తొలుత EVని తిరస్కరించిన బజాజ్ ఆటో మనసు మార్చుకొని...
న్యూఢిల్లీ: బజాజ్ చేతక్ బ్రాండ్ మళ్లీ వస్తోంది. అయితే ఈసారి విద్యుత్ స్కూటర్ల రూపంలో రానుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి చేతక్ బ్రాండు ఎలక్ట్రికల్ స్కూటర్లను విక్రయించేందుకు యోచిస్తున్నట్లు బజాజ్ ఆటో ప్రకటించింది. బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్, నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సమక్షంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విద్యుత్ స్కూటర్లను ఆవిష్కరించారు.
ద్విచక్ర వాహనాలను పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలన్న నీతి ఆయోగ్ ప్రతిపాదనను గతంలో తిరస్కరించిన బజాజ్ ఆటో.. ఇప్పుడు తొలుత ఈ విభాగంలో తామే అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇందుకు కారణంగా జాక్ మా మాటలను బజాజ్ ప్రస్తావించింది. విధానాలు, పరిస్థితులు సిద్ధమయ్యే వరకు వేచి ఉండవద్దు. ముందుగానే విపణిలోకి వస్తే అవకాశాలు అందిపుచ్చుకునే వీలు ఉందన్న దృక్పథంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
ఈ సందర్భంగా రాహుల్ బజాజ్ మాట్లాడుతూ 70వ దశకంలో అందుబాటులోకి వచ్చిన చేతక్ స్కూటర్ అప్పట్లోనే కోటికి పైగా అమ్ముడుపోయాయని, ఈ వాహనం హమారా బజాజ్గా మారిందని చెప్పారు. ఆ తర్వాతి క్రమంలో మోటర్ సైకిళ్లు రంగప్రవేశం చేయడంతో 2000 మధ్య నుంచి స్కూటర్ల ఉత్పత్తిని నిలిపివేసినట్లు తెలిపారు. ఇప్పుడు అదే చేతక్ కొత్తగా EVగా వస్తోందన్నారు.
ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొత్తం ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీని వాడుతున్నాయని, ముఖ్యంగా విద్యుత్, బయోఫ్యూయల్ బాట పట్టాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. 2023 నాటికి ప్రతి మూడు చక్రాల వాహనం, 2025 నాటికి 150 సీసీ కంటే తక్కువ సామర్థ్యం కలిగిన బైక్స్ 100% విద్యుత్తో నడిచే వాహనాలు ఉండాలని నీతి ఆయోగ్ లక్ష్యంగా పెట్టుకుంది.
చకాన్ ప్లాంటులో ఈ విద్యుత్ స్కూటర్లను తయారు చేసి, తన ప్రో-బైకింగ్ డీలర్ల ద్వారా వీటిని విక్రయిస్తుంది. వాహనాల తయారీ నేపథ్యంలో లేని కంపెనీలు కూడా విద్యుత్ వాహన విభాగంలో అడుగు పెట్టి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతామని చెప్పడం ఆశ్చర్యం వేస్తోందని రాహుల్ బజాజ్ అన్నారు.