Crorepaties: ఆ కంపెనీలో పెరుగుతున్న కోటీశ్వరులు.. 220 మందికి ఏకంగా కోటికిపైనే శాలరీ..
ITC Salaries: ఏడాదికి కోటి రూపాయల ప్యాకేజీ పొందటం అంటే మాటలు కాదు. కానీ ఇలా కోట్లకు కోట్లు జీతాలుగా అందుకుంటున్న వారి సంఖ్య ఈ కంపెనీలో పెరుగుతూనే ఉంది. విషయం ఏమిటంటే.. ఐటీసీ గ్రూప్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో కోటి రూపాయల కంటే ఎక్కువ జీతం అందుకుంటున్న ఉద్యోగుల సంఖ్య 44 శాతం పెరిగింది. కంపెనీ వార్షిక నివేదికలో ఈ సమాచారం తెలపబడింది. ITC తాజా వార్షిక నివేదిక ప్రకారం.. FY 2021-22లో నెలకు రూ. 8.5 లక్షలు లేదా సంవత్సరానికి రూ. కోటి కంటే ఎక్కువ సంపాదిస్తున్న ITC ఉద్యోగుల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో 153 నుంచి 220కి పెరిగింది.
కంపెనీ నివేదికలో ఏమి చెప్పిందంటే..
"220 మంది ఉద్యోగులు ఏడాది పొడవునా పనిచేశారు. రూ. 102 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో వేతనం పొందుతున్నారు. సంవత్సరంలో కొంత కాలం పాటు ఉద్యోగంలో ఉన్నారు. ఆర్థిక సంవత్సరంలో నెలకు రూ. 8.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకున్నారు. మార్చి 31, 2022తో ఆర్థిక సంవత్సరం ముగిసింది" అని వార్షిక నివేదిక పేర్కొంది.
టాప్ మేనేజ్ మెంట్ జీతాలు ఇలా..
FY22లో ITC ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరి తీసుకున్న స్థూల వేతనం 5.35 శాతం పెరిగి రూ. 12.59 కోట్లకు చేరుకుంది. ఇందులో వేతనం రూ. 2.64 కోట్లు, రూ. 49.63 లక్షల పెర్క్విసిట్లు లేదా ఇతర ప్రయోజనాలు, రూ. 7.52 కోట్లు పెర్ఫామెన్స్ బోనస్ ఉన్నాయి. పూరీ జీతం మొత్తం ఉద్యోగుల మధ్యస్థ రెమ్యూనరేషన్ నిష్పత్తిలో 224:1 గా ఉందని వార్షిక నివేదిక పేర్కొంది. FY21లో పూరి గ్రాస్ రెమ్యునరేషన్ 11.95 కోట్లుగా ఉంది. ఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.సుమంత్, ఆర్. టాండన్ సమానంగా రూ. 5.76 కోట్లు జీతం అందుకుంటున్నారు. ఇదే సమయంలో రూ. 5.60 కోట్లు ఎన్. ఆనంద్ FY22లో జీతం రూపంలో పొందారు.
ఉద్యోగుల వివరాలు..
మార్చి 31, 2022 నాటికి మొత్తం ITC ఉద్యోగుల సంఖ్య 23,829గా ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 8.4 శాతం తక్కువ. ఇందులో 21,568 మంది పురుషులు, 2,261 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. వీరు కాకుండా కాంట్రాక్ట్ లేదా తాత్కాలిక ప్రాతిపదికన 25,513 మంది ఉద్యోగులు ఉన్నారు. గతంలో మార్చి 31, 2021 నాటికి ITC మొత్తం ఉద్యోగుల సంఖ్య 26,017గా ఉంది.
కంపెనీ లాభాలు..
FY22లో ITC ఉద్యోగుల సగటు వేతనం 7 శాతం పెరిగింది. అయితే ఉద్యోగుల మధ్యస్థ వేతనం 4 శాతం పెరిగింది. కీ మేనేజర్ పర్సనల్ (KMPలు) సగటు వేతనం 8 శాతం పెరిగింది. మార్చి 31, 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఐటీసీ స్థూల ఆదాయం రూ. 59,101 కోట్లుగా ఉంది. ఇది క్రితం ఏడాది రూ.48,151.24 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ తన వార్షిక నివేదికలో వెల్లడించింది.