కరోనా టైమ్లో ఈ కంపెనీలో 15% శాలరీ హైక్, పైగా బోనస్ కూడా
కరోనా మహమ్మారి - లాక్ డౌన్ నేపథ్యంలో చాలా కంపెనీలు వేతనాల్లో కోత, ఉద్యోగుల కోతకు తెరలేపాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం తమ ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు వేతనాలు పెంచుతున్నాయి. ప్రముఖ సెర్చింజన్ గూగుల్ ఇటీవల ఒక్కో ఉద్యోగికి అదనంగా రూ.75,000 ఇస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ అండగా ఉంటుందని చెప్పేందుకు పలు కంపెనీలు ఉద్యోగులకు బోనస్ లేదా వేతనాల పెంపు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఉద్యోగుల్లో నైతిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు 5పైసా డాట్ కామ్ వేతనాలు పెంచింది.
టారిఫ్ తగ్గించాలి, చైనా నుండి కంపెనీలు రావాలంటే అందులో చేరాలి: ప్రభుత్వానికి అరవింద్
15 శాతం వేతనం పెంపు, బోనస్
క్లిష్ట పరిస్థితుల్లో కంపెనీ అండగా ఉంటుందని ఉద్యోగుల్లో భరోసా నింపేందుకు వారికి 15 శాతం వేతన పెంపు, అడ్వాన్స్ బోనస్ చెల్లింపులు చేయనున్నట్లు 5పైసా డాట్ కామ్ తెలిపింది. కరోనా పరిణామాల నేపథ్యంలో పలు రంగాల్లోని వివిధ కంపెనీలు ఉద్యోగాల కోత, వేతనాల తగ్గింపుకు నిర్ణయం తీసుకుంటుంటే, 5పైసా డాట్ కామ్ ఇందుకు భిన్నంగా వేతనాలు పెంచుతోంది.
అందుకే ఇస్తున్నాం
కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిబ్బందికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు 5పైసా డాట్ కామ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సంస్థ గత త్రైమాసికంలో ఆశించిన స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో సంస్థకు 1.2 లక్షల కస్టమర్లు వచ్చారు. ఫిన్ టెక్ సేవలు ఆరంభించిన నాలుగేళ్లలో ఆర్థికంగా ఎంతో బలోపేతం అయ్యామని, క్లయింట్స్కు అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా సేవలు అందిస్తున్నట్లు కంపెనీ సీఈవో ప్రకాశ్ తెలిపారు.
అనిశ్చితుల సమయంలో ఉద్యోగుల ప్రయోజనాలు
ఏప్రిల్ - జూన్ క్వార్టర్లోను కంపెనీ వృద్ధి ఉంటుందని భావిస్తోంది. అనిశ్చితులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల ప్రయోజనాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ, ముందుకు సాగుతున్నట్లు తెలిపింది. ఉద్యోగుల వేతనాలు 7 శాతం నుండి 15 శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపారు. సిబ్బందిలో మరింత ఉత్సాహం నింపేందుకు బోనస్ ఇస్తున్నామన్నారు.
950 మంది ఉద్యోగులు
ఈ సంస్థలో 950 మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. సగటు వయస్సు 28గా ఉంది. 5పైసా డాట్ కామ్ కస్టమర్లకు వైవిధ్యమైన ఆర్థిక ఉత్పత్తుల సేవలు అందించే ఆన్ లైన్ వేదిక. 5.5 లక్షల మంది కస్టమర్లకు సేవలు అందిస్తోంది. ఇది తన ప్లాట్ ఫామ్ ద్వారా ఈక్విటీ, డెట్, బంగారంల్లో సేవలు అందిస్తోంది.