రైతు ఆదాయం రెట్టింపు: రూ 6,600 కోట్లతో కొత్త ఫండ్
దేశానికి వెన్నెముక రైతు. అందరికీ అన్నం పెట్టె రైతన్నకు ఎక్కడలేని కష్టాలు. ఆరుగాలం కష్టపడ్డా.. పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుందో రాదో తెలియదు. సమయానికి వర్షాలు పడతాయో లేదో తెలియదు. అన్నీ బాగున్నా ఏ చీడ పీడలు పంటలు నాశనం చేస్తాయో తెలియదు. ఇన్ని సవాళ్ల మధ్య మొక్కవోణి ధైర్యంతో దేశానికి మూడు పూటలా తిండిని అందించాలన్న ఏకైక లక్ష్యంతో రైతులు కష్టపడతారు. అయినా వారి ఆదాయం అంతంతే. పైగా అప్పుల తిప్పలు.
అందుకే, ఎలాగైనా సరే వచ్చే 5 ఏళ్లలో భారత దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనీ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం కంకణం కట్టుకొంది. ఆ దిశగా ఇప్పటికే పలు చర్యలు మొదలు పెట్టిన కేంద్ర ప్రభుత్వం ... తాజాగా మరో కొత్త నిర్ణయంతో ముందుకు రాబోతోంది. ఈ సారి రైతుల కోసం ఒక భారీ మూలధన నిధిని ఏర్పాటు చేయబోతోంది. ఇందుకోసం ఏకంగా రూ 6,600 కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేయాలనీ కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకొంది. ఇప్పుడు ఈ ప్రతిపాదన త్వరలో కేంద్ర కేబినెట్ అనుమతికి వెళ్లనుంది. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారిని ఉటంకిస్తూ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో ఈ విషయాన్ని వెల్లడించింది.
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా? ఇలా మాత్రం చేయకండి!
ఎఫ్పీవో లకు మూలధనం...
ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజషన్ (ఎఫ్పీవో)... రైతు ఉత్పత్తి సంఘం ... అనే సరికొత్త సొసైటీలు ఈ మధ్య ఏర్పాటవుతున్నాయి. కొంత మంది రైతులు ఒక సమూహంగా ఏర్పడి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కనీసం 500 మంది సభ్యులతో ఇది ఏర్పాటవుతుంది. ఈ సంఘం ఒక కార్పొరేట్ కంపెనీ లాగే కార్యకలాపాలు సాగిస్తుంది. ధాన్యం కొనుగోలు నుంచి ఎరువుల విక్రయం వరకు అన్ని రకాల ట్రేడింగ్ జరపవచ్చు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇలాంటి సంఘాలకు కేంద్ర ప్రభుత్వం మూలధనం సమకూరుస్తుంది. బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. దీంతో ఇవి పూర్తి స్థాయి వ్యాపార సంస్థలుగా ఎదగవచ్చు. నిర్వహణ ద్వారా లభించిన లాభాలను రైతులకు పంచుతారు. ఇలాంటి సంఘాలకు ప్రోత్సాహం అందించేందుకే ప్రభుత్వం రూ 6,600 కోట్లతో కొత్త నిధిని ఏర్పాటు చేయబోతోంది. కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం (ఎస్ఎఫ్ఏసి) అనే సంస్థ ఇందుకోసం ప్రత్యేకంగా పనిచేస్తోంది.
కొత్తగా 10,000 సంఘాలు...
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో దేశంలో మరో 10,000 కొత్త ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజషన్స్ ఏర్పాటుకు సహకరిస్తామని ప్రకటించారు. ఈ దిశగా ఇప్పుడు కార్యాచరణ మొదలు పెట్టారు. ఇప్పటికే దేశంలో అధికారికంగా 822 రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు అయ్యాయి. వీటిని ఎస్ఎఫ్ఏసి నేరుగా ప్రమోట్ చేసింది. ఇవి కాకుండా మరో 350 వరకు సొంతగా ఏర్పాటు అయ్యాయి. అనధికారికంగా వీటి సంఖ్య 5,000 వరకు ఉంటుందని ఇటీవల తెలంగాణ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారి ఒకరు వెల్లడించారు. మరో 5 ఏళ్లలో ప్రభుత్వ లక్ష్యం మరో 10,000 సంఘాలు కాగా... సరైన మద్దతు లభిస్తే అంతకు రెట్టింపు సంఖ్యలో ఈ సంఘాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
రుణాలు సులువు...
రైతులకు రుణాలు ఇచ్చేందుకు వెనుకాడే బ్యాంకులు మాత్రం... ఎఫ్పీవో లకు రుణాలు మంజూరు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ రుణాలకు ప్రభుత్వ గ్యారెంటీ ఉండటంతో పాటు.. సంఘాలకు సొంత ఆదాయ మార్గాలు ఉంటాయి కాబట్టి రుణాల తిరిగి చెల్లింపునకు ఢోకా ఉండదని భావిస్తున్నాయి. మరో వైపు నాబార్డ్ కూడా వీటికి మూలధనం మద్దతు ఇస్తోంది. నాబార్డ్ కూడా స్వయంగా కొన్ని రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేసింది. వీటికి బిజినెస్ ప్లాన్ ఉంటుంది. సభ్యుల నుంచే కాకుండా రైతుల నుంచి నేరుగా ధాన్యం, వాణిజ్య పంటలు కొనుగోలు చేసి, మార్కెట్లో మెరుగైన ధరలకు విక్రయించవచ్చు. ఎరువులు, విత్తనాలు కంపెనీల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, కొంత కమిషన్ తో వంటిని రైతులకు విక్రయించే వెసులుబాటు ఉంటుంది. దీంతో, వీటికి సొంత ఆదాయ మార్గాలు ఉంటాయి.
రైతుకు నేరుగా సబ్సిడీ...
ఇప్పటికే దేశవ్యాప్తంగా రైతుల ఆదాయం రెట్టింపు చేసే ప్రక్రియ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకు ఏడాదికి రూ 6,000 సబ్సిడీ అందిస్తోంది. మూడు వాయిదాల్లో ఈ మొత్తాన్ని రైతుకు అందిస్తోంది. 5 ఎకరాల లోపు రైతులకు ఈ మొత్తం లభిస్తోంది. దీనికి తోడు తెలంగాణ లో కెసిఆర్ ప్రభుత్వం ప్రతి ఎకరాకు రూ 10,000 చొప్పున సబ్సిడీ అందిస్తోంది. ఈ పథకం దేశంలోని మరిన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మిగితా రాష్ట్రాలు కూడా కొన్ని మార్పు చేర్పులతో అక్కడ కూడా రైతులకు నేరుగా సబ్సిడీ అందించే ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్లో ప్రతి రైతుకు రూ 12,500 అందించే కారక్రమానికి శ్రీకారం చుట్టారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు కలిసి మరో 5 ఏళ్లలో నిజంగానే రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తే ... అన్నం పెట్టె రైతు, రాజు అవటం ఖాయం అంటున్నారు నిపుణులు.