జగన్ ఇచ్చే రూ.12,500 రైతు భరోసాలో మోడీ ప్రభుత్వం వాటా రూ.6,000!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్టోబర్ 15వ తేదీన రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. అర్హులైన రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి పెట్టుబడి సాయం కింద రూ.12,500 ఇవ్వనుంది. ఇది లక్షలాది మంది రైతులకు పెద్ద ఊరట. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రైతులకు మూడు విడతల్లో ఏడాదికి రూ.6,000 పెట్టుబడి సాయం ఇస్తున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఇస్తోంది.
చదవండి: మోడీ సాయం... జగన్ రైతుభరోసాకు రూ.5,085 కోట్లు, వారు అర్హులేనా?
స్టిక్కర్ సీఎం విమర్శలు
ప్రధాని మోడీని జగన్ ఆహ్వానించినప్పటికీ ఆయన రాకపై అనుమానాలు ఉన్నాయి. రైతులకు ఇచ్చే ఈ సాయం సహా వివిధ పథకాలపై గత ప్రభుత్వం లాగే వైయస్ జగన్ కూడా స్టిక్కర్ సీఎం అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాలకు వైసీపీ ప్రభుత్వం తమ పేర్లు పెట్టుకుంటోందని ఇప్పటికే బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. రైతులకు ఇచ్చే ఈ పథకం విషయంలోను వైసీపీతో ఏపీ బీజేపీ నేతలు ఏకీభవించడం లేదు.
బీజేపీ వాదన ఇదీ...
రైతు భరోసా స్కీం కింద పెట్టుబడి సాయంగా ఒక్కో రైతు కుటుంబానికి రూ.12,500 వంతున ఇస్తారు. ఈ పథకంవల్ల దాదాపు 54 లక్షల మందికి పైగా రైతు, కౌలు రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. వారి ఖాతాల్లో మొత్తం రూ.5,500 కోట్లు జమ చేస్తారు. జగన్ తన తండ్రి వైయస్సార్ పేరిట రైతు భరోసా పథకం పెట్టారని, ఇందులో దాదాపు సగం మోడీ ప్రభుత్వం ఇస్తోందని గుర్తు చేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులతో అమలు చేస్తోన్న ఈ పథకానికి సొంతగా పేరు పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
కేంద్రం నుంచి రూ.6,000
రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తున్నట్లు వైసీపీ తెలిపింది. అయితే కౌలు రైతులు మినహా దాదాపు మిగతావారందరికీ మోడీ ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీం కింద ఇచ్చే రూ.6,000కు జగన్ ప్రభుత్వం మరో రూ.6500 జమ చేస్తోంది. పీఎం కిసాన్ స్కీం ద్వారా కేంద్రం నుంచి సగం నిధులు వస్తుండగా, జగన్ ప్రభుత్వం మాత్రం రూ.12,500 తామే ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటోందనేది బీజేపీ నేతల వాదన.
కేంద్రం తొలుత చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం వర్తింప చేయాలని భావించింది. ఆ తర్వాత ప్రతి రైతుకు వర్తింప చేస్తున్నారు. అంటే రైతులందరికీ రాష్ట్ర సాయం రూ.6,500, కేంద్రం సాయం రూ.6,000 అవుతుంది.