భారత వృద్ధి దారుణం కానీ, ఇదీ మా బ్యాంక్ పరిస్థితి!: HDFC ఎండీ
భారత వృద్ధి రేటు కనిష్టస్థాయికి చేరుకుందని, అయితే వచ్చే ఏడాది జనవరి నుంచి మళ్లీ మంచి రోజులు వస్తాయని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎండి ఆదిత్య పురి అన్నారు. వచ్చే జనవరి నాటికి జీడీపీ వేగం పెరుగుతుందన్నారు. అలా అని వృద్ధి రేటు జనవరి నాటికి చాలా చాలా బాగుంటుందని చెప్పలేనని, ప్రస్తుతం ఉన్న వృద్ధి రేటు కంటే బాగుంటుందని మాత్రం చెప్పగలనని అన్నారు. జీడీపీ వృద్ధి రేటు గత త్రైమాసికంలో ఐదు శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. ఇది ఆరేళ్ల కనిష్టం. ఈ నేపథ్యంలో ఆదిత్య మాట్లాడారు.
ఆ బ్యాంకులతో జాగ్రత్త, ముందుగా ఇవి తెలుసుకోండి!
ఆర్థిక వృద్ధి పుంజుకుంటుంది
పెరుగుతున్న ప్రభుత్వ వ్యయాలు, మౌలిక రంగంలో పెట్టుబడులు, మరిన్ని నిధులను ఆర్థిక వ్యవస్థకు అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు తోడు దేశవ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురవడం ఆర్థిక వ్యవస్థకు కలిసి వస్తాయని ఆదిత్య చెప్పారు. అయితే ఫలితాలకు కాస్త సమయం తీసుకుంటుందన్నారు. అందుకే జనవరి నాటికి జీడీపీ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రుణాలకు డిమాండ్
కంపెనీల వర్కింగ్ క్యాపిటల్ రుణాలకు డిమాండ్ పెరుగుతోందని చెప్పారు. అయితే పెట్టుబడులు మాత్రం అంతగా లేవన్నారు. డిమాండ్ లేకపోవడంతో కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యంలో ప్రస్తుతం సగటున 77 శాతానికి మించి ఉపయోగించుకోలేకపోతున్నాయని, ఉత్పత్తి సామర్థ్య వినియోగం కనీసం 80 శాతానికి చేరాలన్నారు. అప్పుడే పెట్టుబడులు మరింతగా వస్తాయన్నారు.
మార్కెటింగ్ ప్రయత్నాలు
తమ బ్యాంకు చిన్న వ్యాపారాల వంటి కొత్త విభాగాలకు బ్యాంకు రుణాలు ఇవ్వడం ప్రారంభించిందని, అలాగే సాంకేతిక సాధనాల కారణంగా దుకాణదారులకు కూడా రుణాలు ఇవ్వడం ప్రారంభించామని ఆదిత్య చెప్పారు. ఇది దేశంలోని టాప్ 4 మిలియన్ల వినియోగదారులకు మించి వెళ్తుందన్నారు.
లోటు పూడ్చుకోవచ్చు..
ఇటీవల ప్రకటించిన ఉద్దీపనలతో ద్రవ్య లోటు కట్టు తప్పే ప్రమాదం ఉందనే వాదనపై ఆదిత్య మాట్లాడుతూ... ద్రవ్య లోటు పెరుగుదల సముచిత స్థాయిలో ఉంటే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, జీఎస్టీ, ఆదాయ పన్ను వసూళ్లు పెంచుకోవడం ద్వారా ఈ కొద్దిపాటి లోటును పూడ్చుకోవచ్చునని చెప్పారు.
హెచ్డీఎఫ్సీకి మూలధనం లోటు లేదు
హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్లీన్ లోన్ బుక్ను కలిగి ఉందని ఆదిత్య పురి చెప్పారు. అలాగే మంచి క్యాపిటల్ కలిగి ఉందన్నారు. కనీసం మరో మూడేళ్లు, అంతకుమించి మూలధనం అవసరం లేదన్నారు. తాము పెరుగుదల డిమాండును చూస్తున్నామన్నారు.
6.5 మిలియన్లు టార్గెట్
ఇప్పుడు తమ బ్యాంక్ చిన్న చిన్న వ్యాపారాలు, షాపర్స్కు కూడా రుణాలు ఇస్తోందని చెప్పారు. రోడ్లు, పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలోని మంచి ప్రాజెక్టులకు కూడా టర్మ్ లోన్స్ ఇస్తోందన్నారు. ఆర్థికంగా గిట్టుబాటు అయ్యే ప్రాజెక్టులకు మాత్రమే తమ బ్యాంకు రుణాలు ఇస్తోందన్నారు. ఇప్పటికే 4 మిలియన్లకు పైగా రుణాలు ఇచ్చామని, 6.5 మిలియన్లను టార్గెట్గా పెట్టుకున్నామని చెప్పారు