జనవరి నుండి 50 శాతం ఐటీ ఉద్యోగులు మూడు రోజులు కార్యాలయానికి
భారత ఐటీ పరిశ్రమకు చెందిన దాదాపు సగం మంది ఉద్యోగులు వచ్చే జనవరి నాటికి వారానికి మూడు రోజుల పాటు కార్యాలయానికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు పలువురు ఉద్యోగులను కార్యాలయానికి రప్పిస్తున్నాయి. ఈ మేరకు ఉద్యోగులకు సమాచారం కూడా అందించాయి. నాస్కాం-ఇండీడ్ సర్వే ప్రకారం జూనియర్, సీనియర్ ఉద్యోగులు కార్యాలయానికి రానున్నారు. ఈ మేరకు 150 టెక్ కంపెనీలు, 6,000 మంది ఉద్యోగులతో ఈ సర్వే నిర్వహించింది. టెక్నాలజీ ఇండస్ట్రీ బాడీ నాస్కాం.. జాబ్ పోర్టల్ ఇండీడ్తో కలిసి ఈ సర్వే నిర్వహించింది.
హైబ్రిడ్ విధానం
ఒక వారంలో కొద్ది రోజులు ఇంట్లో మరికొద్ది రోజులు కార్యాలయాల్లో పని చేసే (హైబ్రిడ్) విధానానికే ఐటీ ఉద్యోగులు, సంస్థల యాజమాన్యాలు మొగ్గు చూపుతున్నాయని నాస్కామ్, ఇండీడ్ సంయుక్తంగా నిర్వహించిన నివేదిక తెలిపింది. జనవరి నుండి వారంలో మూడు రోజులు ఉద్యోగులు ఆఫీస్లకు వచ్చి పనిచేసే అవకాశముందని నాస్కామ్ రిటర్న్ టు వర్క్ప్లేస్ సర్వే నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం మిడిల్ మేనేజ్మెంట్తో పోలిస్తే జూనియర్ (25 ఏళ్ల లోపు), సీనియర్ (40 ఏళ్లకు పైబడిన) ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మహిళా ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారు. కొత్త పని విధానానికి అలవాటు పడేందుకు సిద్ధంగా ఉన్నారు.
జనవరి నుండి
జనవరి నుండి కనీసం 50 శాతం ఉద్యోగులను ఆఫీస్ నుండి పని చేయించే ఉద్దేశంతో ఉన్నట్లు 72 శాతం కంపెనీలు తెలిపాయి. హైబ్రిడ్ విధానానికి 70 శాతం కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. మున్ముందు ఈ తరహా పని విధానమే కొనసాగే అవకాశముందని ఈ నివేదిక వెల్లడించింది. నెల రోజుల్లో కార్యాలయాలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని 28 శాతం మంది, 6 నెలల తర్వాత వస్తామని 24 శాతం మంది ఉద్యోగులు తెలిపారు. ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించే విషయంలో డేటా భద్రత, క్లయింట్స్ ప్రాధాన్యం, వ్యాక్సీన్ వేయించుకోవడం వంటి అంశాలుగా ఉంటాయని నివేదిక తెలిపింది.
81 శాతానికి పైగా సంస్థలు
ఆఫీస్లు తిరిగి తెరిచే క్రమంలో 81 శాతానికి పైగా సంస్థలు ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతలకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నాయి. 72 శాతం కంపెనీలు సగం సిబ్బందితో వచ్చే ఏడాది నుండి కార్యాలయాలకు రప్పించాలని భావిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో పనిలో కొత్త విధానాలను తీసుకు రావాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా వారానికి మూడు రోజులు ఇంటి నుంచి, మూడు రోజులు ఆఫీస్ నుండి ఉద్యోగుల చేత పని చేయించుకోవాలని డెబ్బై శాతం కంపెనీలు భావిస్తున్నాయి.