మహిళల్లో మార్పు: స్థోమత ఉన్నప్పటికీ 37% మంది వద్ద బంగారం లేదు
ప్రపంచంలోనే బంగారాన్ని ఎక్కువగా వినియోగించే వారిలో భారతీయులు మొదటి స్థానంలో ఉంటారు. మన దేశంలో దాదాపు మహిళలంతా బంగారాన్ని ధరించేందుకు ఆసక్తి చూపిస్తారు. కానీ ఇప్పటి వరకు 37 శాతం మంది మహిళలు బంగారాన్ని కొనుగోలు చేయలేదట. దీనిని భవిష్యత్తులో కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు వరల్డ్ గోల్డ్ కౌన్సెల్ (WGC) నివేదిక బుధవారం వెల్లడించింది.
భారీగా తగ్గిన బంగారం ధర, అక్కడ జపాన్ ప్యాకేజీ ఎఫెక్ట్! ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా?
37% మంది
WGC నివేదిక ప్రకారం దేశంలో బంగారు ఆభరణాల రిటైల్ డిమాండ్కు తగినంత అవకాశాలు ఉన్నాయని, ఎందుకంటే ఇప్పటి వరకు 37 శాతం మంది మహిళలు బంగారాన్ని కొనుగోలు చేయలేదని చెప్పారని, భవిష్యత్తులో కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. WGC తన 'రిటైల్ గోల్డ్ ఇన్సైట్స్: ఇండియా జ్యువెల్లరీ' నివేదికలో పలు అంశాలను పొందుపరిచారు. 60 శాతం మంది మహిళలు ఇప్పటికే బంగారు ఆభరణాలు కలిగి ఉన్నారు. ఫ్యాషన్, లైఫ్ స్టైల్ షాపర్స్లలో బంగారం రెండవ అత్యంత ప్రాచుర్యం పొందింది. బంగారం కంటే ముందు డిజైనర్ బట్టలు, పట్టుచీరలు ఉన్నాయి.
బంగారంపై.. మహిళల్లో మార్పు
బంగారం వినియోగంలో మహిళలదే అగ్రస్థానం. కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వారి మైండ్ సెట్ మారుతోంది. పసిడి కొనుగోళ్ల విషయంలో దేశంలోని నగర, గ్రామీణ మహిళల అభిప్రాయాల్లో వ్యత్యాసం ఉంది. నగరాలు, పట్టణాల్లోని మహిళలు బంగారాన్ని భద్రత కోణంలోనే చూస్తున్నారని ఈ నివేదికలో వెల్లడైంది. తమ స్టేటస్ సింబల్గా, సంపదలో ఒకటిగానే భావిస్తున్నారు. గ్రామీణ మహిళలు ఇష్టంతో కొంటున్నారు. సమాజంలో గౌరవప్రదమైనదిగా పరిగణిస్తున్నారు. రెండువేల మంది గ్రామీణ, నగర, పట్టణ మహిళలతో ఈ సర్వేను చేపట్టారు.
కొనే స్థోమత ఉన్నప్పటికీ..
దాదాపు 37% మహిళలు బంగారాన్ని కొనే స్థోమత ఉన్నప్పటికీ కొనలేదు. అయితే భవిష్యత్తులో కొనాలనే యోచనలో ఉన్నారు. దీంతో బంగారు ఆభరణాల పరిశ్రమకు కొత్త వినియోగదారులు కానున్నారు. ఇందులో 44% మంది గ్రామీణ ప్రాంతాల వారు ఉండగా, 30% మంది పట్టణ ప్రాంతాలవారు ఉన్నారు. బంగారం మన్నికైనదే కాకుండా చక్కని పెట్టుబడి సాధనమని, కుటుంబ వారసత్వ సంపద అని, మహిళలకు ఇది చక్కని ఎంపిక అని ఈ సర్వే తెలిపింది.
వారికి మక్కువ
నేటి మహిళల అవసరాలను పసిడి తీర్చలేకపోతోందని ఈ సర్వే తెలిపింది. అదే సమయంలో 18-24 ఏళ్ల వయస్సులోని భారతీయ మహిళల్లో 33% మంది గత ఏడాది కాలంలో బంగారం ఆభరణాలను కొనుగోలు చేసినట్టు WGC నివేదిక తెలిపింది. అంటే వీరిలో బంగారంపై మోజు తగ్గుతోంది. ముఖ్యంగా పట్టణ యువ మహిళల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. దేశంలోని 1,017 మంది గ్రామీణ మహిళలు, 1,023 మంది పట్టణ మహిళలతో ఆన్ లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ నివేదిక రూపొందించారు.
మహిళల ఆసక్తి
భారతీయ మహిళల్లో 62% మంది డిజైనర్/చీరలు, 60% మంది బంగారు ఆభరణాలు, 57% మంది వెండి ఆభరణాలు , 50% మంది లగ్జరీ కాస్మెటిక్స్, 49% మంది డిజైనర్ యాక్సెసరీస్, 44% మంది వియరబుల్ గాడ్జెట్స్, 41% మంది స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్లెట్, 32% మంది విలువైన చేతి గడియారాలు, 26% మంది వజ్రాభరణాలపై ఆసక్తి కనబరిచారు.