పెట్రోల్ ధర భారీగా పెరుగుతుంది: సౌదీ ప్రిన్స్ హెచ్చరిక, హైదరాబాద్లో లీటర్ రూ.79
వాషింగ్టన్/ఢిల్లీ: పెట్రోల్ ఉత్పత్తుల ధరలు భారీగా పెరగవచ్చునని సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ హెచ్చరించారు. ఇరాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో పరిస్థితి మరింతగా ముదిరితే ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇరాన్ దూకుడును ప్రపంచ దేశాలు అడ్డుకోవాలని, లేదంటే ఉద్రిక్తతలు మరింత ముదిరి అంతర్జాతీయ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశముందన్నారు. ఆయిల్ సరఫరాకు ఇబ్బందులు ఏర్పడతాయన్నారు.
మళ్లీ పెరిగిన బంగారం ధరలు: హైదరాబాద్, ఢిల్లీ మార్కెట్లో...
పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతాయని హెచ్చరిక
పరిస్థితులు సానుకూలంగా లేకుంటే పెట్రోల్ వంటి ఆయిల్ ధరలు జీవితకాలం గరిష్టానికి చేరుకుంటాయని మహ్మద్ బిన్ సల్మాన్ హెచ్చరించారు. ఇరాన్ను అరికట్టకుంటే ఆయిల్ ధరలు పెరుగుతాయని, కానీ సైనిక విధానంతో కాకుండా రాజకీయ పరిష్కారాన్ని తాను కోరుకుంటానని చెప్పారు. చమురు ధరలకు అంతరాయం ఏర్పడితే, లైఫ్ టైమ్ హైకి చేరుకుంటాయన్నారు.
ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే అవకాశం
ప్రపంచంలో 30 శాతం ఇంధన ఎగుమతులు, 20 శాతం వాణిజ్య మార్గాలకు మిడిల్ ఈస్ట్ ప్రాంతం నెలవుగా ఉందని, ప్రపంచ జీడీపీలో నాలుగు శాతం ఇక్కడి నుంచే వస్తోందని మహ్మద్ బిన్ సల్మాన్ అన్నారు. ఇవన్నీ ప్రభావితం అవుతాయన్నారు. అంటే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. శాంతియుత, రాజకీయ మార్గాల ద్వారా ఇరాన్ను కట్టడి చేయాలన్నారు.
ఏం జరిగింది?
సౌదీ అరేబియాలోని ఆరామ్కోకు చెందిన అబ్ ఖైక్, ఖురైస్ శుద్ధి కేంద్రాలపై ఇరాన్తో సంబంధాలు ఉన్న హుతీ తిరుగుబాటుదారులు డ్రోన్ దాటికి పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ చమురు ఎగుమతుల్లో 5 నుంచి ఆరు శాతం ప్రభావితమయ్యాయి. ఈ దాడికి ఇరాన్ కారణమని సౌదీ అరేబియాతో పాటు అమెరికా ఆరోపిస్తున్నాయి. దీంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ముంబైలో పెట్రోల్ ధర రూ.80
ఇదిలా ఉండగా, గత మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ పైన 7 నుంచి 8 పైసలు, డీజిల్ పైన 9 నుంచి 10 పైసలు పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా... ఢిల్లీలో రూ.74.42, రూ.67.33, కోల్కతాలో రూ.77.10, రూ.69.75, ముంబైలో రూ.80.08, రూ.70.64, చెన్నైలో రూ.77.36, రూ.71.19గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు...
హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ.79.11, డీజిల్ రూ.73.39గా ఉంది. అమరావతిలో లీటర్ పెట్రోల్ రూ.78.77, డీజిల్ రూ.72.71, విజయవాడలో రూ.78.40, డీజిల్ రూ.72.37గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్కు 0.34 శాతం పెరుగుదలతో 61.25 డాలర్లకు చేరుకుంది. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 0.34 శాతం పెరిగి 56.10 డాలర్లుగా ఉంది.