అప్పు అడగడం సరే.. తీర్చే శక్తి ఉందా?: ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఎస్బీఐ డౌట్స్
అమరావతి: ఎవరైనా వ్యక్తులు లేదా కంపెనీలు అప్పులు తీసుకుంటే బ్యాంకులు వారి చెల్లింపు సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుంటాయి. వారి రాబడి, ఖర్చులు.. ఇలా అన్నింటినీ లెక్కవేస్తాయి. మనకు గ్యారంటీ ఉన్న వారి గురించి కూడా పూర్తిగా తెలుసుకుంటారు. ఆ తర్వాతే మనకు అప్పు ఇస్తారు. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థకు వచ్చింది. ప్రభుత్వరంగ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఆర్థిక సంస్థ లిమిటెడ్ (APPFCL)కు ప్రస్తుతం అప్పు దొరకడం కష్టంగా మారిందట. మరో విషయం ఏమంటే రుణానికి గ్యారెంటీ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అప్పును ఎలా తీరుస్తారని సందేహాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
పీపీఏల దెబ్బ
గత తెలుగుదేశం పార్టీ హయాంలో పీపీఏలను సమీక్షిస్తామని వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం సహా పలు సంస్థలు తప్పుబట్టాయి. పీపీఏల సమీక్ష, రద్దు ప్రభావం పెట్టుబడులపై ఉంటుందని కూడా హెచ్చరించాయి.
పాత ప్రభుత్వాల హామీలు గౌరవించడం లేదు..
ఈ నేపథ్యంలో ఇప్పుడు రుణ సేకరణకు ఇదే అంశాన్ని కూడా లేవనెత్తారని చెబుతున్నారు. అంతేకాదు, రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను తర్వాత వచ్చే ప్రభుత్వాలు గౌరవించడం లేదని, రుణ మంజూరు విషయంలో దీనిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని జగన్ ప్రభుత్వంపై పరోక్షంగా అనుమానాలు వ్యక్తం చేసిందట. చంద్రబాబు హయాంలో జరిగిన పీపీఏ ఒప్పందాల సమీక్ష దెబ్బ ఇలా పడిందని అంటున్నారు.
అసలు మీకు అప్పు తీర్చే శక్తి ఉందా?
మీకు అప్పు ఇస్తే తీర్చగలిగే శక్తి ఉందా, అప్పుగా తీసుకున్న మొత్తంతో ఏం చేస్తారు, ఇప్పటికే తీసుకున్న అప్పుల ద్వారా ఏదైనా ఆదాయం ఉందా అంటూ APPFCLను ప్రశ్నించిందట. గత ప్రభుత్వాలు ఇచ్చే హామీలను తర్వాత వచ్చే ప్రభుత్వాలు అమలు చేయడం లేదని, దీనిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పడంతో పాటు తమ అభ్యంతరాలకు సమాధానం చెప్పాలని APPFCL మేనేజింగ్ డైరెక్టర్కు లేఖ రాసిందట.
ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.3 లక్షల కోట్లు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.52 లక్షలు ఉన్నాయని, 2020 నాటికి అవి రూ.3 లక్షల కోట్లకు చేరుకుంటాయని బ్రిక్ వర్క్ సంస్థ నివేదిక తెలిపిందని, ఏపీపీఎఫ్సీఎల్ ఈ లేఖలో ఎస్బీఐ పేర్కొందట. 2016-17 ఆర్థిక సంవత్సరంలో APPFCL సంస్థ ఏపీ ప్రభుత్వ హామీతో తీసుకున్న రుణాలు రూ.9,665 కోట్లు అని, 2017-18 నాటికి అవి రూ.35,964 కోట్లకు పెరిగాయని బ్రిక్ వర్క్ నివేదిక సూచించింది.
రుణభారం అధికమవుతుందనే...
ఇప్పుడు APPFCL ప్రతిపాదించిన రూ.3 వేల కోట్ల రుణానికి ప్రభుత్వం హామీగా ఉండటం వల్ల రుణభారం ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో రుణం తిరిగి చెల్లింపు, చెల్లింపులు జరిపేందుకు గల ప్రత్యామ్నాయాలను పరిశీలించాల్సి ఉందని బ్యాంకు పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. తమ ప్రశ్నలకు సమాధానం పంపిస్తే వాటిని తాము కార్పోరేట్ కార్యాలయానికి పంపిస్తామని తెలిపింది.