రోజా నెల శాలరీ రూ.2 లక్షలు, అలవెన్స్ కలిపి రూ.3.82 లక్షలు
అమరావతి: నగరి నియోజకవర్గం శాసన సభ్యురాలు రోజా ఏపీఐఐసీ చైర్పర్సన్గా ఉన్న విషయం తెలిసిందే. చైర్పర్సన్ హోదాలో రోజాకు జీతభత్యాల కింద నెలకు రూ.3.82 లక్షలు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రూ.2 లక్షలు వేతనంగా నిర్ణయించగా, వెహికిల్ కోసం రూ.60వేలు, అధికారిక క్వార్టర్లో నివాసం లేకుంటే వసతి సౌకర్యానికి నెలకు రూ.50వేలు, మొబైల్ ఫోన్ ఛార్జీలకు రూ.2వేలు, వ్యక్తిగత సిబ్బంది జీతభత్యాల కోసం నెలకు రూ.70వేలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
కేబినెట్లో చోటు దక్కక అసంతృప్తి..
ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికల్లో రోజా రెండోసారి నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటి నుంచి జగన్కు అండగా ఉన్న రోజాకు మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. కానీ వివిధ కారణాల వల్ల ఆమెకు కేబినెట్లో చోటు దక్కలేదు. ఆమె అసంతృప్తికి గురయ్యారనే ప్రచారం కూడా సాగింది. ఈ నేపథ్యంలో ఆమెకు ఏపీఐఐసీ పదవి ఇచ్చారు.
మూడు నెలల క్రితం ఉత్తర్వులు..
ఏపీఐఐసీ చైర్మన్గా జూలై 10వ తేదీన ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదే నెలలో ఐదు రోజుల తర్వాత బాధ్యతలు చేపట్టారు. ఉత్తర్వుల సమయంలో ఆమె జీతభత్యాల గురించి పేర్కొనలేదు. దీనికి సంబంధించి తాజాగా శుక్రవారం (అక్టోబర్ 4) ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె వేతనం, భత్యాల గురించిన జీవోను జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. వేతనం, ఇతర అలవెన్స్ కలిపి రూ.3.82 లక్షలు నెలకు పొందనున్నారు.
టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా...
రోజా నటి నుంచి రాజకీయ నాయకురాలిగా మారారు. తొలుత తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి ముందు ఆయనను కలిసి టీడీపీలో చర్చనీయాంశంగా మారారు. ఆ తర్వాత జగన్ వెంట నడిచారు. గత పదేళ్లుగా ఆమె తెలుగుదేశం పార్టీ, పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. ఆమెను ఐరన్ లెగ్ అని విపక్షాలు ఎద్దేవా చేస్తుంటాయి. టీడీపీ ఓటమి, జగన్ ఓటమికి ఆమె ఐరన్ లెగ్ కారణమని విమర్శలు గుప్పించిన సందర్భాలో ఎన్నో. కానీ 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత తాను ఐరన్ లెగ్ కాదని నిరూపితమైందని ఆమె భావోద్వేగంతో చెప్పారు. రోజా నాయకురాలిగానే కాకుండా టీవీ షోల ద్వారా కూడా సంపాదిస్తుంటారు. జబర్దస్త్ వంటి వివిధ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు.