ఏపీపీఎస్సీ ఉద్యోగాలపై జగన్ సంచలన నిర్ణయం, ఇంటర్వ్యూలు రద్దు: జనవరిలో కొత్త ఉద్యోగాలు!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టే ఉద్యోగ నియామకాల అంశంలో అనూహ్యంగా ముందుకు కదిలారు. పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని సీఎం జగన్ ఈ రోజు అధికారులను ఆదేశించారు. 2020 జనవరి నుంచి దీనిని అమలు చేయాలని సూచించారు.
ఆయన ఈ రోజు ఏపీపీఎస్సీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ అతి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా పారదర్శకంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ఇవ్వాలన్నారు.
ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం తీసుకునే ఆలోచన ఉందని చెప్పారు. పోస్టుల భర్తీలో అత్యవసర విభాగాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కాగా, వచ్చే ఏడాది జనవరి నుంచి ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని జగన్ నిర్ణయించడం చారిత్రాత్మక నిర్ణయం. అంటే కేవలం రాత పరీక్షలలో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్ రూపొందించాలని, అలాగే ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా ఉండాలన్నారు. మరోవైపు, జగన్ ఇచ్చిన హామీ మేరకు వచ్చే జనవరిలో కొత్త నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.