ఆర్బీఐ రెపో రేటు ఎఫెక్ట్, రియాల్టీ పైన ప్రభావం ఎంతంటే?
అందరూ ఊహించినట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రెపో రేటును పెంచింది. బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా చెబుతారు. ఈ వడ్డీ రేటును తాజాగా 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో 4.9 శాతానికి చేరుకుంది. మే 4వ తేదీన రెపో రేటు 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో అప్పుడు 4.40 శాతానికి చేరుకుంది. ఐదు వారాల్లో 90 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఇందుకు అనుగుణంగా రెపో రేటు ఆధారిత రుణాలను బ్యాంకులు పెంచుతాయి. అప్పుడు హోమ్ లోన్, వెహికిల్ లోన్ సహా ఇతర రుణాలు భారమవుతాయి.
కరోనా మహమ్మారి నేపథ్యంలో హోమ్ లోన్ వడ్డీ రేటు దశాబ్ద కనిష్టానికి పడిపోయింది. అయితే నెల రోజుల్లోనే వడ్డీ రేటు 0.9 శాతం పెరగడంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు హఠాత్తుగా భారీగా పెరిగే అవకాశముంది. కాబట్టి హోమ్ లోన్స్ భారంగా మారి, డిమాండ్ స్వల్పకాలంలో తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థిరాస్థి కన్సల్టింగ్ సంస్థలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. పెంపుకు అనుగుణంగా ప్రజల మైండ్ సెట్ అయ్యే వరకు డిమాండ్ తగ్గవచ్చునని అంటున్నారు.
రెపో రేటును పెంచడం వల్ల హోమ్ లోన్స్ భారంగా మారుతాయని, దీంతో స్వల్పకాలంలో ఇళ్లకు డిమాండ్ నెమ్మదిస్తుందని అంటున్నారు. వడ్డీ రేట్లు నెల రోజుల్లోనే 90 బేసిస్ పాయింట్లు పెరుగుతోందని, ఇది హోమ్ లోన్, రియాల్టీ రంగంపై ప్రభావం చూపిస్తుందని అనరాక్ చైర్మన్ అంటున్నారు. ఇటీవల వడ్డీ రేటు తక్కువగా ఉన్న సమయంలో కొనుగోళ్ళు పెరిగాయని, అయితే ఇప్పుడు నిర్మాణ వ్యయాలు పెరగడానికి తోడు, వడ్డీ రేట్లు పెరిగితే ఈఎంఐ భారమవుతుందని, కాబట్టి స్వల్పకాలంలో రియాల్టీ రంగంపై ప్రభావం ఉంటుందని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ అన్నారు. ఇతర రియాల్టీ సంస్థలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి.