44th GST Council meeting: అప్పులకు అనుమతి ఇవ్వండి:హరీష్ రావు
హైదరాబాద్: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో దేశ రాజధానిలో ముగిసిన వస్తు, సేవా పన్ను కౌన్సిల్ (44th GST Cuncil meeting) సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక అంశాలను ప్రస్తావించింది. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇందులో పాల్గొన్నారు. బూర్గుల రామకృష్ణారావు భవన్లోని తన ఛాంబర్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఈ భేటీకి హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా వైరస్ మిగిల్చిన సంక్షోభ పరిస్థితుల్లో తమ ప్రభుత్వం ఏదుర్కొంటోన్న ఆర్థిక పరిస్థితులను కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు.
ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు..
ఆర్థిక లోటును భర్తీ చేసుకోవడానికి ఉద్దేశించి కేంద్రం.. తమ రాష్ట్రానికి విధించిన రుణాల పరిమితిని పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని హరీష్ రావు విజ్ఙప్తి చేశారు. ఫిస్కల్ రెస్పాన్స్బిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ (FRBM) కింద ప్రస్తుతం తాము రుణాలను తీసుకోవడానికి నాలుగు శాతం వరకు మాత్రమే అనుమతి ఉందని, దీన్ని అయిదు శాతానికి పెంచాలని కోరారు. స్థూల జాతీయోత్పత్తిలో అయిదు శాతం మేర రుణాలను చేయడానికి అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు.
లాక్డౌన్ వల్ల తగ్గిన రాబడి..
కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉధృతిని నివారించడానికి తెలంగాణలో లాక్డౌన్ అమలు చేస్తోన్నామని, ఫలితంగా రోజువారీ రాబడి మరింత క్షీణించిందని నిర్మల సీతారామన్కు వివరించారు. లాక్డౌన్ వల్ల ఒక్క మే నెలలోనే 4,100 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయామని, దీన్ని భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎఫ్ఆర్బీఎం కింద రుణాలు చేయడానికి ఉన్ననాలుగు శాతం పరిమితిని అయిదు శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు. రుణ పరిమితిని పెంచుకోవడానికి రాష్ట్రాలకు అనుమతి ఇవ్వడం వల్ల ఆర్థిక వెసలుబాటు కల్పించినట్టవుతుందని అన్నారు.
|
వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం..
కరోనా వ్యాక్సిన్ పంపిణీని కేంద్ర ప్రభుత్వమే చేపట్టినందు వల్ల.. దాన్ని వేగవంతం చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రంపైనే ఉందని హరీష్ రావు గుర్తు చేశారు. జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని కేంద్రం చేసిన ప్రకటనను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్రాల డిమాండ్లు, అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్ను దిగుమతి చేయాలని సూచించారు. ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్పైనే ఆధారపడి వ్యాక్సినేషన్ కొనసాగుతున్నందున.. అవి చాలట్లేదని, మరిన్ని టీకాలకు అనుమతి ఇవ్వాలని హరీష్ రావు పేర్కొన్నారు.
|
వాటిని స్వాగతిస్తున్నాం..
థర్డ్ వేవ్ సైతం ఆవరించే పరిస్థితులు ఉన్నాయంటూ నిపుణులు హెచ్చరిస్తోన్నారని, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన నిర్మల సీతారామన్కు సూచించారు. బ్లాక్ ఫంగస్ నివారణకు అవసరమైన యాంఫోటెరిసిన్ బీ, టోసిలిజుమాబ్ వంటి మెడిసిన్లపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని హరీష్ రావు అన్నారు. అలాగే- ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, ఆక్సీమీటర్లు, హ్యాండ్ శానిటైజర్లు, వెంటిలేటర్లు, ఐసీయూ పరికరాలపై పన్నును కుదిస్తూ మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులను ఆమోదిస్తున్నామని అన్నారు. దీనివల్ల దిగువ మధ్య తరగతి, పేదలకు లబ్ది కలుగుతుందని హరీష్ రావు వ్యాఖ్యానించారు.