ఫండింగే కాదు... పేటెంట్లు కూడా కష్టమే! మరో గూగుల్, ఫేస్బుక్ రావాలంటే అదే కీలకం
భారత దేశం కోటి అవకాశాల గని అని మెచ్చుకొన్న వారు ఉన్నారు. పది కోట్ల సమస్యల కాసారం అని తిట్టుకున్న వారూ ఉన్నారు. అభివృద్ధి లో మన దేశం ఒక అడుగు ముందుకు వేస్తుండగా, ఇన్నోవేషన్స్ (నవకల్పన) లో మూడు అడుగులు వెనక్కు వెళ్ళిపోతోంది. ప్రపంచానికి మరో గూగుల్, పేస్ బుక్, ఆపిల్ వంటి సంస్థలను అందించాలంటే మనకు కావాల్సింది ఇన్నోవేషన్స్. వీటిని సంరక్షించేవి పేటెంట్లు. భారత దేశంలో ఇన్నోవేటివ్ ఆలోచనలకు కొదవ లేదు.
కానీ వాటిని చట్టబద్ధంగా సంరక్షించుకోవటం మనకు కష్టతరమవుతుంది. ఎందుకంటే మన కంపెనీలు, స్టార్టప్ లు, వ్యక్తిగతంగా పేటెంట్లు దరఖాస్తు చేస్తే... అవి ఎన్నటికి ప్రభుత్వ అనుమతి పొందుతాయో తెలియదు. ఏళ్ళకేళ్లు ఎదురు చూడాలే కానీ పేటెంట్ మాత్రం జారీ కాదు. దీంతో మన దేశం లో పరిశోధన & అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కుంటుబడుతోంది. అదే సమయంలో అమెరికా, చైనా, జపాన్, యూరోప్ దేశాలు దూసుకుపోతున్నాయి. ఇప్పటికైనా మన ప్రభుత్వం మేలుకొని ఇన్నోవేషన్స్ కోసం శ్రమిస్తున్న వారికి తోడ్పాటు అందించాలని విశ్లేషకులు కోరుతున్నారు.
పండుగ టైంలో మరో శుభవార్త: రుణాలు తీసుకునేవారికి తీపి, వారికి
కేవలం 12,000 అనుమతులు..
భారత దేశం లో 130 కోట్ల మంది జనాభా ఉండగా, మన దేశం 2017 లో అనుమతిచ్చిన పేటెంట్ల సంఖ్య కేవలం 12,000 మాత్రమేనంటే పరిస్థితి ఎలా ఉందొ తెలుస్తోంది. మన దేశంలో 46,582 పేటెంట్లు దాఖలు అయితే, అనుమతి లభించినవి మాత్రం 12,000 మాత్రమే. అదే సమయంలో చైనా లో మాత్రం 4,20,144 పేటెంట్లకు అనుమతులు లభించాయి. అమెరికా లో 3,18,829 పేటెంట్లకు అనుమతి దక్కింది. జపాన్ కూడా 1,99,577 పేటెంట్లకు అనుమతులు మంజూరు చేసింది. ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో ఈ గణాంకాలను వెల్లడించింది. స్టార్టుప్ కంపెనీల నెలకల్పన లో అమెరికా, చైనా, జపాన్ లతో పోటీ పడుతున్న భారత్... పేటెంట్ల విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉంటోంది. దీంతో, కొత్త టెక్నాలజీల ను మార్కెట్లోకి ప్రవేశ పెట్టాలంటే మన కంపెనీలకు కష్టతరమవుతుంది.
ఆర్ అండ్ డీ లో అర కొరే..
పరిశోధన & అభివృద్ధి రంగంలో భారీ పెట్టుబడుల ద్వారానే ఏ కంపెనీ అయినా... ఏ దేశమైన కొత్త ఆవిష్కరణలను సాధించగలుగుతుంది. అది అమెరికా లోని నాసా అయినా... భారత్ లోని ఇస్రో అయినా అదే సూత్రం వర్తిస్తుంది. మన చంద్రయాన్-2 ప్రయోగం కోసం సుమారు రూ 1,000 కోట్లు ఖర్చు చేసింది భారత్. ఇలాగే అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఆర్ అండ్ డీ పై మెరుగైన పెట్టుబడి పెట్టి కొత్త ఆవిష్కరణలతో సంపదను సృష్టిస్తున్నాయి. మనమేమో వెనుకబడి పోతున్నాం. 2016-17 లో భారత్ ఆర్ అండ్ డీ పై జీడీపీ లో కేవలం 0.7% ఖర్చు చేసింది. కానీ జపాన్ 3.2% శాతం ఖర్చుతో ఈ విషయంలో ముందు వరుసలో ఉంది. అమెరికా 2.8% తో రెండో స్థానంలోనూ, 2.1% ఖర్చుతో పొరుగు దేశం చైనా మూడో స్థానంలో నిలుస్తోంది. పరిశోధనలపై అరకొర పెట్టుబడులతో మెరుగైన ఫలితాలను సాధించటం కష్టమని నిపుణులు పేర్కొంటున్నారు.
మన దగ్గరా వారిదే పెత్తనం...
అసలు భారత్ లో పేటెంట్ల అనుమతులు తక్కువగా ఉన్నాయంటే... అందులో మళ్ళీ అమెరికా, చైనా సహా ఇతర దేశాలకు చెందిన కంపెనీలు నమోదు చేసిన పేటెంట్ల సంఖ్య అధికంగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. గత ఏడాదిలో అమెరికా కు చెందిన చిప్ తయారీ కంపెనీ క్వాల్ కామ్ కంపెనీ అత్యధికంగా 405 పేటెంట్లను పొందింది. ఈ సంఖ్య భారత్ హెవీ ఎలెక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) కంటే నాలుగు రేట్లు అధికం కావటం విశేశం. అదే సమయంలో అధిక సంఖ్యలో మన దేశంలో పేటెంట్లు దాఖలు చేసిన కంపెనీల్లో కూడా క్వాల్ కామ్ మొదటి స్థానంలో ఉంది. మొత్తంగా ఈ కంపెనీ 1,559 పేటెంట్లను నమోదు చేయగా, శ్యాంసంగ్ 1,320, హువవె 968, ఎరిక్ సొన్ 650, ఒప్పో 498 పేటెంట్లను దాఖలు చేసాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ విషయంలో 239 పేటెంట్లతో కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ ... ఇతర విదేశీ కంపెనీలతో పోల్చితే పోటీ పడేంత అధిక పేటెంట్ల ను నమోదు చేయలేక పోయింది.
ముందు వరుసలో ఐఐటీ లు ...
విద్య లోనే కాకుండా ఇన్నోవేషన్స్ లోనూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) లు ముందున్నాయి. ఐఐటీ ల్లో సీట్ కోసం అందుకే అంత డిమాండ్. 2018-19 సంవత్సరంలో మన దేశంలో 557 పేటెంట్లు నమోదు చేసి దేశంలోని ఐఐటీ లు తోలి స్థానంలో నిలిచాయి. ఈ విషయంలో చండీఘర్ యూనివర్సిటీ 336 పేటెంట్లతో రెండో స్థానంలో ఉంది. టీసీఎస్ (239) మూడో స్థానంలో, సీఎస్ఐఆర్ 202 పేటెంట్లు, భెల్ 173 పేటెంట్లు దాఖలు చేసి ఐదో స్థానంలో నిలిచాయి. కాబట్టి, ఇప్పటికైనా భారత ప్రభుత్వం పేటెంట్ల జారీ ప్రక్రియను వేగిరం చేసి మన కంపెనీలు ప్రపంచ స్థాయి సంస్థలతో పోటీ పడేందుకు మద్దతు ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.