హైదరాబాద్వాసులకు శుభవార్త, అదనపు ఛార్జీ లేకుండా క్యాబ్!
హైదరాబాద్: భాగ్యనగరంవాసులకు శుభవార్త! త్వరలో నగరంలో మరో కొత్త క్యాబ్ అగ్రిగేటర్ ప్రారంభం కానుంది. ప్రైడో పేరిట క్యాబ్ సర్వీసులు ఇక్కడ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఇతర మెట్రో నగరాల్లోను ప్రారంభిస్తారు. ఈ మేరకు స్టార్టప్ వెంకట ప్రణీత్ టెక్నాలజీస్ తెలిపింది. సెప్టెంబర్ 29వ తేదీ నుంచి క్యాబ్ సేవలు ప్రారంభిస్తున్నారు.
PF Transfer: ఆన్లైన్ ద్వారా పీఎఫ్ను ఇలా ట్రాన్సుఫర్ చేయండి
రూ.100 కోట్ల పెట్టుబడి
ప్రైడో క్యాబ్కు ఇప్పటికే 14,000 మంది డ్రైవర్లు భాగస్వాములుగా చేరారు. భాగ్యనగరంలో ప్రయోగాత్మకంగా ఈ సేవలు అందిస్తున్నట్లు ప్రైడో వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర తెలిపారు. హ్యాచ్ బ్యాక్, సెడాన్, ఎస్యూవీ విభాగంలో క్యాబ్స్ను అందించనున్నట్లు తెలిపారు. క్యాబ్ విస్తరణ కోసం రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపారు.
హాక్-ఐతో మిళితం
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హాక్-ఐతో ప్రైడో యాప్ను మిళితం చేశామని, డ్రైవర్లకు సంబంధించిన అన్ని వివరాలు స్వయంగా పరిశీలించిన తర్వాతే వారిని ప్రైడోలో భాగస్వాములుగా చేసుకున్నట్లు తెలిపారు.
డ్రైవర్లకు లాభాలు...
డ్రైవర్ల నుంచి పది శాతం లోపు కమిషన్ తీసుకుంటామని, తద్వారా వారికి మరింత ఆదాయం చేకూరేందుకు ఇది తోడ్పడుతుందని చెప్పారు. దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఖాళీగా తిరిగి వచ్చే డ్రైవర్లకు నష్టం రాకుండా రిటర్న్ కంపన్సేషన్ ఉంటుందని తెలిపారు. రైడ్స్ ఆధారంగా 0 నుంచి 10 శాతం వరకు కమిషన్ ఛార్జ్ చేస్తామన్నారు.
నెల ముందు కూడా బుక్ చేసుకోవచ్చు
అప్పటికప్పుడే కాకుండా వారం, నెల ముందుగా కూడా మీరు ప్రైడోలో క్యాబ్ బుక్ చేసుకోవచ్చునని చెప్పారు. ప్రత్యేక సందర్భాల్లో బల్క్ బుకింగ్కు కూడా అవకాశముందని చెప్పారు. ప్రయాణీకులకు దగ్గరలో క్యాబ్లు అందుబాటులో లేకుంటే దూరం నుంచి అయినా అందుబాటులో ఉంటాయని తెలిపారు. రద్దీ సమయాల్లో ఎలాంటి అదనపు ఛార్జ్ లేకుండా కార్ల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.
రియల్ నుంచి క్యాబ్ సేవలు...
ఇప్పటికే ప్రణీత్ గ్రూప్ పేరిట రియల్ ఎస్టేట్ రంగంలో సేవలు అందిస్తున్నామని, సొంత నిధులతోనే ప్రైడోను ప్రారంభించామని నరేంద్ర చెప్పారు. మూడు నెలల్లో నగరంలో 10 లక్షల రైడ్స్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. డ్రైవర్లను హ్యాపీగా ఉంచితే రైడర్లు హ్యాపీగా ఉంటారనేది తమ సిద్ధాంతమన్నారు. అందుకు అనుగుణంగా బిజినెస్ మోడల్ రూపొందించామన్నారు.