44th GST Council: రెండువారాల్లోనే మళ్లీ కీలక భేటీ: వాటిపై జీఎస్టీ రద్దుకు..!
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతోంది. రోజువారీ కేసుల్లో భారీ తగ్గుదల నమోదవుతోంది. కొద్దిరోజులుగా లక్షకు దిగువగా కొత్త కేసులు నమోదవుతోన్నాయి. కంటికి కనిపించని ఈ మహమ్మారి వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్లోకి జారుకున్న పలు రాష్ట్రాలు క్రమంగా వాటికి సడలిస్తోన్నాయి. దశలవారీగా అన్లాక్ను అమలు చేస్తోన్నాయి. సుదీర్ఘకాలం పాటు లాక్డౌన్లో కొనసాగడం వల్ల రాష్ట్రాల ఆర్థిక వనరులు దెబ్బతిన్నాయి.
మేహుల్ చోక్సీ బెయిల్పై హైకోర్టు కీలక నిర్ణయం: చైనా ఆసుపత్రిలో ట్రీట్మెంట్
ఈ పరిస్థితుల నేపథ్యంలో- వస్తు, సేవా పన్ను కౌన్సిల్ (GST Cuncil) మరోసారి సమావేశమైంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సారథ్యంలో ఈ ఉదయం 11:30 గంటలకు జీఎస్టీ కౌన్సిల్ ఆరంభమైంది. ఇది 44వ జీఎస్టీ కౌన్సలి సమావేశం (44th GST Council meeting). కిందటి నెల 28వ తేదీన 43వ జీఎస్టీ భేటీ ముగిసిన విషయం తెలిసిందే. అతి కొద్ది సమయంలోనే మరోసారి సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
నిర్మల సీతారామన్ నేతృత్వం వహించిన ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో కొనసాగుతోంది. అన్ని రాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులు దీనికి హాజరయ్యారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోన్న ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, సిలిండర్లు, వెంటిలేటర్లు, ఐసీయూ ఉపకరణాలపై కేంద్ర ప్రభుత్వం 12 శాతం జీఎస్టీని వసూలు చేస్తోన్న విషయం తెలిసిందే. రెమ్డెసివిర్ ఇంజెక్షన్లపైనా 12 శాతం జీఎస్టీని విధించింది. ఇక పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్లపై ఏకంగా 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.
తాజాగా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోన్న స్పుత్నిక్ వీ (Sputnik V) వ్యాక్సిన్పైనా జీఎస్టీ విధించింది. అయిదు శాతం జీఎస్టీ (5% GST)ని వసూలు చేస్తోంది. దీనివల్ల స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ రేటు 47 రూపాయల మేర పెరిగింది. వాటిపై జీఎస్టీని పూర్తిగా ఎత్తేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. దేశవ్యాప్తంగా అందిన విజ్ఞప్తులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ మధ్యాహ్నం 2:30 గంటలకు నిర్మల సీతారామన్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను ఆమె వెల్లడిస్తారు.