ఇండియాపై ఎమ్మెన్సీల కన్ను.. కార్పొరేట్ పన్ను తగ్గింపుతో ఇక ‘ఛలో భారత్’!
కేంద్రం ఇటీవల కార్పొరేట్ పన్ను రేటును 30 నుంచి 22 శాతానికి రేటు తగ్గించడం, కొత్తగా తయారీ రంగంలో ఏర్పాటయ్యే కంపెనీలకు ఈ పన్నును 15 శాతానికి తగ్గించడంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మల్టీ నేషనల్ కంపెనీల దృష్టి భారత్పై పడిందని, దీనికితోడు అమెరికా, చైనాల నడుమ సాగుతున్న వాణిజ్య పోరు కూడా మనకు బాగా కలిసి వస్తుందని ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ పన్నులకు సంబంధించి తాజా తగ్గింపుతో దక్షిణ, ఈశాన్య ఆసియా దేశాలన్నింటిలోకెల్లా తక్కువ కార్పొరేట్ పన్ను కలిగిన దేశంగా భారత్ అవతరించింది. అయితే భారత్ను తయారీ రంగ హబ్గా తీర్చిదిద్దేందుకు మరిన్ని చర్యలు మోడీ సర్కారు తీసుకోవాలసిన అవసరం ఉందని, భూసేకరణ, కార్మిక చట్టాలను సరళతరం చేయడంతోపాటు మౌలిక సదుపాయాలను మరింత పెంచాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు.
ఇక చైనాకు గుడ్ బై!?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన బహుళ జాతి కంపెనీలు తమ తయారీ యూనిట్లను చైనాలో ఏర్పాటు చేసి అక్కడ ఉత్పత్తి అయిన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ వస్తున్నాయి. వీటిలో అమెరికాకు చెందిన కంపెనీలు కూడా ఉన్నాయి. వాణిజ్య పోరు కారణంగా ఇప్పటికే డెల్, యాపిల్, హెచ్పీ సహా 50కి పైగా ఎమ్మెన్సీలు చైనాకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నాయి.
భారత్కు వలసపై ఎమ్మెన్సీల దృష్టి...
చైనాలో తయారీని విరమించుకుంటున్న పలు ఎమ్మెన్సీలు తమ తయారీ యూనిట్లను వియత్నాం, తైవాన్, థాయ్లాండ్, మలేషియాకు తరలించే ప్రయత్నాల్లో ఉన్నాయి. అయితే మోడీ సర్కారు తాజాగా తీసుకున్న కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపుతో ఇప్పుడు వీటి దృష్టి భారత్పై పడింది. ఇప్పటికే చైనా నుంచి పూర్తిగా లేదంటే పాక్షికంగా వైదొలగిన పలు కంపెనీలు భారత్లో తయారీ యూనిట్ల స్థాపనకు యోచిస్తున్నాయి.
సేవల నుంచి తయారీ రంగం దిశగా...
మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా సేవలపై ఆధారపడినదే. మొదటినుంచీ తయారీ రంగంలో ఉన్న కంపెనీలు తక్కువే. భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో తయారీ రంగ వాటా కేవలం 18 శాతమే. అయితే పెట్టుబడులు, ఉద్యోగావకాశాలను పెంచేందుకు కేంద్రంలో మోడీ సర్కారు వచ్చాక తీసుకొచ్చిన ‘మేకిన్ ఇండియా' కార్యక్రమం ఇప్పటి వరకు అంతగా సత్ఫలితాలను ఇవ్వలేదు.
ఆ రెండు రంగాల్లో కొత్త పెట్టుబడులు...
కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపుతో భారీగా లబ్ది పొందే రంగాల్లో ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ)లు ఉండడంతో ఆ రంగాల్లో కొత్తగా పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అలాగే చైనా నుంచి బయటికి రావాలనుకుంటున్న పలు కంపెనీలు వాటి తయారీ యూనిట్లను భారత్లో ఏర్పాటు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. భారత్లో తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని యాపిల్ కంపెనీ ఎప్పట్నించో ప్రయత్నాలు సాగిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో మరిన్ని మల్టీనేషనల్ కంపెనీలు భారత్కు తరలి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.