పాలు, గుడ్డు, లడ్డూ: ఒక్కొక్కరికి రూ.1,062 ఖర్చు చేయాలన్న జగన్, ఎవరికెంత అంటే?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య రాష్ట్రంగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోప నివారణకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారు. పిల్లలకు మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారంపై బుధవారం సమీక్ష నిర్వహించిన ఆయన, పిల్లలు ఏం తింటున్నారో క్షేత్రస్థాయికి వెళ్లి తెలుసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వారికి అందించే ఆహారంలో ఏం మార్పులు చేయాలో సూచించారు. అంతేకాకుండా, రక్తహీనత, పౌష్టికాహార లోపం అధికంగా ఉన్న గిరిజన, సబ్ ప్లాన్ ప్రాంతాల్లోని గర్భిణీలకు కూడా పౌష్టికాహారం పెంచేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
వారికి రూ.4,000 ఇచ్చి, మాకు రూ.400 ఇస్తున్నారు: అమిత్ షాతో జగన్
రూ.1,062 విలువ చేసే ఆహారం అందించాలి
వైయస్సార్ అమృత హస్తం, వైయస్సార్ బాల సంజీవని కింద గర్భవతులు, పిల్లలకు మరింత పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఒక్కో మహిళకు, చిన్నారికి ఎంత మేర ఖర్చు చేయాలనే అంశం కూడా చెప్పారు. ఆయన సూచనల ప్రకారం... గర్భవతులు, బాలింతలకు నెలకు రూ.1062, ఆరునెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలకు నెలకు రూ.600, 3-6 ఏళ్ల లోపు పిల్లలకు నెలకు రూ.560 విలువ కలిగిన పౌష్టికాహారం అందించాలి.
గర్భవతులు, బాలింతలకు ఏం భోజనం పెట్టాలంటే
గర్భవతులు, బాలింతలకు నెలకు రూ.1,062 విలువైన ఆహారంలో 25 రోజుల పాటు భోజనం, గుడ్లు, 200 మి.లీ. పాలు, అదనంగా రూ.500 విలువ చేసే బాల సంజీవిని కిట్ అందించాలి.
6 నెలల నుంచి 3 ఏళ్ల లోపు చిన్నారులకు రూ.600 ఖర్చు
ఆరు నెలల నుంచి 3 ఏళ్ల లోపు చిన్నారులకు ప్రతి రోజు గుడ్డు, 200 మి.లీ. పాలతో పాటు వైయస్సార్ బాలామృతం కిట్ ఇవ్వాలి. నెలకు రూ.2.5 కిలోల పౌష్టికాహారాన్ని ఇవ్వాలి. మొత్తంగా నెలకు రూ.600 విలువ చేసే ఆహారాన్ని ఇంటికే పంపిణీ చేయాలి.
3 నుంచి 6 ఏళ్ల నుంచి పిల్లలకు రూ.560 ఖర్చు
మూడు నుంచి ఆరేళ్ల మధ్య వయస్సు గల పిల్లలకు 25 రోజుల పాటు గుడ్డు, 200 మి.లీ. పాలు అందించాలి. అంగన్వాడీ కేంద్రాల్లోనే భోజనం పెట్టాలి. వీటితో పాటు లడ్డూ, బిస్కట్, పాయసాలలో ఏదైనా ఒక దానిని ఇవ్వాలి. వీరికి నెలకు రూ.560 విలువ చేసే ఆహారం అందించాలి.
పౌల్ట్రీ రైతుల నుంచి తక్కువ ధరకే గుడ్లు
గిరిజన ప్రాంతాల్లో అదనపు పౌష్టికాహారం ఇవ్వడం వల్ల లక్షలాది మంది గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు లబ్ధి చేకూరుతుంది. ఇందుకు రూ.90 కోట్ల మేర అదనపు వ్యయం కానుంది. పిల్లలకు మంచి మెనూతో భోజనం పెట్టడంతో పాటు పోషకాహారం విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. పౌల్ట్రీ రైతుల నుంచి కోడిగుడ్లు కొనుగోలు చేస్తే తక్కువ ధరకు లభిస్తాయని కూడా సూచన చేశారు.
పైలట్ ప్రాజెక్టు
పౌష్టికాహార లోపం, రక్తహీనత అధికంగా ఉన్న 77 గిరిజన, సబ్ ప్లాన్ మండలాల్లో డిసెంబర్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు ఇస్తున్న గుడ్లు, పాలతో పాటు బలవర్ధకమైన ఆహారం అందించాలి. ఆ తర్వాత రాష్ట్రమంతా దీనిని విస్తరిస్తారు. పైలట్ ప్రాజెక్టు కోసం ఎంచుకున్న ప్రాంతాలు... శ్రీకాకుళం జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 7, విశాఖ జిల్లాలో 11, తూర్పు గోదావరి జిల్లాలో 11, పశ్చిమ గోదావరి జిల్లాలో 6 గిరిజన మండలాలు. మొత్తం 36 మండలాలు ఎంపిక చేశారు. సబ్ ప్లాన్ ఏరియాకు సంబంధించి శ్రీకాకుళంలో 19, విశాఖలో 6, తూర్పు గోదావరి 4, పశ్చిమ గోదావరి 3, ప్రకాశం 3, కర్నూలు 3, గుంటూరులో 3 మండలాలు ఎంపిక చేశారు. మొత్తం 41 మండలాలు ఎంపిక చేశారు. ఈ రెండూ కలిపి 77 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు అమలు కానుంది.