కోవిడ్-19: బస్సు జర్నీకి జై కొడుతున్న జనం... అందులో మాత్రం రాజీ లేదు!
కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావంతో దేశంలో దాదాపు రెండు నెలలుగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే, ఇటీవల లాక్ డౌన్ 4.0 లో చాలా వరకు మినహాయింపులు లభించాయి. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. అయితే, అవి కేవలం ఆయా రాష్ట్రాలకే పరిమితం అయ్యాయి. కంపెనీ త్వరలోనే అంతరాష్ట్ర బస్సు సర్వీసులు కూడా ప్రారంభం కానున్నాయి. అప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా పెద్ద ఎత్తున సర్వీసులు ప్రారంభించనున్నాయి.
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు 1,00,000 దాటిపోగా.. 3,000 పైగా మంది ఈ మహమ్మారి బారిన పడి చనిపోయారు. ఈ నేపథ్యంలో ప్రజలు బస్సుల్లో ప్రయాణానికి ఎంత వరకు సన్నద్ధంగా ఉన్నారు వంటి అంశాలతో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ బస్సు టిక్కెటింగ్ సేవల కంపెనీ అభిబస్ ఒక సర్వే నిర్వహించింది.
ఇండియా బస్సు ట్రావెల్ సర్వే పేరుతొ నిర్వహించిన ఈ అధ్యయనంలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మెజారిటీ పాసెంజర్లు సర్వీసులు మొదలైన వెంటనే ప్రయాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇందులో తేలింది. ఈ సర్వే లో 3,000 కు పైగా పాసింజర్లు పాల్గొన్నారని, వారిలో అధిక శాతం మంది వెంటనే ప్రయాణానికి సిద్ధమవుతున్నారని అభిబస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రోహిత్ శర్మ ఒక ప్రకటనలో వెల్లడించారు.
అవి తప్పనిసరి..
అయితే, ప్రయాణాల్లో శానిటైజషన్ కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు ప్రయాణికులు. బస్సుల సేవలు అందించే వారు వేచి చూసే గదుల్లో కూడా శానిటైజేషన్ చేయాలని కోరుతున్నారు. సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించేలా చేయాలని చెబుతున్నారు. అలాగే, ప్రయాణ సమయంలో తమతో పాటు తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజర్ ను, సొంత దుప్పటిని తీసుకుళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అలాగే, ఇంట్లో వండిన ఆహార పదార్థాలనే తమతో తీసుకెళ్తామని సుమారు 90% మంది సర్వే లో పాల్గొన్న వారు చెబుతుండటం విశేషం. తమ ఆత్మీయులను కలిసేందుకు, ఆఫీస్ పనులు చక్కబెట్టుకునేందుకు, అలాగే చదువుల కోసం ప్రయాణం తక్షణావసరం అని 63% పాసెంజర్లు పేర్కొంటున్నారు. కాబట్టి వెంటనే వారు ప్రయాణం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మరో 16.8% ప్రజలు మాత్రం రద్దీ తగ్గాక ప్రయాణం చేస్తామంటున్నారు.
ధరలు పెరుగుతాయి...
చాలా రోజుల తర్వాత మళ్ళీ సేవలు ప్రారంభం అవుతుండటంతో పాటు ఒక్కో బస్సులో తక్కువ సీట్లలోనే ప్రయాణికులను అనుమతిస్తారు కాబట్టి, టిక్కెట్ల ధరలు పెరుగుతాయని మెజారిటీ పాసెంజర్లు భావిస్తున్నారు. అయితే, ఆ పెరుగుదల తమ ప్రయాణాలపై ఎటువంటి ప్రభావం చంపబోదని అంటున్నారు. ఇదిలా ఉండగా... ప్రస్తుతం కరోనా వైరస్ తో సహజీవనం చేయాల్సిందే కాబట్టి తమ ప్రాణాలకు రక్షణగా కోవిడ్ ఇన్సూరెన్స్ కవరేజి ఉండాలని కోరుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రయాణం మాత్రం చేసి తీరాల్సిందేనని పాసెంజర్లు కోరుకుంటున్నారు.