2015-19 మధ్య మాల్యా, నీరవ్ సహా 38 మంది ఆర్థిక నేరగాళ్లు పారిపోయారు
వివిధ బ్యాంకుల నుండి వేలకోట్ల రుణాలు తీసుకొని, గత అయిదేళ్ల కాలంలో దేశం విడిచిపారిపోయి, విచారణ సంస్థల కేసులు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్తలు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఇష్టారీతిన రుణాలు తీసుకొని, వాటిని చెల్లించకుండా, ప్రభుత్వం తమపై చర్యలు తీసుకుంటుందనే భయంతో చాలామంది పారిపోయారు.
అయినప్పటికీ వారిని రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలను రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇందుకు ఆ దేశ న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తోంది. గతంలో రుణాలు తీసుకొని, 2015 జనవరి 1వ తేదీ నుండి 2019 డిసెంబర్ 31వ తేదీ మధ్య దేశం విడిచిపారిపోయిన బిజినెస్మెన్ 38 మంది ఉన్నారు.
బంగారం రూ.52,000 వద్ద ఆగిపోతుందా, మార్చి దిశగా సాగుతోందా?
38 మంది పారిపోయారు.. కేసులు
వేలకోట్ల రుణాలు తీసుకొని, దేశం విడిచిపారిపోయిన 38 మందిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) కేసులు నమోదు చేసినట్లు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. పార్లమెంటుకు తెలిపారు. ఈ జాబితాలో విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ తదితరులు ఉన్నారు. '1.1.2015 నుంచి 31.12.2019 మధ్యకాలంలో బ్యాంకుల్లో ఆర్థిక అవకతవకలకు సంబంధించి సిబిఐ నమోదు చేసిన కేసుల్లో 38 మంది వ్యక్తులు దేశం నుంచి పారిపోయారని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) తెలియజేసింది' అని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
గత ఏడాది 11మంది, అంతకుముందు 27 మంది
మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002, ప్రకారం 20మంది ఆర్థిక నేరస్తులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు అంతకుముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పినట్లు ఠాకూర్ తెలిపారు. ఆ తర్వాత 14 కేసుల్లో వారిని రప్పించడం కోసం వివిధ దేశాలకు అభ్యర్థనలు పంపించినట్లు తెలిపారు. 2019 జనవరి నుండి 2019 డిసెంబర్ మధ్య 11 మంది ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోయారని, అంతకుముందు 27 మంది పారిపోయినట్లు తెలిపారు. ఈ 27 మంది ఆర్థిక నేరాలు, రుణఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. వ్యాపారవేత్తలు, వ్యక్తులు మోసపూరితంగా రుణాలు పొందకుండా, దేశం నుండి పారిపోకుండా నిరోధించేందుకు ఇప్పుడు విధానాలు చేపట్టినట్లు తెలిపారు.
అందుకే చట్టం
పారిపోయిన ఆర్థిక నేరస్తుల చట్టం, 2018 ప్రకారం కంపెనీల ప్రమోటర్లు, డైరెక్టర్లు పాస్పోర్ట్ సర్టిఫైడ్ కాపీనీ సమర్పించాలని బ్యాంకులకు ఆదేశించినట్లు తెలిపారు. 50 కోట్ల విలువైన రుణాలు తీసుకున్న వారికి ఇది తప్పనిసరి చేసినట్లు తెలిపారు. బ్యాంకుల నివేదిక ప్రకారం 8,121 కేసుల్లో రికవరీ సూట్స్ నమోదు చేశారు. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు రూ.14,000 కోట్లు, విజయ్ మాల్యా రూ.9000 కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన విషయం తెలిసిందే.