ఆదాయ పన్నులో భారీ ఊరట!? శ్లాబుల తగ్గింపు దిశగా కేంద్రం కసరత్తు?
ఆర్థిక మందగమనం నుంచి గట్టెక్కేందుకు ఎన్ని ఉద్దీపన చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు పెద్దగా కానరావడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు.. ఆదాయ పన్ను శ్లాబులను తగ్గించడమే మార్గమని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్థిక శాఖ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఉద్యోగుల వ్యక్తిగత ఆదాయపన్ను శ్లాబులను భారీగా తగ్గించాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. ఏటా బడ్జెట్ సమయంలో ఉద్యోగుల వ్యక్తిగత ఆదాయపన్ను శ్లాబులను తగ్గించాలంటూ వినతులు, అభ్యర్థనలు అందుతున్నా కేంద్ర సర్కారు ఈ దిశగా పెద్దగా కసరత్తు చేయడం లేదు. అయితే దేశ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈసారి దీనిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఐటీ శ్లాబుల తగ్గింపు దిశగా...
వ్యక్తిగత ఆదాయ పన్ను శ్లాబులను తగ్గించాలనే అభ్యర్థనలు ఉద్యోగ వర్గాల నుంచి ఏటా వినిపిస్తున్నవే. కానీ ఈ దిశగా కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ప్రస్తుతం 5 శాతం, 20 శాతం, 30 శాతంగా ఉన్న పన్ను శ్లాబులను 5 శాతం, 10 శాతం, 20 శాతానికి పరిమితం చేయాలనే అంశాన్ని కేంద్రంలోని మోడీ సర్కారు తాజాగా పరిశీలిస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు తదుపరి అజెండా కూడా ఇదేనని ఆ వర్గాలు చెబుతున్నాయి.
. రూ.1.75 లక్షల కోట్లు పోతాయ్...
ఇప్పటికే ‘వ్యక్తిగత ఆదాయ పన్ను'పై అధ్యయనం కోసం మోడీ సర్కారు ఒక టాస్క్ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ఫోర్స్ ఈ అంశాన్ని అన్ని కోణాల్లోనూ పరిశీలించిన అనంతరం ఈ ఏడాది ఆగస్టులో కేంద్రానికి ఒక నివేదిక కూడా సమర్పించింది. ప్రస్తుత పన్ను రేట్లను తగ్గించడంతో పాటు శ్లాబులను హేతుబద్ధం చేయాలని టాస్క్ఫోర్స్ ఆ నివేదికలో ప్రభుత్వానికి సూచించింది. అయితే, ఇలా ఆదాయ పన్ను శ్లాబులను తగ్గించడం ద్వారా కేంద్రానికి సుమారు రూ.1.75 లక్షల కోట్ల మేరకు ఆదాయం తగ్గిపోనుందని సమాచారం.
తగ్గితే.. రాష్ట్రాలకూ దెబ్బేనా?
ఆదాయపన్ను శ్లాబులను తగ్గిస్తే.. ఉద్యోగులకు కలిగే ప్రయోజనం సంగతి పక్కన పెడితే... తద్వారా కోల్పోయే మొత్తం ఆదాయాన్ని ఒక్క కేంద్రమే భరించకుండా.. ఆ భారంలో కొంత భాగాన్ని రాష్ట్రాలపైనా మోపనుందని సమాచారం. ఈ మేరకు 58:42 నిష్పత్తిలో రాష్ట్రాలకు కూడా పన్ను ఆదాయంలో కోత పెట్టనున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ ఇదే గనుక జరిగితే రాష్ట్రాలకు రూ.75 వేల కోట్ల మేర ఆదాయం తగ్గిపోనుంది.
కార్పొరేట్ పన్నును 25 శాతానికి తగ్గించిన నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయపన్నును తగ్గించేందుకు కూడా త్వరలోనే చర్యలు తీసుకోవడం ఖాయంమంటూ ఇటీవల ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్ దేబరాయ్ కూడా వ్యాఖ్యానించారు. దీనినిబట్టి చూస్తే.. ఆదాయ పన్ను శ్లాబుల తగ్గింపుపై కేంద్రం ఒక కృతనిశ్చయంతో ఉన్నట్లు అర్థమవుతుంది.
శ్లాబుల తగ్గింపు అనివార్యం...
ఉద్యోగుల ఆదాయ పన్ను శ్లాబుల తగ్గింపు అనేది అసాధ్యమేమీ కాదని కేంద్ర రెవిన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే వ్యాఖ్యానించారు. బడ్జెట్ అవసరాలు, ద్రవ్యలోటు, ఆదాయ పరిస్థితిని అధ్యయనం చేశాక దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆదాయ పన్ను తగ్గడం ద్వారా వినియోగదారుల వద్ద నగదు నిల్వలు పెరుగుతాయని, ఫలితంగా మార్కెట్లు పుంజుకుంటాయని పాండే వివరించారు. మరోవైపు ఆదాయపన్ను శ్లాబుల తగ్గింపు ప్రతిపాదనను నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ కూడా స్వాగతించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఈ నిర్ణయం అత్యావశ్యకమని, అనివార్యమని ఆయన పేర్కొన్నారు.