నియామకాల జోరు, 70% కంపెనీల నుండి ఆఫర్లు: ఉద్యోగ భద్రతకే ప్రాధాన్యం
కరోనా మహమ్మారి నుండి ప్రపంచం, దేశం క్రమంగా కోలుకుంటోంది. అయితే ఇటీవలి కాలంలో సెకండ్ వేవ్ ఆందోళనకు గురి చేస్తోంది. ఫ్యాక్టరీలు, కార్యాలయాల్లో కార్మిక ప్రధాన ఉద్యోగాలకు మళ్లీ డిమాండ్ పెరిగింది. దాదాపు 70 శాతం కంపెనీలు ఇప్పటికే నియామకాలు ప్రారంభించాయి. వ్యాక్సినేషన్తో పాటు ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తోన్న రికవరీతో కంపెనీలు మళ్లీ బ్లూకాలర్ ఉద్యోగుల నియామకాలకు సిద్ధమైనట్లు ఓఎల్ఎక్స్ పీపుల్ సర్వేలో వెల్లడైంది. ఇది సెకండ్ ఎడిషన్ పోల్.
పూర్తి నియామకాలు
16 శాతం కంపెనీలు పూర్తిస్థాయిలో నియామకాలు చేస్తుంటే, 54 శాతం కంపెనీలు 50 శాతం ఖాళీలు భర్తీ చేస్తున్నాయి. చాలా కంపెనీలు కార్మికులు దొరకక ఇబ్బందులు పడుతున్నాయి. చాలామంది గిగ్ వర్కర్స్ తమతమ సొంత ఊళ్లకు, కుటుంబానికి దగ్గరగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో చాలా కంపెనీలకు కార్మికులు దొరకడం సవాల్గా మారింది. చాలామంది కార్మికులు వేతం తక్కువైనా సొంత ఊళ్లో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఓఎల్ఎక్స్ పీపుల్ ఆన్ లైన్ ద్వారా ఈ సర్వే నిర్వహించింది.
రికవరీ ఆశలు
ఈ సర్వేలో 150 వరకు సంస్థలు పాల్గొన్నాయి. ఐటీ, ఈ కామర్స్, బీఎఫ్ఎస్ఐ, ఫుడ్ టెక్, లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎఫ్ఎంసీజీ సహా వివిధ రంగాల సంస్థలు ఉన్నాయి. సర్వేలో పాల్గొన్న చాలామంది రికవరీపై ఆశాభావంతో ఉన్నారు. ఏడాదిలో రికవరీ ఉంటుందని సర్వేలో పాల్గొన్న ప్రతి ఇద్దరిలో ఒకరు చెప్పారు. అంటే 50 శాతం మంది ఆశావాహ దృక్పథంతో ఉన్నారు. తమ వ్యాపారం బాగుందని 60 శాతం మంది, 2021 చివరి నాటికి తమ వ్యాపారం రికవరీ అవుతుందని 24 శాతం మంది, కొద్ది నెలల్లో రికవరీ ఉంటుందని 13 శాతం మంది తెలిపారు.
నియామక వృద్ధి
మొదటి విడత ఎంప్లాయర్ సెంటిమెంట్ సర్వేను జూన్ 2020లో నిర్వహించింది ఓఎల్ఎక్స్ పీపుల్. ఇది సెకండ్ ఎడిషన్. ఇతర రంగాలతో పోలిస్తే ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రంగాల్లో నియామక వృద్ధి చాలా వేగంగా ఉందని సర్వేలో వెల్లడైంది. FMCG, BFSI, మ్యానుఫ్యాక్చరింగ్, IT రంగాలు కూడా నియామక ప్రక్రియని వేగవంతం చేయనున్నాయి. చాలామంది కార్మికులు ఇప్పుడు ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పీఎఫ్తో పాటు గ్రాట్యుటీ, హెల్త్ ఇన్సురెన్స్ వంటి సౌకర్యాలు కల్పించి మరీ జాబ్స్ ఇస్తున్నాయి చాలా కంపెనీలు.