సూపర్ ఛాన్స్: ధోనీ 'టీమ్ క్యాష్లెస్ ఇండియా'తో కలిసి పని చేస్తారా?
న్యూఢిల్లీ: క్రికెట్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ దేశంలో డిజిటల్ చెల్లింపుల విస్తరణ కోసం ప్రముఖ పేమెంట్ టెక్నాలజీ కంపెనీ మాస్టర్ కార్డుతో జత కట్టారు. 'టీమ్ క్యాష్లెస్ ఇండియా' పేరుతో ప్రారంభించిన ఈ ప్రచారంలో ఇప్పటి వరకు డిజిటల్ చెల్లింపులు అనుమతించని కనీసం ఒక మర్చంట్ను ప్రతి ఒక్క భారతీయుడు నామినేట్ చేయవచ్చు లేదా 9016861000 ఫోన్ నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. దీని ఆధారంగా ధోనీ ఆ వ్యాపారులతో మాట్లాడి వారిని డిజిటల్ చెల్లింపులు అనుమతించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులతో పాటు వినియోగదారులను ప్రోత్సహిస్తారు.
ఈపీఎఫ్ఓ బోనస్ శుభవార్త: ఉద్యోగులకు దీపావళి బొనాంజా
నగరాల్లో మాస్టర్ కార్డ్ ప్రోగ్రామ్స్
దీని ద్వారా, ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు అంగీకరించని ఒకటి లేదా ఎక్కువ మంది వ్యాపారులను నామినేట్ చేయవచ్చు. ఇందుకు మాస్టర్ కార్డ్ కూడా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT), బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలతో కలిసి పని చేస్తుంది. డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సాహకాల్లో భాగంగా మాస్టర్ కార్డ్ వివిధ నగరాల్లో ప్రోగ్రామ్లు నిర్వహించనుంది. ఇది డిజిటల్ ప్రోత్సాహం వైపు ప్రజలను మళ్లిస్తుందని భావిస్తున్నారు.
వ్యాపారులతో ధోనీ మాటామంతి
డిజిటల్ పేమెంట్ ఉద్యమానికి మద్దతుగా ధోనీ వ్యాపారులతో మాట్లాడుతారు. వారు డిజిటల్ వైపు మొగ్గేలా ప్రోత్సహిస్తారు. అంతేకాదు, ఇక్కడ కొందరు వ్యాపారులకు మరో బంపరాఫర్ కూడా ఉంది. సెలక్టెడ్ నామినేటెడ్ వ్యాపారులు, వినియోగదారులకు ధోనీ ప్రచారం చేసే టీమ్ క్యాష్లెస్ ఇండియాతో కలిసి పని చేసే అవకాశం వస్తుంది.
టీమ్ క్యాష్ లెస్ ఇండియా..
నరేంద్ర మోడీ ప్రభుత్వం డిజిటల్ దిశగా అందరినీ ప్రోత్సహిస్తోంది. ఇందుకు అనుగుణంగా టీమ్ క్యాష్లెస్ ఇండియా ద్వారా 2020 నాటికి 10 మిలియన్ల వ్యాపారులను డిజిటల్ దిశగా మళ్లించాలని మాస్టర్ కార్డ్ లక్ష్యంగా పెట్టుకుంది. ధోనీ ఎంతోమందికి ప్రేరణ ఇస్తారని, అలాగే తమకు CAIT నుంచి సహకారం ఉంటుందని సహకరిస్తారని మాస్టర్ కార్డ్ పేర్కొంది. భాగస్వామ్య బ్యాంకులు, పేమెంట్ ఫెసిలిటేటర్లు కలిసి పని చేస్తారని తెలిపింది.
పెరుగుతున్న డిజిటల్ పేమెంట్స్
కాగా, గత కొంతకాలంగా డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ డిజిటల్ పేమెంట్స్ 31.34 బిలియన్లుగా రిజిస్టర్ అయ్యాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2020 నాటికి 40 బిలియన్లను టార్గెట్గా పెట్టుకుంది. ఇప్పటికీ 90 శాతం మంది రిటైల్ పేమెంట్స్ క్యాష్ ద్వారా జరుగుతున్నాయి. దీనిని డిజిటల్ వైపు మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.