దీపావళికి బాంబులు పేలవు, నిషేధిత టపాసుల విక్రయంపై నిఘా!
మరో వరం రోజుల్లో దీపావళి వస్తోంది. దీపావళి అంటేనే బాంబులు, పటాకులు లేదా టపాసుల గోలతో దేశమంతా వెలిగిపోతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలైతే బాంబుల మోత లేనిదే దీపావళి సెలెబ్రేట్ చేసుకోలేరు. పెద్ద వాళ్ళు కూడా పిల్లలై పోయి ఒకరిని మించి మరొకరు బాంబులు కలుస్తుంటారు. ఓవరీ ఇంటి ముందు ఎక్కువ బాంబులు కాల్చిన చెత్త పేరుకు పోతే వారే ఎక్కువ దీపావళి జరుపుకొన్నట్లు లెక్క. అయితే, ఈ సారి దీపావళి మాత్రం బాంబులు పేలేది కష్టమే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. అధిక శబ్దాలు చేసేవి, నిషేధిత పదార్థాలతో చేసిన బాంబులపై సుప్రీమ్ కోర్ట్ బాన్ విధించింది.
ఈపీఎఫ్ఓ బోనస్ శుభవార్త: ఉద్యోగులకు దీపావళి బొనాంజా
రూ 2,500 కోట్ల మార్కెట్...
దేశంలో దీపావళి టపాసుల మార్కెట్ చాలా పెద్దది. ఏటా ఈ రంగం సుమారు రూ 2,500 కోట్ల పరిమాణం కలిగి ఉంటుందని అధికారిక అంచనా. అయితే, అనధికారికంగా ఇది అంతకంటే రెట్టింపు స్థాయిలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తమిళ నాడు లోని శివ కాశి దీపావళి టపాసుల తయారీకి ప్రసిద్ధి. ఆంధ్ర ప్రదేశ్ లో గోదావరి జిల్లాల్లో కూడా వీటిని పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ లో కూడా కొంత మేరకు తయారీ జరుగుతోంది. కానీ వీటిని తయారు చేసే అన్ని ఏరియా ల్లోనూ ప్రమాదాలు జరిగి పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తున్నాయి. దీంతో, టపాసుల తయారీ లైసెన్స్ లేని వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కొంత వరకు వాటి ప్రొడక్షన్ తగ్గింది.
చిచ్చు బుడ్లు, కాకర పూవొత్తులు ...
ఈ సారి దీపావళికి కేవలం గ్రీన్ క్రాకెర్స్ మాత్రమే విక్రయిస్తున్నాయి ఢీల్లీల్లోని షాపులు. ఎందుకంటే, సుప్రీమ్ కోర్ట్ నిషేధం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో ఢిల్లీలో కాలుష్యం తారాస్థాయికి చేరుకోవటంతో ఈ నిబంధనను తూచా తప్ప కుండా అమలు చేస్తున్నారు. అందుకే, ఈ సారి గ్రీన్ టపాసులు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. అంటే, కేవలం చిచ్చు బుడ్లు, కాకర పూవొత్తులు (క్రొకెర్స్) వంటి తక్కువ శబ్దం, పర్యావరణానికి హాని చేయని పదార్థం తో తయారు చేసిన టపాసులు అధికంగా విక్రయిస్తారు. వీటిని సిఎస్ ఐ ఆర్, యెన్ఈ ఈ ఆర్ఐ రూపొందించిన మార్గనిర్దేశకాల ప్రకారం తయారు చేస్తారు. పొటాషియం నైట్రేట్, జీయో లైట్ ను వినియోగిస్తారు. నిషేధిత బాంబుల్లో బేరియం నైట్రేట్ ఉంటుంది. శబ్దాల్లో కూడా సాంప్రదాయ టపాసులు వెలువరించే 160 డెసిబుల్ కంటే తక్కువగా కేవలం 125 డెసిబుల్ శబ్దాలు మాత్రమే గ్రీన్ టపాసులు వెలువరిస్తాయి.
30% పెరిగిన ధరలు...
సుప్రీమ్ కోర్ట్ నిషేధం నేపథ్యంలో దీపావళి టపాసులు తయారు చేసే ముడి సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ముడి సరుకుల ధరలు సుమారు 30% పెరిగి పోయాయి. దీంతో మార్కెట్లో లభించే బాంబుల ధరలు కూడా కనీసం 30 % నుంచి 40% పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే అసలే అంతంత మాత్రంగా ఉన్న అమ్మకాలు మరింత అధికంగా ప్రభివితం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ధరల పెరుగుదలతో పాటు దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం కూడా దీపావళి బాంబుల అమ్మలపై పడుతుందని చెబుతున్నారు.