అయ్యో రామా... రియల్ ఎస్టేట్ సెంటిమెంటు దెబ్బతింటోంది!
దేశంలో ఆర్థిక మాంద్యం లేనే లేదని కేంద్ర మంత్రులు పనిగట్టుకొని మరీ చెబుతున్నారు. అవసరం ఉన్నా... లేకపోయినా దాని ప్రస్తావన తెచ్చి మరీ మీడియా ముందు అబ్బే ఆర్థిక మాంద్యమా ... అదెక్కడా అని నిలదీస్తున్నారు. అనుచిత వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఆనక నాలుక కరచుకొంటున్నారు. ఒకే రోజు మూడో సినిమాలు రూ 120 కోట్లు వసూలు చేస్తే... చూడండి దేశం ఎంత వెలిగి పోతోందో అని కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియా ముందు ప్రస్తావించి తర్వాత తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొన్నారు.
సాక్షాత్తు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కూడా ఆర్థిక మాంద్యాన్ని గుర్తించేందుకు ఇష్టపడటం లేదు. పైగా అంతా మేరె చేసారు అంటూ గత యూపీఏ ప్రభుత్వాన్ని నిందించే పనిలో నిమగ్నమయ్యారు. ఆటోమొబైల్ రంగంతో మొదలైన ఆర్థిక మందగమనం దేశంలో చాప కింద నీరులా ఒక్కో రంగాన్ని తాకుతోంది. తాజాగా విమానయాన రంగంపై కూడా దాని ప్రభావం కనిపించింది. అన్నిటికంటే అధికంగా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంపై మాంద్యం సెంటిమెంట్ పనిచేస్తోంది. ఇది మాత్రం తప్పనిసరిగా మన నాయకులు ఆందోళన చెందాల్సిన విషయమే. ఎందుకంటే ఏటా ఈ రంగంలో దేశంలో లక్షల కోట్లలో లావాదేవీలు జరుగుతాయి.
గుడ్ న్యూస్: మ్యూచువల్ ఫండ్స్ లో జోరుగా ఉద్యోగాలు !
అతి పెద్ద రంగం...
భారత్ లో పెట్టుబడులు, ఉగ్యోగ కల్పన విషయంలో రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగం అతి పెద్దది. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడి జీవించే రంగం కూడా ఇదే. ఇప్పటికే దేశంలో సుమారు 5.5 కోట్ల నుంచి 6 కోట్ల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. 2022 నాటికి ఈ సంఖ్య దాదాపు 7 కోట్లకు చేరుకోనుంది. పెట్టుబడుల పరంగా చూసినా రియల్ ఎస్టేట్ రంగం చాలా పెద్దది. అధికారిక అంచనాల ప్రకారమే 2030 నాటికీ భారత రియల్ ఎస్టేట్ రంగం $ 1 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ 70,00,000 కోట్లు) గా ఉంటుందని అంచనా. అనధికారికంగా ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. దేశంలోని మొత్తం నగదు లావాదేవీల్లో ఈ రంగంలోనే ఎక్కువ నగదు చేతులు మారుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో పదో వంతు వాటా ఈ రంగానిదే. 14 అతి ముఖ్యమైన రంగాల్లో రియల్ ఎస్టేట్ మూడో అతి ముఖ్య రంగంగా ఉంది.
ఐదేళ్ల కనిష్ఠానికి ....
ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రియల్ ఎస్టేట్ రంగం ... ప్రస్తుతం ఆర్థిక మాంద్యం కోరల్లోకి జారుకొంటున్నట్లు ప్రాథమిక అంచనా. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థలు నిర్వహించిన అనేక సర్వేల్లో వినియోగదారుల్లో కొనుగోలు సెంటిమెంట్ తగ్గుతున్నట్లు గుర్తించారు. ఇది ఐదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయినట్లు వివిధ నివేదికలు నిల్లడిస్తున్నాయి. ఐదేళ్ల క్రితంతో పోల్చితే ప్రతి ఇద్దరిలో ఒకరు మాత్రమే ఇప్పుడు ఈ రంగంలో పెట్టుబడులు పెడతామని అంటున్నారు. అంటే సగానికి సగం వినియోగదారుల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. ఇతర రంగాల ప్రభావం, ఉద్యోగాల పై భరోసా తగ్గటం, అప్పుల భారం పెరిగి పోవటం వంటి అంశాలు వినియోగదారుల సెంటిమెంట్ ను దెబ్బతీస్తున్నాయి. ఇది మరికొంత కాలం ఇలాగే కొనసాగితే... దేశం మొత్తం ఆర్థిక మాంద్యం ప్రభావానికి లోను కావటానికి పెద్దగా సమయం పట్టదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ప్రవాసుల పెట్టుబడులు..
ప్రవాస భారతీయులు (ఎన్నారై) భారత్లో పెట్టె పెట్టుబడుల్లో రియల్ ఎస్టేట్ మొదటి స్థానం లో ఉంటుంది. వారు మన దేశానికి పంపించే మొత్తం విదేశీ మారక ద్రవ్యంలో సుమారు 70% నిధులు కేవలం రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు ఉపయోగిస్తున్నారని వివిధ సర్వేల్లో తేలింది. 2018 లో ప్రవాస భారతీయులు 79 బిలియన్ డాలర్లు (దాదాపు రూ 5,53,000 కోట్లు) భారత్ కు పంపించారు. ప్రపంచంలోనే అత్యధిక విదేశీ మారకాన్ని భారత్ కు పంపుతూ సుమారు 2 కోట్ల మంది మన ప్రవాస భారతీయులు రికార్డ్లులు సృష్టిస్తున్నారు. ఈ విషయంలో చైనా కూడా మన కంటే వెనకపడి పోవటం గమనార్హం.
విదేశీ పెట్టుబడులు...
రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల్లోకి విదేశి ప్రత్యక్ష పెట్టుబడులు కూడా భారీగా తరలి వస్తున్నాయి. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం గత 19 ఏళ్లలో 25 బిలియన్ డాలర్ల (సుమారు రూ 1,75,000 కోట్లు) విదేశి ప్రత్యక్ష పెట్టుబడులు సమకూరాయి. ఇవి గత దశాబ్దంలో అత్యధికంగా 2018 లో 5.5 బిలియన్ డాలర్లు (రూ 38,500 కోట్లు ) లభించాయి. అయితే, ప్రస్తుత పరిణామాలతో రియల్ ఎస్టేట్ రంగం ఆందోళనకు గురవుతోంది. దేశంలో అటు పెట్టుబడులు తగ్గి, ఇటు వినియోగం పడిపోయి, రుణాలు లభించని పక్షంలో ఈ రంగం కుదేలవటం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే భారీగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.