'ఆయనొచ్చాక పరిస్థితులు మారాయ్': సత్య నాదెళ్ల వేతనం రూ.305 కోట్లు
శాన్ఫ్రాన్సిస్కో: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వార్షిక వేతనం రూ.2018-19 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 66 శాతం పెరిగింది. ఈ ఏడాది జూన్ 30వ తేదీ నాటికి ఆయన 42.9 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.305 కోట్ల ప్యాకేజీ అందుకున్నారు. సాధారణ వేతనం మిలియన్ డాలర్లు పెరగడంతో పాటు ఈయన వంతుగా కేటాయించే షేర్లు కూడా పెరిగాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 66 శాతం ఎక్కువ. సత్య నాదెళ్ల మూలవేతనం సుమారు 2.3 మిలియన్ డాలర్లకు పెరిగినప్పటికీ ప్యాకేజీలో అత్యధిక భాగం (సుమారు 29.6 మిలియన్ డాలర్లు) స్టాక్ ఆప్షన్స్ కింద లభించింది. బేస్ శాలరీ 1 మిలియన్ డాలర్లు పెరిగింది.
మలేషియాకు మోడీ భారీ షాక్, ఇండోనేషియాకు ప్రయోజనం
సత్య నాదెళ్ల రాకతో మైక్రోసాఫ్ట్ స్థితిగతులు మారిపోయాయి..
సత్య నాదేళ్ల వ్యూహాత్మక నాయకత్వంతో పాటు కస్టమర్లను ఆకట్టుకోవడంతో కంపెనీ స్థితిగతులు మారిపోయాయని, ఆయన రాకతో సంస్థ కొత్త పుంతలు తొక్కుతోందని మైక్రోసాఫ్ట్ డైరెక్టర్లు ప్రశంసించారు. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ అత్యంత మెరుగైన ఆర్థిక ఫలితాలు సాధించిందని పేర్కొంది. ఇందుకు సత్య నాదెళ్ల సారథ్యం, కస్టమర్ల విశ్వాసం చూరగొనడానికి ఆయన చేసిన కృషి, కంపెనీలో ప్రవేశపెట్టిన కొత్త మార్పులు, కొంగొత్త టెక్నాలజీలు, మార్కెట్లలోకి కార్యకలాపాలను విస్తరించడం వంటి అంశాలు తోడ్పడ్డాయని తెలిపింది.
వేతనం... షేర్లు పెరిగాయి..
సత్య నాదెళ్లకు వేతనం మిలియన్ డాలర్లు పెరగడంతో పాటు కేటాయించిన షేర్లు పెరిగాయి. 2018-19లో 29.6 మిలియన్ డాలర్లు స్టాక్ రూపంలో లభించగా, 10.7 మిలియన్ డాలర్లు నాన్ ఈక్విటీ రాయితీలు, మరో 1.11 లక్షల డాలర్లు ఇతర పరిహారం కింద పొందారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో సత్య నాదెళ్ల 25.8 మిలియన్ డాలర్ల ప్యాకేజీని అందుకున్నారు.
బాధ్యతలు చేపట్టిన 2014లో అత్యధిక వేతనం
సత్య నాదెళ్ల సీఈవోగా బాధ్యతలు చేపట్టినప్పుడు (2014) 84.3 మిలియన్ డాలర్ల వేతనం అందుకున్నారు. ఇప్పటి వరకు అదే ఆయన అందుకున్న అత్యధిక వేతనం. ప్రస్తుతం ఆయన ఖాతాలో 9,00,000 షేర్లు ఉన్నాయి. ఇక, మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు సగటున 1,72,512 డాలర్ల వేతనం అందుకున్నారు. 2018 ఏడాదిలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ 18.7 మిలియన్ డాలర్ల (రూ.133 కోట్లు) వేతనాన్ని అందుకోగా, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ 1.9 మిలియన్ డాలర్ల(రూ.13.51 కోట్లు) వేతనం కంటే సత్య నాదెళ్ల అత్యధికంగా అందుకున్నారు.
30.9 బిలియన్ డాలర్ల షేర్లు తిరిగి కొనుగోలు
గత ఆర్థిక సంవత్సరం మైక్రోసాఫ్ట్ వాటాదారులకు మంచి ఫలితాలు ఇచ్చిందని, వీటిలో వాటా పునఃకొనుగోలు, డివిడెండ్ల రూపంలో 30.9 బిలియన్ డాలర్లు ఇచ్చిందని చెప్పారు. 2019 ఆర్థిక సంవత్సరానికి గాను మైక్రోసాఫ్ట్ రెవెన్యూ 125.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది 14 శాతం పెరుగుదల. 39.2 బిలియన్ డాలర్ల నికర ఆదాయం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం కంపెనీకి ఇది కొత్త రికార్డ్. కంపెనీ జూలై 1 నుంచి జూన్ 30 మధ్యకాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది.
811 బిలియన్ డాలర్లకు పెరిగిన మార్కెట్ వ్యాల్యూ
గత అయిదేళ్లలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 509 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 302 బిలియన్ డాలర్ల నుంచి 811 బిలియన్ డాలర్లకు పెరిగింది. కొత్త టెక్నాలజీ, ఇతర మార్కెట్లో ప్రవేశించడానికి సత్య నాదెళ్ల తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితులైన నాటి నుంచి మైక్రోసాఫ్ట్... క్లౌడ్ కంప్యూటింగ్పై ప్రత్యేక దృష్టి సారించింది.