగ్ సేవల సంస్థలకు మొదట ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్నట్లు తెలిపింది.
ఏటీఎంకు వెళ్తున్నారా.. ఈరోజు నుండి మొబైల్ కచ్చితంగా వెంట తీసుకెళ్లండి!
వృద్ధి సింగిల్ డిజిట్కు
గత ఏడాది ఐటీ పరిశ్రమ పద్దెనిమిది శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ ఐటీ పరిశ్రమ ఆదాయం, లాభదాయకత వృద్ధి రేటు ఒక అంకెకు పరిమితం కావొచ్చునని లేదా మార్పులేకుండా ఉండవచ్చునని అంచనా వేసింది. కరోనా కేసుల తగ్గుదల, వ్యాక్సీన్ లభ్యత ఆధారంగా సాఫ్టువేర్ ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వచ్చే అంశాన్ని నిర్ణయించగలవని చెబుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఆయా రంగాలు అవకాశంగా మలుచుకొని ముందుకు సాగుతున్నాయని, ఇందులో ఐటీ రంగం ఉంది. విద్య, ఫార్మా, ఆరోగ్య రంగాల్లో ఉన్న ఐటీ సంస్థల్లో కరోనా తర్వాత వృద్ధి కనిపిస్తోంది. ఉత్పత్తి, ఇతర విభాగాల్లో ఉన్న ఐటీ సంస్థలు తమ వ్యాపారాన్ని పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.
హైదరాబాద్లో కోత తక్కువ..
వ్యాక్సీన్ వచ్చి, అన్ని కుదుటపడేదాకా కంపెనీలు, ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఐటీ సంస్థల్లో.. అలాగే హైదరాబాద్ ఐటీ పరిశ్రమలో ఉద్యోగాల కోత, వేతనాల కోత పెద్దగా లేదని తేలింది. ఉద్యోగుల ఉత్పాదకత 90 శాతానికి పైగా ఉందని ఎక్కువ పెద్ద కంపెనీలు చెప్పగా, 75 శాతానికి పైగా ఉందని 80 శాతం పైగా అన్ని కంపెనీలు తెలిపాయి.
వర్క్ ఫ్రమ్ హోమ్ ఇబ్బందులు
వర్క్ ఫ్రమ్ హోమ్ పట్ల ఉద్యోగుల ఎక్కువగా ఇష్టపడుతున్నప్పటికీ, ఇబ్బందులు మాత్రం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. బ్రాడ్ బ్యాండ్ లభ్యత, పవర్ కట్, పని వాతావరణం, ఉద్యోగులతో ప్రత్యక్ష చర్చల్లో పాల్గొనకపోవడం వంటివి ప్రతిబంధకాలుగా మారాయి. ఉద్యోగుల్లో నైతిక స్థైర్యం తక్కువగా ఉందని 34 శాతం కంపెనీలు తెలిపాయి. వచ్చే ఏడాది మార్చి తర్వాత కూడా 70 శాతం నుండి 89 శాతం మంది ఉద్యోగులను ఇంటి నుండి పని చేయిస్తామని 31 శాతం కంపెనీలు తెలిపాయి. పెద్ద సంస్థలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ను 30 శాతానికి పరిమితం చేయాలని భావిస్తున్నాయి. లాక్ డౌన్ తర్వాత చాలామంది ఉద్యోగులు క్రమంగా తమ సొంత ప్రాంతాలకు వెళ్లారు. ఎక్కువమంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ పట్ల ఆసక్తి చూపిస్తున్నప్పటికీ, కొంతమంది త్వరగా కార్యాలయాలకు రావాలని ఆసక్తి కనబరుస్తున్నారు.
కొత్త ఉద్యోగాలు..
ఐటీ సంస్థల్లో దాదాపు 70 శాతం పెద్ద కంపెనీలు కరోనా ఉన్న ఆరు నెలల కాలంలో కొత్త నియామకాలు చేపట్టాయి. ఈ ఆరు నెలల కాలంలో ఒకటి నుండి వెయ్యి మంది వరకు ప్రెషర్లను చేర్చుకున్నట్లు తెలిపాయి. అలాగే, ఎక్కువ కంపెనీలు ఫ్రెషర్స్కు ఇచ్చిన ఆఫర్ లెటర్లను గౌరవిస్తామని చెబుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి నియామకాలు కరోనా పూర్వస్థితికి వస్తాయని ఐటీ దిగ్గజాలు భావిస్తున్నాయి.
కార్యాలయాలకు దూరం..!
ఐటీ కంపెనీలు చాలా వరకు తమ కార్యాలయాల పరిమాణాలను తగ్గించుకుంటున్నాయి. కొన్ని చిన్న సంస్థలకు అయితే పూర్తిగా కార్యాలయాలు మూసివేసి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ఆఫీస్లు తెరుచుకోవడానికి సమయం పట్టడంతో పాటు పూర్తిగా ఉద్యోగులు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి కార్యాలయ పరిమాణాన్ని తగ్గిస్తున్నాయి. వ్యాక్సీన్ వస్తే ఐటీ రంగం వేగంగా పుంజుకుంటుందని భావిస్తున్నారు.