ఆ ట్రస్ట్కు రూ.10,000 విరాళమిస్తే శ్రీవెంకటేశ్వరుడి విఐపీ దర్శన టిక్కెట్
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి సంవత్సరం దర్శించుకునే వారు లక్షలాదిమంది ఉంటారు. విదేశాల నుంచి కూడా ఎంతోమంది శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రతి రోజు లక్షలమంది శ్రీవారిని దర్శించుకుంటారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడు వేంకటేశ్వరుడే. కోరికన కోరికలు తీర్చే ఆపదల మొక్కులవాడిగా కోట్లాది మంది పూజలు అందుకుంటున్నారు. అలాంటి ఏడు కొండల స్వామిని దర్శించుకోవాలంటే గంటలు, రోజుల కొద్ది నిరీక్షించాలి. అయితే రూ.10,000 విరాళం ఇస్తే విఐపీ బ్రేక్ దర్శనం మీకు ఉంటుంది.
రూ.10వేల విరాళం ఇస్తే విఐపీ బ్రేక్ దర్శనం
శ్రీవాణి ట్రస్ట్కు రూ.10 వేలు, ఆపైన విరాళం ఇచ్చే దాతలకు సిఫార్సుతో పని లేకుండా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించే విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అదనపు ఈవో ధర్మారెడ్డి అక్టోబర్ 21వ తేదీన ప్రారంభించారు. ట్రస్ట్ గోకులం సముదాయంలో ఇది అందుబాటులోకి వచ్చింది. నెల రోజుల అధ్యయనం తర్వాత దీనిని ప్రారంభించారు. నిన్నటి వరకు ఈ ట్రస్ట్కు రూ.10 లక్షలు వచ్చాయి.
రూ.1 లక్ష దాటితే...
ఈ ట్రస్ట్కు రూ.10,000 నుంచి రూ.99,000 వేల వరకు చెల్లించే దాతలకు ప్రత్యేక ప్రివిలేజ్ కింద బ్రేక్ దర్శనం టికెట్ కేటాయించాలని గతంలో TTD నిర్ణయించింది. ఈ మేరకు అదనపు ఈవో మాట్లాడుతూ.. ఈ ట్రస్టుకు రూ.10వేలు విరాళం ఇస్తే భక్తుడికి ఒక విఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ ఇస్తామని, ప్రోటోకాల్ మర్యాదలతో దర్శనం ఉంటుందన్నారు. భక్తులు ఇచ్చే విరాళం రూ.1 లక్ష దాటితే ఆ మేరకు ఇతర పథకాలపై ఉన్న హక్కులు కూడా వర్తిస్తాయని తెలిపారు. దీనిని ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు తెలిపారు. భక్తుల స్పందన ఆధారంగా కోటా నిర్ణయిస్తామని, నెల ముందే కోటాను తెలియజేస్తామని చెప్పారు.
ఇలా బుక్ చేసుకోవచ్చు
తిరుమల తిరుపతి దేవస్థానం యాప్, వెబ్ సైట్ ద్వారా రానున్న పదిహేను రోజుల పాటు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వీఐపీ దర్శనం బుకింగ్ స్లాట్లో నమోదు చేసుకోవచ్చు. అలాగే, విరాళం అందించిన భక్తులకు ఆరు నెలల్లో దర్శనం ఉంటుంది. శ్రీవాణి ట్రస్టుకు రూ.10వేలు విరాణం ఇచ్చిన దాతలకు ఒక బ్రేక్ దర్శన టిక్కెట్ ప్రివిలేజ్గా ఒకసారి మాత్రమే అందిస్తారు. వెంటనే సదరు దాతలు రూ.500 చెల్లించి బ్రేక్ దర్సన టిక్కెట్ కొనుగోలు చేయవచ్చు.
శ్రీవాణి ట్రస్ట్ నిధులు వీటి కోసం..
ధర్మప్రచారంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి, పురాతన ఆలయాల పరిరక్షణకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా విరాళాలు స్వీకరిస్తున్నారు. శ్రీవాణి ట్రస్టుకు రూ.1 నుంచి ఎంత మొత్తమైనా విరాళంగా ఇవ్వవచ్చు. కానీ రూ.10వేలు ఇస్తే అదనపు ప్రయోజనాలు ఉంటాయి.
కాగా, శ్రీవాణి ట్రస్టుకు చెన్నైకి చెందిన రామయ్య అనే భక్తుడు తొలిసారిగా రూ.40 వేల విరాళం అందచేయడంతో పాటు, ఒక్కొక్కరికి రూ.500 చెల్లించి ధర్మారెడ్డి చేతులమీదుగా 4 బ్రేక్ దర్శన టికెట్లు పొందారు.