కేంద్ర ప్రభుత్వం నుంచి దీపావళి మెగా ధమాకా సేల్!
కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపుతో సహా కేంద్ర ప్రభుత్వం పలు ఉద్దీపనలు ప్రకటించిన అనంతరం మార్కెట్లు జోరందుకున్నాయి. గత కొంతకాలంగా ఐపీవోపై వెనక్కి తగ్గిన కంపెనీలు ఇప్పుడు ఆ దిశగా ఆలోచిస్తున్నాయి. ఇప్పుడు ఐపీవోకు వచ్చే కంపెనీలకు భారీ మార్కెట్ విలువ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ దిశగా ఆలోచిస్తోంది.
తాజాగా ఐఆర్సీటీసీని ప్రభుత్వం ఐపీవోకు తీసుకు వచ్చింది. మెరుగైన లాభాలు, నగదు నిల్వలు చూపించే కంపెనీలకు ఐపీవోలో భారీ డిమాండ్ సహజం. ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.05 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
పలు కంపెనీల్లో వాటాల విక్రయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యదర్శుల బృందం సోమవారం కొన్ని కంపెనీల్లో వాటాల వ్యూహాత్మక విక్రయానికి క్లియరెన్స్ ఇచ్చింది. వీటిలో ఎయిరిండియా, భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ ((BPCL), బీఈఎంఎల్, కంటెయినర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (Concor), BEML, షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (SCI), THDC India, Neepco, NTPC కంపెనీలు ఉన్నాయి.
HDFC ఫెస్టివ్ ట్రీట్స్ అదుర్స్:భారీ డిస్కౌంట్, 7,000 వరకు క్యాష్బ్యాక్, లోన్ తీసుకుంటే...
ఎయిరిండియాపై రూ.30వేల కోట్ల రుణభారం ఉంది. ప్రస్తుతం సానుకూల ధోరణి ఉన్నందున ఇన్వెస్టర్లు ముందుకు వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఎయిర్ ఇండియాకు సంబంధించిన పేపర్ వర్క్ ప్రారంభమైంది. త్వరలో ప్రకటన వెలువడవచ్చు.
BPCLలో ప్రభుత్వం వాటా 55,000 కోట్లుగా ఉంటుందని అంచనా కాగా, ప్రభుత్వం రూ.65,000 కోట్లుగా ఉందని భావిస్తోంది. ప్రభుత్వం వాటా 53.3 శాతంగా ఉందని, కాబట్టి ఈ వాటాల విక్రయానికి పార్లమెంట్ అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
BEMLలో ప్రభుత్వానికి 54 శాతం వాటా ఉంది. దీని విలువ రూ.2,100 కోట్ల వరకు ఉండవచ్చు. కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వానికి 54.8 శాతం ఉండగా రూ.20 వేల కోట్ల వ్యాల్యూ ఉంటుందని అంచనా. షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో 73.75 శాతం వాటా విలువ రూ.1300 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ షేర్లను విక్రయించి భారీగా నిధులు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అంతా అనుకున్నట్లు సాగితే దీపావళి నాటికి మార్కెట్లో ప్రభుత్వరంగ కంపెనీలు వాటాల విక్రయంతో సందడి చేయవచ్చునని చెబుతున్నారు.