మేఘ సంస్థపై ఐటీ సోదాలు: పోలవరం, కాళేశ్వరం ప్రాజెక్టుల కాంట్రాక్టర్ ఇదే
నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగంలో విశేష అనుభం కలిగిన మేఘ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్).... కంపెనీ పై ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ లోని కంపెనీ ప్రధాన కార్యాలయం తో సహా కంపెనీ కృష్ణా రెడ్డి ఇంటిలో కూడా ఐటీ శాఖ దాడులు కొనసాగినట్లు సమాచారం. ఈ కంపెనీ ఇటు తెలంగాణలో ప్రధాన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం నిర్మిస్తోంది. అటు ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ లోనూ పోలవరం ప్రాజెక్టును సాధించింది.
దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో అనేక భారీ ప్రోజెక్టుల నిర్మాణం చేస్తోంది. కంపెనీ ఆర్డర్ బుక్ వేల కోట్లలో ఉంటుంది. అయితే, కంపెనీ నమోదు చేసిన లాభాల వాస్తవిక పరీశీలన నిమిత్తం ఇన్కమ్ టాక్స్ అధికారులు మేఘ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సోదాలు జరిపారు. మాతృ సంస్థతో పాటు అనుబంధ సంస్థల ఖాతాలను కూడా ఈ సందర్భంగా పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐటీ శాఖ సోదాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
తనిఖీ మాత్రమే: కంపెనీ వివరణ...
అయితే, మీడియా లో వస్తున్నట్లు ఐటీ శాఖ సోదాలు లేదా దాడులు నిర్వహించటం లేదని కంపెనీ అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు. అవి కేవలం తనిఖీ (ఇన్స్పెక్షన్) లు మాత్రమేనని స్పష్టం చేసారు. రెండేళ్లకోసారి సహజంగానే ఇన్కమ్ టాక్స్ అధికారులు ఎంపిక చేసిన కంపెనీల్లో తనిఖీలు నిర్వహిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా మేఘ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఇన్కమ్ టాక్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఆద్యంతం ఉత్కంట నెలకొంది. కంపెనీ దేశవ్యాప్తంగా పలు భారీ ప్రాజెక్టులు చేపడుతున్న కారణంగా స్థానిక మీడియాతో పాటు, జాతీయ మీడియా కూడా అధిక ఆసక్తి కనబరిచింది.
రివర్స్ టెండర్ లో పోలవరం...
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మొట్ట మొదట పోలవరం కాంట్రాక్టు రద్దు చేసారు. అప్పటికి దాని పనులు చేపడుతున్న నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ తో ఉన్న కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసి ... రివర్స్ టెండర్ విధానం అవలంభించారు. ఇందులో మేఘ ఇంజనీరింగ్ రూ 780 కోట్ల తక్కువకు కోట్ చేసి సుమారు రూ 4,000 కోట్ల నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకొంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ లో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ సైతం జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతోంది. ఇది జాతీయ ప్రాజెక్టు కావటంతో నిధులు కేంద్రమే భరిస్తుంది కాబట్టి కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయాలు తీసుకొంటోందని ఆరోపిస్తోంది.
కన్నా తనిఖీలు..
ఆంధ్ర ప్రదేశ్ లోని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం పరిశీలించారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. సరిగ్గా అదే రోజు ఇక్కడ హైదరాబాద్ లో మేఘ ఇంజనీరింగ్ ప్రధాన కార్యాలయంలో ఇన్కమ్ టాక్స్ అధికారులు సోదాలు నిర్వహిచటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం ఐంది. ఇది కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నడుస్తున్న ప్రచ్ఛన్న యుద్ధానికి సంకేతమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
రాజకీయ పలుకుబడి..
మేఘ ఇంజనీరింగ్ సంస్థ ప్రమోటర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులతో మెరుగైన సంబంధాలను కలిగి ఉన్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కు కూడా చాలా దగ్గరగా ఉండేవారని చెబుతారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కట్టించిన పట్టిసీమ నిర్మాణ కాంట్రాక్టర్ కూడా మేఘ కావటం విశేషం. పట్టిసీమను జగన్ మోహన్ రెడ్డి వ్యతిరేకించిన విషయం ఇక్కడ గమనార్హం. అలాగే, ఇటు తెలంగాణ లోనూ అధికార పార్టీ తో ఈ కంపెనీ కి మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతారు. అందుకే కాళేశ్వరం భారీ ప్రాజెక్టు పనులు చేస్తోందని అంటున్నారు. కానీ ఇద్దరు మిత్రులు - కెసిఆర్, జగన్ - ప్రధాని మోడీతో పూర్తిస్థాయి సత్సంబంధాలను కొనసాగించటం లేదని, అందుకే, ఇలాంటి దాడులతో వారికి చెక్ పెట్టె ప్రయత్నం జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.