Hyderabad: దేశానికి తెలంగాణ అభివృద్ధి అవసరం.. 5 ట్రిలియన్ ఎకానమీపై KTR కామెంట్స్
KTR News: తెలంగాణ మాదిరిగా వృద్ధితో ముందుకు సాగితే భారత్ ఇప్పటికే 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారి ఉండేదని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిర్వహించిన బియాండ్ ఇండియా@75పై జరిగిన సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు.
పెరిగిన ప్రజల ఆదాయం..
తెలంగాణ రాష్ట్రం పనితీరు కనబరుస్తున్నప్పటికీ శిక్షార్హులేనని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్గా అవతరిస్తున్న హైదరాబాద్ ఫార్మా సిటీ, టెక్స్టైల్స్ రంగంలో దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లభించదని వ్యాఖ్యానించారు. 2014లో రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.1.24 లక్షలు ఉండగా.. ప్రస్తుతం అది రూ.3.17 లక్షలకు చేరుకుందని తెలిపారు. అలాగే 2014లో GSDP రూ.5.06 లక్షల కోట్ల నుంచి ప్రస్తుతం రూ.13.27 లక్షల కోట్లకు పెరిగిందని కేటీఆర్ తెలిపారు.
శాసనసభ హామీలు మాటలే..
అలాగే రాష్ట్రం విడిపోయే సమయంలో కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక కారిడార్లను ప్రోత్సహిస్తామని, ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామంటూ హామీ ఇచ్చిందని అన్నారు. అయితే వాగ్ధానం ఇచ్చి 9 ఏళ్లు గడిచినా కార్యరూపం దాల్చలేదని తెలిపారు. శాసనసభలో ఇచ్చిన హామీలను గౌరవించనప్పుడు.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని పిలవడంలో పవిత్రత ఎక్కడ ఉంది? అని అన్నారు. తెలంగాణలో లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ విలువ 2021లో 50 బిలియన్ డాలర్లు ఉండగా.. 2022లో 80 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే దీనిని 2030 నాటికి దీనిని 250 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.
వ్యాక్సిన్ రాజధానిగా..
ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా మారిన హైదరాబాద్ 9 బిలియన్ డోస్లు ఉత్పత్తి అవుతున్నాయని కేటీఆర్ తెలిపారు. 'మేక్ ఇన్ ఇండియా' నిజంగా వాస్తవరూపం దాల్చిందా అంటూ ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభను ఆకర్షించేందుకు హైదరాబాద్ వంటి 'ఎకనామిక్ ఇంజన్లు' భారత్కు అవసరమని మంత్రి కేటీఆర్ అన్నారు. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య అని, మెరుగైన పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలకు ప్రోత్సాహం అందించకపోతే, మనకు మనమే గొప్ప అపచారం చేసుకుంటున్నామని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.