బీఎస్ఎన్ఎల్ VRS స్కీంకు అనూహ్య స్పందన, 2 రోజుల్లో 22,000 మంది దరఖాస్తు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ BSNLలో తీసుకువచ్చిన వీఆర్ఎస్ పథకానికి ఉద్యోగుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రెండు రోజుల్లో ఏకంగా 22,000 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సీనియర్ అధికారులు చెబుతున్నారు. నవంబర్ 5వ తేదీన ప్రారంభమైన పథకానికి డిసెంబర్ 3వ తేదీ వరకు తుది గడువు ఉంది. దాదాపు 80,000 మంది వరకు వీఆర్ఎస్ పథకం ఎంచుకుంటారని అంచనా. అయితే రెండు రోజుల్లోనే 22వేల మంది వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 13,000 మంది గ్రూప్ సీ కేటగిరీకి చెందినవారున్నారు.
ఇదిలా ఉండగా, ఆల్ ఇండియా భారత్ సంచార్ నిగమ్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ (AIBSNEA) తాజాగా కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్కు ఓ లేఖ రాసింది. పే రివిజన్ డిమాండ్ చేసింది. 2017 జనవరి నుంచి పే రివిజన్ అమల్లోకి రావాలని, ఆ తర్వాతే వీఆర్ఎస్ అని డిమాండ్ చేస్తున్నారట.
BSNLలో 80,000 మందికి వీఆర్ఎస్! దరఖాస్తు తేదీ, అర్హులు: 58 ఏళ్లకే రిటైర్మెంట్?
VRS స్కీం ఇటీవల ప్రారంభమైంది. ఈ స్కీంకు 1 లక్షమందికి వరకు ఎలిజిబుల్ కాగా, 70వేల నుంచి 80 వేలమంది ఈ పథకాన్ని ఉపయోగించుకునే అవకాశముందని భావిస్తున్నారు. ఈ పథకం ద్వారా వీఆర్ఎస్ తీసుకునే ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గి, రూ.7వేల కోట్ల మేర జీతభత్యాల వ్యయ భారం తగ్గే అవకాశముందని BSNL అంచనా వేస్తోంది. బీఎస్ఎన్ఎల్లో 1.50 లక్షల మంది నుంచి 1.75 లక్షలమంది వరకు ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 50 ఏళ్లు దాటిన వారు లక్ష వరకు ఉంటారని అంచనా.
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు నవంబర్ 4వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు VRS కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను ఫీల్డ్ యూనిట్లకు అందించామని, వారు ఉద్యోగులందరికీ ఈ వివరాలు చెబుతారని అన్నారు. వీఆర్ఎస్ ఆఫర్ వివరాలు వారి నుంచి తెలుసుకోవచ్చునని చెప్పారు.