ఈసారి కార్పొరేట్లు దీపావళి గిఫ్టులు ఏమిస్తున్నారో తెలుసా?
పండగొచ్చిందంటే నోరు తీపి కావాల్సిందే. ఏ శుభకార్యమైనా, పర్వదినమైనా ఇంట్లో స్వీట్లు, చాకోలెట్లు కనిపిస్తున్నాయి. కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు పండగల సందర్భంగా ఇలాంటి వాటినే ఇస్తుంటాయి. కార్పొరేట్ సంస్థలు ఇంతకు ముందు స్వీట్లు, చాకొలేట్లు, డ్రై ఫ్రూప్ట్స్, టపాసులు, గృహోపకరణాలు బహుమతిగా ఇచ్చేవి. ఇప్పుడు వీటికి కాలం చెల్లిపోయింది. ట్రెండు మారుతోంది. అందుకే ఇప్పుడు రంగురంగుల గ్లాస్ బాటిళ్లు, స్టేషనరీ ఉత్పత్తులు, విత్తనాలు, సోలార్ పవర్ బ్యాంకులు, ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఉత్పత్తులు వంటి వాటిని కార్పొరేట్ బహుమతులుగా ఇస్తున్నారిప్పుడు. వీటికే ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
20 శాతం మార్కెట్ వాటా
ఒక అంచనా ప్రకారం మనదేశంలో బహుమతుల మార్కెట్ పరిమాణం 4.5 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో కార్పొరేట్ బహుమతుల వాటా 20 శాతం వరకు ఉంటుంది. ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ ఉత్పత్తులను దూరం పెట్టాలని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందుకు కార్పొరేట్ కంపెనీలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సారి ప్లాస్టిక్ లేని ఉత్పత్తులను బహుమతులుగా కంపెనీలు తమ ఉద్యోగాలకు ఇస్తున్నాయి.ఈ నేపథ్యంలో రోజువారీగా ఇంట్లో వాడుకునే గ్లాసులను బహుమతిగా ఇస్తున్నారు. దీని వల్ల ఉద్యోగుల్లోనూ పర్యావరణం పై ఆసక్తి పెరుగుతుందని భావిస్తున్నారు. మరోవైపు కొన్ని కంపెనీలు తమ కార్యాలయాల్లో ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగించడం మానేస్తున్నాయి.
మరి కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు విత్తనాలు కలిగిన పెన్సిళ్లను బహుమతిగా ఇస్తున్నాయి. వీటిలో కూరగాయల విత్తనాలు, తులసి లేదా ఇతర ఉపయోగకరమైన విత్తనాలను ఇస్తూ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వీటికి ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఇక మొబైల్ ఫోన్ ఉన్న వాళ్లు తప్పని సరిగా పవర్ బ్యాంకును కొనుగోలు చేస్తుంటారు. సోలార్ ద్వారా ఛార్జింగ్ అయ్యే పవర్ బ్యాంకులు కూడా వస్తున్నాయి. పర్యావరణానికి అనుకూలంగా వుండే ఇలాంటి వాటిని తమ ఉద్యోగులకు కంపెనీలు గిఫ్ట్ గా ఇస్తున్నాయి. వీటితోపాటు రాగి తో తయారు చేసిన లడ్డులను కొంతమంది ఇస్తున్నారు.
డిజిటల్ గిఫ్టులు...
ఈ మధ్యకాలం లో డిజిటల్ గిఫ్ట్ లకు కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. ఇలాంటి గిఫ్ట్ ల వల్ల ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. వీటినే ఉద్యోగులు ఇష్టపడుతున్నారు. తమకు నచ్చిన ఉత్పత్తులను ఇలాంటి గిఫ్ట్ ల ద్వారా కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది.
మందగమన ప్రభావం
దీపావళి కార్పొరేట్ గిఫ్టులపై మందగమన ప్రభావం కనిపిస్తోంది. డిమాండ్ తగ్గిపోవడం వల్ల కంపెనీల అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగడంలేదు. అన్ని రంగాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పండగ బహుమతుల ను కంపెనీలు తగ్గించుకుంటున్నాయి. ఇంతకు ముందు కార్పొరేట్ గిఫ్ట్ ల్లో బంగారం, వెండి పూతతో కూడిన ప్రతిమలు, వెండి కాయిన్లు ఉండేవి. కానీ ఇప్పుడు ఇలాంటివి కనిపించడం లేదు. స్వీట్లు, డ్రై ఫ్రూప్ట్స్ తదితరాలతో కంపెనీలు సరిపెట్టుకుంటున్నాయి.