బిగ్ షాకింగ్: బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ మూసివేతకు సిద్ధం?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL)లను మూసివేయాలని ఆర్థికమంత్రిత్వ శాఖ నివేదించినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పునరుద్ధరణ కోసం రూ.74,000 కోట్లను పంప్ చేయాలన్న డిపార్టుమెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ (DoT) ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో మూసివేత అంశం తెరపైకి వచ్చిందని తెలుస్తోంది. వీఆర్ఎస్ ద్వారా క్లోజింగ్కు రూ.95,000 కోట్ల వరకు అవసరమవుతుందని తొలుత అంచనా వేశారు.
హైదరాబాద్ అరబిందో ఫార్మా యూనిట్కు అమెరికా FDA భారీ షాక్
అప్పటి నుంచి పోటీని తట్టుకోలేక...
టెలీకమ్యూనికేషన్ అంటే చాలామందికి బీఎస్ఎన్ఎల్, ఆ తర్వాత ఎంటీఎన్ఎల్ గుర్తుకు వస్తాయి. ఈ రెండు సంస్థలు కూడా దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. కానీ ఇప్పుడు వాటి భవిష్యత్తు అంధకారంలో ఉంది. 1990లో ప్రయివేటు సెక్టార్కు తలుపులు తెరిచినప్పటి నుంచి ఇవి కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పుడు ఏకంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ రెండు కంపెనీలను మూసివేయాలని యోచిస్తున్నట్లుగా వార్తలు రావడం గమనార్హం. ఈ రెండు సంస్థల్లో 1.65 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.
వారిని తిరిగి సొంత డిపార్టుమెంట్లలోకి...
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లలో మూడు రకాల ఉద్యోగులు ఉన్నారు. ఇండియన్ టెలీ కమ్యూనికేషన్ సర్వీసెస్ (ITS) ఆఫీసర్లు ఉన్నారు. వీరిని ఇతర డిపార్టుమెంట్లలోకి పంపించే వెసులుబాటు ఉంది. వీరిలో చాలామంది ఇతర పీఎస్యూ లేదా ప్రభుత్వ డిపార్టుమెంట్ల డైరెక్ట్గా రిక్రూట్ చేయబడి, ఆ డిపార్టుమెంట్ల ద్వారా ఇటు వచ్చారు.
వారికే ఆందోళన..
అయితే నేరుగా నియమించబడిన వారు చాలామంది జూనియర్ సిబ్బంది.. ఎక్కువగా టెక్నీషియన్స్ ఉన్నారు. వీరి వేతనాలు కూడా ఎక్కువేమీ కాదు. ఇలాంటి ఉద్యోగులు దాదాపు 10వ వంతు కంటే తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వీఆర్ఎస్ అనేది ఇతర డిపార్టుమెంట్స్ నుంచి వచ్చిన వారికే అని చెబుతున్నారు. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లను పునరుద్ధరించేందుకు రూ.74,000 కోట్లు ఉద్దీపన ప్రకటించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. సమాచారం మేరకు ఎంతమంది సిబ్బంది ఉన్నారనే విషయాలను ఇవ్వాలని కంపెనీని ప్రభుత్వం కోరింది. దాని ఆధారంగా మూసివేత వాస్తవ వ్యయం తెలుస్తుందని భావిస్తున్నారట.
ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా?
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది. దాదాపు 50 శాతం మంది ఉద్యోగులను వీఆర్ఎస్ లేదా రిజైన్ చేయాలని బీఎస్ఎన్ఎల్ కోరినట్లుగా వార్తలు వచ్చాయి. ఎంటీఎన్ఎల్ కూడా శాలరీలు ఇవ్వలేని పరిస్థితి. బీఎస్ఎన్ఎల్లో 1.65 వేల మంది, ఎంటీఎన్ఎల్లో 22,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల టోటల్ మంత్లీ శాలరీ రూ.750 కోట్ల నుంచి రూ.850 కోట్ల వరకు ఉండగా, ఎంటీఎన్ఎల్ ఉద్యోగుల శాలరీ రూ.160 కోట్ల వరకు ఉంది. ప్రస్తుతం ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది.