‘వీలునామా’ అవసరమేనా? ఎలా రాస్తే మంచిది?
వారసత్వపు ఆస్తికి సంబంధించి ఎలాంటి వివాదాలు, గొడవలకు తావులేకుండా చేసే చట్టపరమైన ఆస్తి విభజన పత్రాన్ని వీలునామాగా వ్యవహరిస్తారు. నేటి ఆధునిక యుగంలో కుటుంబ ఆర్థిక ప్రణాళికలో ఈ వీలునామా కూడా ఒక కీలకమైన పత్రమే. వారసత్వ ఆస్తిపై హక్కు కలిగిన కుటుంబ పెద్దలు తమ మరణానంతరం తమ ఆస్తిని తమ వారసులు ఏ నిష్పత్తిలో పంచుకోవాలన్నది ఈ వీలునామా ద్వారా స్పష్టం చేయొచ్చు.
వీలునామా ఎందుకు రాయాలి?
ప్రపంచం అంతా డబ్బు చుట్టూనే తిరుగుతున్న నేటి పరిస్థితుల్లో డబ్బు, స్థిర, చరాస్తుల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య భవిష్యత్తులో తగాదాలు, గొడవలు రాకుండా ఉండేందుకు వీలునామా రాయడం మంచిది. కొన్నిసార్లు కుటుంబ పెద్దలు వీలునామా రాయకపోవడం, ఆస్తిని ఎవరికి ఎంత నిష్పత్తిలో పంచాలో తెలియజేయకపోవడం వల్ల కుటుంబ పెద్ద మరణానంతరం వారసుల నడుమ గొడవలు జరుగుతాయి. కాబట్టి ఆస్తికి సంబంధించిన వివాదాలు ఏర్పడకుండా ఉండేందుకు వీలునామా రాయడం మంచిది.
ఆస్తిని ఎవరెవరికి పంచొచ్చు?
ఆస్తిపై సర్వహక్కులు కలిగిన వారు తమ ఆస్తిని తన కుటుంబ సభ్యులకుగాని లేదా బయటివారికిగాని తన ఇష్టపూర్వకంగా పంచి ఇవ్వొచ్చు. తన మరణానంతరం తన భార్య, సంతానం, తల్లిదండ్రులు, సోదరీ సోదరులు, ఇతర బంధువులు.. ఇలా ఎవరికైనా పంచవచ్చు. అలాగే తన ఆస్తిలో కొంత భాగాన్ని సామాజిక సేవాల సంస్థలకు కూడా ఇవ్వొచ్చు. అయితే తన చర, స్థిరాస్తులలో ఎవరికి ఎంత నిష్పత్తిలో పంచాలన్నది వీలునామాలో తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది.
వీలునామా ఎన్ని రకాలు?
వీలునామాలు రెండు రకాలు. ఒకటి - ప్రివిలేజ్డ్ వీల్లు. రెండోది - అన్ ప్రివిలేజ్డ్ విల్లు. సైనికులు, నావికులు, సాయుధ దళాల సిబ్బంది రాసే దానిని ప్రివిలేజ్డ్ విల్లు అంటారు. వీళ్లు నోటి మాటగా కాని, లిఖితపూర్వకంగా కాని తమ మరణానంతరం తమ ఆస్తిలో ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో ఆ వీలునామాలో తెలియజేయవచ్చు. అలాగే అత్యవసర పరిస్థితిలో.. అంటే యుద్ధ సమయంలో కదనరంగానికి వెళ్లే ముందు తమ ఆస్తికి సంబంధించి తమ అభీష్టమేమిటో వీరు తమ ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చు. ఇక వీరు కాకుండా ఇతరులెవరైనా రాసే దానిని అన్ ప్రివిలేజ్డ్ విల్లుగా వ్యవహరిస్తారు.
వీలునామాను ఎవరు రాయొచ్చు?
ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. జీవితం నీటి బుడగలాంటిది. కాబట్టి బ్రతికి ఉండగానే తన ఆస్తికి సంబంధించి వీలునామా రాసి పెట్టడం మంచిది. ఆస్తిపై హక్కులు ఉన్న కుటుంబ పెద్దలు ఎవరైనా తమ అభీష్టాన్ని తెలుపుతూ వీలునామా రాయొచ్చు. వారసత్వంగా తనకు సంక్రమించిన చర, స్థిరాస్తులను గాని, తన కష్టార్జితంతో కొన్న ఆస్తులను గాని వీలునామా ద్వారా తన వారసుల మధ్య విభజించవచ్చు. అలాగే ఏ ఆస్తిలో అయినా తనకు సంక్రమించిన వాటా తన వారసులకు విభజించవచ్చు.
వీలునామాను ఎలా రాయాలి?
వీలునామా రాసే వ్యక్తిని న్యాయ పరిభాషలో లీగటీ'గా వ్యవహరిస్తారు. వీలునామాను ఏ భాషలోనైనా రాయొచ్చు. కాకపోతే వీలునామా ఎంత సరళంగా, స్పష్టంగా ఉంటే అంత మంచిది. వీలునామా రాసిన వ్యక్తి భౌతికంగా ఈ లోకంలో లేని రోజున.. ఆ వీలునామాను ఎవరు అమలు చేయాలో, దాని ప్రకారం తన వారసులకు ఎవరెవరికి ఏ నిష్పత్తిలో తన ఆస్తిని ఎవరు పంచి ఇవ్వాలో కూడా వీలునామా రాసే వ్యక్తి.. ఆ వీలునామాలో ముందుగానే పేర్కొనవచ్చు. ఇలా ఆస్తి పంపకాలకు సంబంధించి ప్రతినిధిగా నియమితుడైన వ్యక్తిని న్యాయ పరిభాషలో ‘ఎగ్జిక్యూటర్'గా వ్యవహరిస్తారు. అయితే ఈ ఎగ్జిక్యూటర్ వీలునామా రాసిన వ్యక్తి కంటే వయసులో చిన్నవాడై ఉండాలి.
రిజిస్టర్ చేయించడం అవసరమా?
రిజిస్టర్ చేయించినా, చేయించకపోయినా వీలునామా చెల్లుబాటు అవుతుంది. రిజిస్టర్ చేయించాలన్న నిర్బంధమేమీ లేదు. కాకపోతే రిజిస్టర్ చేయించిన వీలునామా అత్యంత బలమైన చట్టబద్ధమైన సాక్ష్యంగా నిలుస్తుంది. కాబట్టి వీలునామా రాసిన వ్యక్తి దాన్ని రిజిస్టర్ చేయించాలనుకుంటే ఇద్దరు సాక్షులను వెంటబెట్టుకుని సమీపంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దానిని రిజిస్టర్ చేయించుకోవచ్చు. రిజిస్ట్రార్ ఆఫీసుకు స్వయంగా వచ్చి.. రిజిస్టర్ చేస్తే.. అలాంటి విల్లుపై న్యాయస్థానాల్లో సవాలు చేసే పరిస్థితి తక్కువ. ఒకవేళ సవాలు చేసినా అవి నిలబడే ఆవకాశాలు ఉండవు.