ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!
బ్యాంకులైతే కష్టార్జితాన్ని కలకాలం కాపాడతాయనే సాధారణ ప్రజానీకం నమ్మకం క్రమంగా సన్నగిల్లుతోంది. కారణం - ఈ మధ్య కాలంలో బ్యాంకులు కూడా కుంభకోణాల్లో చిక్కుకోవడమే. అవును, దేశంలో వరుస బ్యాంకు స్కాంలు డిపాజిటర్లను బెంబేలెత్తిస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ పీఎంసీ బ్యాంక్ ఉదంతమే.
సేవింగ్స్ ఖాతాలో దాచుకోవడం కన్నా.. పరిమిత కాలానికి ఫిక్స్డ్ చేస్తే కాస్తంత అధిక వడ్డీ వస్తుందని ఒకప్పుడు డిపాజిటర్లు భావించేవారు. ఇప్పుడు ఆ ఆశ కూడా లేదు. ఎందుకంటే, ఫిక్స్డ్ డిపాజిట్లపైనా బ్యాంకులు ఎప్పుడుపడితే అప్పుడు వడ్డీ రేట్లను సవరిస్తుంన్నాయి. దీంతో ఇక బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేయడం కూడా దండగేనని పలువురు భావిస్తున్నారు.
డిపాజిట్ చేయడానికే భయపడుతున్న జనం...
ఒకప్పుడు ఇంట్లో డబ్బు ఉంచుకోవడానికి జనం జంకేవారు. అనవసరంగా సొమ్మను దొంగలపాల్జేయడం ఎందుకు, బ్యాంకులో దాచుకుంటే భద్రతతోపాటు అసలుకు కూసింత వడ్డీ కూడా వస్తుంది కాదా అని ఆలోచించేవారు. కానీ ఇప్పుడు బ్యాంకుల్లో దాచుకోవడానికి డిపాజిటర్లు ఎప్పుడు ఏ బ్యాంకు దివాలా తీస్తుందో తెలియని పరిస్థితి. ధైర్యం చేసి ఫిక్స్డ్ చేసినా.. ఎప్పుడు పడితే అప్పుడు మారే వడ్డీ రేటు డిపాజిటర్లతో దోబూచులాడుతోంది.
‘డీఐసీజీసీ' గ్యారెంటీ ఇదిగో...
అయితే డిపాజిట్ల విషయంలో భయపడాల్సిన అవసరం లేదని, ఇప్పుడు డీఐసీజీసీ గ్యారెంటీ కూడా లభిస్తోందంటూ బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో నిపుణులు భరోసా ఇస్తున్నారు. బ్యాంకులు సేకరించే ప్రతి డిపాజిట్ను డీఐసీజీసీ (డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్) వద్ద బీమా చేయించడాన్ని తప్పనిసరి చేస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మార్గదర్శకాలను తీసుకొచ్చింది. దీని ప్రకారం దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు తాము సేకరించిన డిపాజిట్లన్నింటినీ డీఐసీజీసీ వద్ద బీమా చేయాల్సిందే. ఒక్క ప్రాథమిక సహకార సంఘాలకు మాత్రం ఈ రకం బీమా నుంచి మినహాయింపు ఉంది.
మొత్తం సొమ్మకు బీమా లభిస్తుందా?
ఇక్కడే ఉంది అసలు కిటుకు. ఏ రకం డిపాజిట్ అయినా సరే, అప్పటికి ఖాతాలో నిల్వ ఉన్న అసలు మొత్తం, దానిపై జమ అయిన వడ్డీ అన్నీ కలిపి.. గరిష్ఠంగా ఒక్కో డిపాజిట్కు రూ.లక్షకు మాత్రమే బీమా ఉంటుందని ఆర్బీఐ మార్గదర్శకాలు చెబుతున్నాయి. అంటే.. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బ్యాంకు దివాలా తీసినా, ఒకవేళ ఆ బ్యాంకుకు సంబంధించి నగదు ఉపసంహరణలపై ఆర్బీఐ ఆంక్షలు విధించినా.. ఎవరెంత సొమ్ము డిపాజిట్ చేశారనే దానితో సంబంధం లేకుండా ఒక్కో డిపాజిట్ పై రూ.లక్ష మాత్రమే డీఐసీజీసీ చెల్లిస్తుంది. ఒకవేళ మీరు రూ.10 లక్షలు డిపాజిట్ చేసినా దానిపై జమ అయిన వడ్డీతో కలిపి మీకు చేతికందేది గరిష్ఠంగా లక్ష రూపాయలే.
ఒకటికి మించి డిపాజిట్లు ఉన్నా...
కొంతమంది ఖాతాదారులకు ఒకే బ్యాంకులో వేర్వేరు ఖాతాలు ఉంటాయి. అంటే, ఒక సేవింగ్స్ ఖాతా, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా, మరో రికరింగ్ డిపాజిట్ ఖాతా.. ఇలా. అయితే వివిధ ఖాతాల్లో డబ్బు ఉన్నా ఒకవేళ సదరు బ్యాంకు గనుక దివాలా తీస్తే.. ఆ వ్యక్తికి గరిష్ఠంగా వచ్చేది కూడా రూ.లక్షే. అన్ని ఖాతాల్లో డిపాజిట్లు కలిగి ఉన్నా అన్నింటిలో ఉన్న సొమ్ము, వాటిపై వడ్డీలు కలిపి డీఐసీజీసీ బీమా వర్తించేది అదే లక్ష రూపాయలకు మాత్రమే.
వేర్వేరు శాఖల్లో డిపాజిట్లు ఉంటే...
ఒక వ్యక్తి ఒకే బ్యాంకుకు చెందిన వేర్వేరు శాఖల్లో ఖాతాలు కలిగి ఉన్నా అన్నింటికీ కలిపి వర్తించే గరిష్ఠ బీమా రక్షణ లక్ష రూపాయలే. అంటే ఒక వ్యక్తి ఒకే బ్యాంకుకు చెందిన వివిధ శాఖల్లోని వేర్వేరు ఖాతాల్లో రూ.10 లక్షల మేరకు డబ్బు దాచుకున్నా అన్నింటిలోనూ ఉన్న ఆ అసలు సొమ్ము, వాటన్నింటిపై జమ అయిన వడ్డీ అన్నింటికీ కలిపి కేవలం రూ. లక్ష పరిహారమే దక్కుతుంది.
జాయింట్ అకౌంట్స్ ఉంటే?
ఒక కుటుంబంలోని వేర్వేరు వ్యక్తులు ఒకే బ్యాంకులో వేర్వేరు ఖాతాలు కలిగి ఉంటే మాత్రం ప్రతి ఒక్క ఖాతా మీద గరిష్ఠంగా రూ.లక్ష పరిహారంగా దక్కుతుంది. ఒక వ్యక్తి తన పేరు మీద ఒక అకౌంట్ కలిగి ఉండి, అలాగే కుటుంబ సభ్యుల్లో ఇంకొకరితో కలిసి మరో జాయింట్ అకౌంట్ కూడా వేరుగా ఉన్నట్లయితే మాత్రం అలాంటి సందర్భంలో వేర్వేరు ఖాతాలకు సంబంధించి పరిహారం కూడా వేర్వేరుగా అందుతుంది.
మరేమిటి ప్రత్యామ్నాయం?
ప్రత్యామ్నాయం ఏమిటంటే.. వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉండటమే. అంటే ఒక వ్యక్తి ఒకే బ్యాంకులో కాకుండా ఐదారు బ్యాంకుల్లో ఖాతాలు తెరవడం ఉత్తమం. వాటిలోనూ పెద్ద మొత్తాల్లో డబ్బులు వేయకూడదు. బ్యాంకులు దివాలా తీసినా.. ఇంకేదైనా జరిగినా మీరు నష్టపోకూడదనుకుంటే ఒక్కో అకౌంట్లో రూ.లక్షకు మించి డబ్బు దాచుకోకూడదు. ఒకవేళ రూ.5 లక్షలు ఫిక్స్డ్ చేద్దామని మీరు అనుకుంటే.. ఆ మొత్తాన్ని ఒకే బ్యాంకులో కాకుండా.. వేర్వేరు బ్యాంకుల్లో ఫిక్స్డ్ చేసుకోవడం మంచిది.
ప్రతి ఖాతాకూ డీఐసీజీసీ వర్తించేలా...
ఒకే వ్యక్తి విభిన్న బ్యాంకుల్లో సొమ్ము డిపాజిట్ చేసి ఉంటే మాత్రం ప్రతి ఒక్క ఖాతాకు డీఐసీజీసీ బీమా కవరేజి ఉంటుంది. ఉదాహరణకి మీకు ఐదు బ్యాంకుల్లో వివిధ ఖాతాల్లో రూ.5 లక్షల రూపాయల డిపాజిట్లున్నాయనుకుంటే ఒక్కో ఖాతా మీద గరిష్ఠంగా రూ.లక్ష చొప్పునఐదు బ్యాంకుల ఖాతాల మీద రూ.5 లక్షలు మీకు పరిహారంగా లభిస్తుంది. మహా పోతే, వాటి మీద అప్పటివరకు జమ అయిన వడ్డీ పోతుంది. వడ్డీ పోతే పోయింది.. అసలైనా మీకు దక్కితే అంతే చాలు..!