ప్రజలపై పెను భారం: ఏపీ అప్పులు తీరాలంటే మరో 20 ఏళ్లు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న రూ.2.45 లక్షల కోట్లు అప్పు ఉంది. వీటిని వడ్డీతో సహా తీర్చాలంటే మరో ఇరవై ఏళ్లు పడుతుందని ఆర్థిక శాఖ లెక్కలు కట్టింది. బహిరంగ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి, నాబార్డ్, ఉదయ్, విద్యుత్ సంస్థల నుంచి తీసుకున్న అన్ని రుణాలు కలిపి అక్షరాలా రూ.2,44,941.30 కోట్ల రుణాలు ఉన్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి లెక్కిస్తే వీటిని తీర్చడానికి 2039-2040 వరకు సమయం పడుతుందట. తీసుకున్న రుణాలను ఎప్పుడు ఎంత చెల్లించాల్సి ఉందో లెక్కలు వేసింది. విభాగాల వారీగా లెక్కలు, వడ్డీలు లెక్కించింది.
జగన్ 'రూ.3,500 కోట్ల' భారీ ఊరట: రూ.2 లక్షల వరకు ప్రభుత్వమే ఇస్తుంది
ఎక్కడి నుంచి ఎన్ని రుణాలు తీసుకున్నారంటే?
బహిరంగ మార్కెట్ నుంచి రూ.1,55,376 కోట్లు కేంద్రం నుంచి తీసుకున్న రుణాలు రూ.10,229 కోట్లు, చిన్న మొత్తాల పొదుపు నుంచి రూ.12,504 కోట్లు, ప్రావిడెంట్ ఫండ్, ఇతర సంస్థల నుంచి రూ.14,767 కోట్లు, డిపాజిట్స్, రిజర్వ్ నిల్వలు రూ.52,064 కోట్లు ఉన్నాయి. మొత్తం రూ.2,44,941.30 కోట్ల రుణాలు ఉన్నాయి.
వీటిని తీర్చాలనుకున్నా...
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున రుణాలు తీసుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అవి చెల్లించడంతో పాటు మళ్లీ ఎప్పటికి అప్పుడు వివిధ విభాగాల్లో రుణాలు పెరుగుతుంటాయి. అప్పుడు చెల్లింపులపై ప్రభావం పడుతుంది. నాబార్డు, ఉదయ్ కింద తీసుకున్న రుణాలు రానున్న పది, పన్నెండేళ్లలో తీరుతాయని అంచనా.
అప్పులతో నెట్టుకు రావడమేనా?
గత చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు జగన్ ప్రభుత్వం అప్పులు చేసి నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. ఇప్పటికే జగన్ నవరత్నాలలో భాగంగా వివిధ పథకాలు అమలు చేస్తున్నారు. వీటి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. వీటితో పాటు పోలవరం వంటి ప్రాజెక్టులు నిర్మించాల్సి ఉంది. పోలవరం బాధ్యత కేంద్రానిదే కావడం ఊరట కలిగించే అంశం. ఇటీవల రుణాలపై ఎస్బీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో ఏపీని ఎలా ముందుకు తీసుకు వెళ్తారనేది చర్చనీయాంశంగా మారింది. నిన్న చంద్రబాబు, నేడు జగన్ రుణాలు తీసుకొని పాలిస్తున్నారని, కానీ ఈ భారం పడేదంతా ప్రజల పైనే అంటున్నారు.