5G Services: భారత్ లో 5G సేవలు.. అక్టోబర్ నుంచి ప్రారంభం.. ముందుగా ఈ నగరాలకే..!
5G Services: ఆధునిక ప్రపంచంలో ఇంటర్నెట్ చాలా ముఖ్యమైన సేవగా మారిపోయింది. ఏ పని జరగాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా, ఏ పని చేయాలన్నా.. ఇలా ఒకటేమిటి ప్రతి పనిలోనూ పత్యక్షంగానో లేదా పరోక్షంగానో అంతర్జాల సేవలు అవసరం ఉంది. ఈ తరుణంలో అందరూ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 5జీ సేవలు మరి కొద్ది రోజుల్లో వినియోగదారులకు అందనున్నాయి.
కేంద్ర మంత్రి ప్రకటన..
అక్టోబర్ 12 నాటికి దేశంలో 5G సేవలను ప్రారంభించనున్నట్లు కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ప్రకటించారు. రానున్న 2-3 ఏళ్లలో ప్రతి ప్రాంతానికీ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ఇవి సరసమైన ధరలకు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. టెలికారం రంగం పట్టణాలనే కాక గ్రామీణ ప్రాంతాలపై కూడా ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన ఇన్స్టాలేషన్లను టెలికాం కంపెనీలు చేస్తున్నాయని వెల్లడించారు.
స్పెక్ట్రమ్ బిడ్డింగ్..
టెలికాం స్పెక్ట్రమ్ దేశంలోనే రికార్డు విలువైన రూ.1.5 లక్ష కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. ఇందులో అంబానీకి చెందిన జియో సంస్థ అత్యధికంగా రూ.87,946.93 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ బిడ్డింగ్ దాఖలు చేసింది. 5జీ సేవల వల్ల ఇంటర్నెట్ వేగం 10 రెట్లు పెరుగుతుందని తెలుస్తోంది.
కంపెనీల చెల్లింపులు..
ఇటీవలి వేలంలో గెలుచుకున్న స్పెక్ట్రమ్ కోసం భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, అదానీ డేటా నెట్వర్క్స్, వొడాఫోన్ ఐడియాలు సుమారు రూ.17,876 కోట్లను చెల్లించారు. బిడ్డర్లు ముందస్తు చెల్లింపులు చేసిన అదే రోజున స్పెక్ట్రమ్ అసైన్మెంట్ లేఖలను జారీ చేసింది.
మెుదటి విడతగా ఈ నగరాల్లోనే..
దశల వారీగా 5G సేవ ప్రారంభించేందుకు కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. మొదటి దశలో కేవలం 13 ఎంపిక చేసిన నగరాలు మాత్రమే వేగవంతమైన ఇంటర్నెట్ సేవను పొందుతాయి. తొలిదశలో.. అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్నగర్, కోల్కతా, లక్నో, ముంబై, పూణే నగారాల్లోని ప్రజలకు సేవలు అందుబాటులోకి వస్తాయి.