రూ.1.5 లక్షల లోపే బజాజ్ 'చేతక్': ఎలక్ట్రిక్ వెహికిల్స్పై రూ.30,000 వరకు సబ్సిడీ
ఢిల్లీ: ప్రస్తుతం కార్లు, బస్సులు వంటి దాదాపు అన్ని రకాల వెహికిల్స్ క్రమంగా ఎలక్ట్రిక్ (EV) దిశగా అడుగులు వేస్తున్నాయి. పర్యావరణహిత EVను నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీంతో వివిధ కంపెనీలు EV వాహనాలను తయారు చేస్తున్నాయి. తాజాగా, బజాజ్ చేతక్ బ్రాండ్ EVతో పునరాగమనం చేస్తోంది. టూవీలర్స్ ఇష్టపడేవారికి... అలాగే నాటి బజాజ్ చేతక్ అంటే మక్కువ కలిగే వారికి ఇది శుభవార్త. గతంలో చేతక్ అంటే ఎంతోమందికి క్రేజ్. సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలతో పాటు నాణ్యతకు పేరుగాంచింది బజాజ్. ఎంతోమందిని ఆకట్టుకున్న చేతక్ బ్రాండ్ ఇప్పుడు తిరిగి వస్తోంది.
తొలుత పుణే, బెంగళూరులలో
2020 జనవరి నుంచి చేతక్ బ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించేందుకు బజాజ్ ఆటో సిద్ధమవుతోంది. తొలుత పుణేలో ఆ తర్వాత బెంగళూరులో అందుబాటులోకి తేనుంది. ఈ రెండు నగరాల్లో వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తే దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోను విడుదల చేయాలని యోచిస్తోంది. పుణేలోని చకాన్ ప్లాంటులో ఈ స్కూటర్ను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, బజాజ్ ఆటో ఎండీ రాహుల్ బజాజ్లు ఆవిష్కరించారు.
ఇప్పుడే కాదు... జనవరి నుంచి, ముందస్తు బుకింగ్
ఈ స్కూటర్ కోసం దేశవ్యాప్తంగా కంపెనీ ఉన్న డీలర్ల వద్ద ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చునని బజాజ్ ఆటో సూచించింది. వచ్చే జనవరి నుంచి దేశవ్యాప్తంగా విక్రయించనున్న ఈ స్కూటర్ను వచ్చే ఏడాది చివరి నాటి నుంచి యూరప్ దేశాలకు ఎగుమతి చేయనున్నారు.
ధర రూ.1.5 లక్షలకు మించదు...
బజాజ్ చేతక్ EV ధర ఎంత ఉందో కంపెనీ వెల్లడించలేదు. అయితే రూ.1.5 లక్షలకు మించబోదని మాత్రం వెల్లడించింది. ప్లాంటులో స్కూటర్ ఉత్పత్తి సెప్టెంబర్ 25, 2019న ప్రారంభమైంది. 2020 జనవరిలో లాంచ్ చేయనున్నట్లు చెప్పారు. ఈ కొత్త చేతక్ ధర ఎక్కువగా ఉండదని, ఒకటిన్నర లక్షల రూపాయలు మించదని చెప్పారు.
5 గంటలు బ్యాటరీ చేస్తే 95 కిలోమీటర్లు...
బజాజ్ చేతక్ స్కూటర్ బ్యాటరీని 5 గంటల పాటు రీచార్జి చేస్తే స్పోర్ట్ మోడల్ 85 కిలోమీటర్లు ప్రయాణించనుంది. ఎకో మోడల్ 95 కిలోమీటర్లు వరకు ప్రయాణిస్తుంది. తమ ప్రో-బైకింగ్ డీలర్ షిప్స్ ద్వారా వీటిని విక్రయించనున్నట్లు రాహుల్ బజాజ్ తెలిపారు.
ఎకో, స్పోర్ట్స్ రైడింగ్ మోడ్స్...
చేతక్ 4KW ఎలక్ట్రిక్ మోటార్ను ఉపయోగిస్తారు. అయితే కచ్చితమైన బ్యాటరీ స్పెక్స్ వెల్లడించలేదు. ఐఫీ67-రేటెడ్ లిథియమ్ అయాన్ బ్యాటరీ ప్యాక్ను ఉపయోగిస్తారు. బ్యాటరీ ప్యాక్ తొలగించలేనిదిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనిని ధృవీకరించాల్సి ఉంది. ఈ-స్కూటర్లలో ఎకో, స్పోర్ట్స్ అనే రెండు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. రివర్స్ అసిస్ట్ ఫ్యూచర్ ఉంది.
సబ్సిడీ ఉంటుంది..
పాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వెహికిల్స్ (FAME) స్కీం కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై కస్టమర్లకు సబ్సిడీ ఉంటుంది. బైక్స్కు అంతకుముందు మోటారును బట్టి సబ్సిడీ ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ ఆధారంగా ఇస్తున్నారు. ఒక కిలోవాట్ అవర్కు రూ.10,000 చొప్పున గరిష్టంగా రూ.30,000 వరకు సబ్సిడీ ఉంటుందని అవేరా న్యూ అండ్ రెనివేబుల్ ఎనర్జీ మోటో కార్ప్ టెక్ ఫౌండర్ వెంకటరమణ తెలిపారు.
సబ్సిడీ ఎలా...
ఉదాహరణకు మూడు కిలో వాట్ అవర్ సామర్థ్యం కలిగిన వాహనం రూ.80 వేలుగా ఉంటే, షోరూంలో రూ.50వేలు చెల్లిస్తే చాలు. తయారీదారు ప్రతి 3 నెలలకు డిపార్టుమెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీకి వెహికిల్ సేల్ వివరాలు అందించాలి. మోటార్ వాహన చట్టం కింద నమోదయ్యే EV స్కూటర్లకే ఈ సబ్సిడీ లభిస్తుంది. ఇందుకు తయారీదారు స్కూటర్ విభాగంలో సంబంధిత ఎలక్ట్రిక్ వాహనానికి ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకోవాలి. గంటకు 25 కిలో మీటర్లకు పైగా వేగం, 250 వాట్స్ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన మోటార్ ఉంటే స్కూటర్గా పరిగణిస్తారు.
నాడు దుమ్మురేపిన చేతక్
1970లో ప్రవేశపెట్టిన బజాజ్ చేతక్ స్కూటర్ దేశీ ద్విచక్ర వాహన రంగంలో ఓ సంచలనం. రాణా ప్రతాప్ సింగ్కు చెందిన వేగవంతమైన అశ్వం చేతక్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ స్కూటర్లు అప్పట్లోనే కోటికి పైగా అమ్ముడుపోయాయి. బుక్ చేసుకుంటే ఏళ్ల తరబడి వెయిటింగ్ లిస్ట్ ఉండేది. 2005 ప్రాంతంలో ఈ స్కూటర్ల తయారీని బజాజ్ నిలిపివేసి, మోటార్ సైకిల్స్ పైన దృష్టి సారించింది.