మీ కోసం మేం త్యాగం చేయలేం!: అమెరికాకు నిర్మల షాక్, విభేదాలు తగ్గాయి..
వాషింగ్టన్: అమెరికా - భారత్ మధ్య వాణిజ్య విభేదాలు తగ్గిపోతున్నాయని, త్వరలో అన్నీ పరిష్కారమవుతాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు సంయుక్ష వార్థిక సమావేశం కోసం వెళ్లిన ఆమె గురువారం పైవిధంగా మాట్లాడారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశముందన్నారు. ఇరుదేశాల వాణిజ్య శాఖల మధ్య చర్చలు జరుగుతున్నాయని, త్వరలో సానుకూల ఫలితం కనిపిస్తుందన్నారు.
అమెరికా ఆంక్షల కోసం భారత్ త్యాగం చేయదు
భారత్ సహా అన్ని దేశాలు అంతర్జాతీయ ఆంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని, తమ దేశం అదే కోరుకుంటోందని నిర్మలా సీతారామన్ అన్నారు. అదే సమయంలో సొంత బలం, వ్యూహాత్మక ప్రయోజనాలు కొనసాగించాల్సి ఉంటుందన్నారు. వెనిజులా చమురు పరిశ్రమపై జనవరిలో అమెరికా కఠిన ఆంక్షలు విధించింది. ఈ చర్య గ్లోబల్ కస్టమర్లకు ఆందోళన కలిగించింది. అయితే, ప్రత్యామ్నాయాలతో పాటు భారత రిఫైనరీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వెనిజులా క్రూడ్ను రష్యన్ మేజర్ రోస్నెఫ్ట్ నుంచి కొనుగోలు చేస్తోంది. నాలుగు నెలల విరామం తర్వాత సౌత్ అమెరికన్ నేషన్ నుంచి చమురు లోడింగ్కు సిద్ధమైంది. దీనిని ఉద్దేశించి అమెరికా ఆంక్షలకు అనుగుణంగా భారత్ తన ఆర్థిక బలాన్ని త్యాగం చేయదన్నారు.
అమెరికా భాగస్వామ్యాన్ని గౌరవిస్తాం కానీ...
అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామి అని, ఇదే విషయాన్ని చెప్పామని, నిర్దిష్ట సందర్భాలలో భారత్కు సొంత వ్యూహాత్మక ప్రయోజనాలు ముఖ్యమైనవని నిర్మల చెప్పారు. అదే సమయంలో మీ (అమెరికా) వ్యూహాత్మక భాగస్వామి బలంగా ఉండాలని మీరు కోరుకుంటారని, బలహీనపడాలని భావించరన్నారు. అమెరికాతో ఉన్న బలమైన భాగస్వామ్యాన్ని గౌరవిస్తామని, కానీ బలమైన.. సమాన ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు అనుమతించాలన్నారు.
కార్పోరేట్ పన్ను తగ్గించాం
పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచంలో భారత్ కంటే అనుకూలమైన దేశం లేదని నిర్మలా సీతారామన్ అంతకుముందు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అన్నారు. నేటికీ అత్యంత వృద్ధిదాయక దేశం భారత్ అని, తమ దేశంలో అత్యుత్తమ నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి ఉందని, తమ ప్రభుత్వం సంస్కరణలను ప్రవేశపెడుతోందన్నారు. భారత్ ఓ స్వేచ్ఛాయుత, పారదర్శక విధానాల దేశమని, అనుమతులకు ఆలస్యం ఉండదన్నారు. కాబట్టి పెట్టుబడులతో రావాలన్నారు. విదేశీ పెట్టుబడిదారులకు సమాన అవకాశాలు ఉంటాయన్నారు. కార్పోరేట్ పన్ను తగ్గించినట్లు తెలిపారు.
అన్ని సమస్యలు పరిష్కరిస్తాం..!
బీమా రంగ ఇష్యూస్ తెలుసుకున్న తర్వాత పెట్టుబడి పరిమితులపై నిర్ణయం తీసుకుంటామని, వారానికి ఓ రంగంపైన సమీక్ష నిర్వహిస్తూ, కార్పోరేట్ - పెట్టుబడిదారులలో విశ్వాసం దెబ్బతినకుండా చూస్తున్నామని చెప్పారు. ఒత్తిడికి గురవుతున్న రంగాల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వినిమయం పెంచేందుకు, మౌలిక వసతులకు ప్రభుత్వ అధిక వ్యయం చేస్తోందన్నారు. ప్రజల వ్యయం పెంచేందుకు గ్రామస్థాయికి వెళ్లి విరివిగా రుణాలు ఇవ్వాలని బ్యాంకులు, NFBCలకు సూచించామన్నారు. దీంతో మార్పు వస్తుందన్నారు. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందన్నారు.
పెట్టుబడులకు భారత్ను మించిన దేశం లేదు, త్వరలో కాశ్మీర్కు కొత్త పాలసీ