మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు: 8 రోజుల్లో రూ.2కు పైగా పెరిగింది
పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. పెట్రోల్ పైన 22 పైసలు, డీజిల్ పైన 14 పైసలు పెంచుతూ చమురు ఉత్పత్తి సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గత ఎనిమిది రోజులుగా పెట్రో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఎనిమిది రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.2.20 పెరగగా, డీజిల్ ధర రూ.1.64 పెరిగింది. సౌదీ అరేబియా చమురు బావులపై డ్రోన్ దాడుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం భారత్ పైన కూడా పడింది.
పెరిగిన పెట్రోల్ ధర, శుభవార్త చెప్పిన కేంద్రమంత్రి
సోమవారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 29 పైసలు పెరిగి రూ.73.91కి చేరుకోగా, లీటర్ డీజిల్ 19 పైసలు వడ్డించడంతో రూ.66.93కి చేరుకుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న వ్యాట్, ఇతర పన్నుల ఆధారంగా ధరలు మరింత అధికమవుతున్నాయి. నిన్న హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 31 పైసలు ఎగబాకి రూ.78.57, డీజిల్ 21 పైసలు పెరిగి రూ.72.96గా ఉంది.
మంగళవారం పెట్రోల్ ధరలు ఢిల్లీలో రూ.74 దాటగా, ముంబైలో రూ.80కి సమీపంలో ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.74.13 పైసలు, డీజిల్ రూ.67.07 పైసలుగా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.79.79, డీజిల్ రూ.70.37గా ఉంది.
సెప్టెంబర్ 16వ తేదీ నుంచి ఈ ఎనిమిది రోజుల్లో ముఖ్య నగరాల్లో పెట్రోల్ ధరలు ఇలా పెరిగాయి.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.2.10, ముంబైలో రూ.2.08, కోల్కతాలో రూ.2.06, చెన్నైలో రూ.2.21 పెరిగింది. సెప్టెంబర్ 14వ తేదీన సౌదీ చమురు క్షేత్రాల్లో డ్రోన్ దాడి తర్వాత ధరలు పెరుగుతున్నాయి.
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఢిల్లీలో పెట్రోల్ ధరలు రూ.5.48 పెరిగాయి. డీజిల్ రూ.4.41 పెరిగింది. అలాగే, మరో నాలుగు ముఖ్య నగరాల్లో డీజిల్ ధరలు రూ.1.76 వరకు పెరిగింది.
చమురు దిగుమతిదారుల్లో ప్రపంచంలోనే భారత్ మూడో స్థానంలో ఉంది. చమురు ఎగుమతుల్లో సౌదీ అరేబియానే వరల్డ్ టాప్. ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో గ్లోబల్ క్రూడ్ మార్కెట్కు సౌదీ అరేబియానే పెద్ద దిక్కు అయింది. ఇప్పుడు ఆ దేశ రిఫైనరీలపై జరిగిన దాడులు అటు గ్లోబల్ మార్కెట్ను, ఇటు భారతీయ మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి.
ఇరాక్ తర్వాత సౌదీ అరేబియా నుంచే అత్యధికంగా ముడి చమురును భారత్ కొనుగోలు చేస్తోంది. 2018-19లో భారత్కు 207.3 మిలియన్ టన్నుల చమురు దిగుమతులు చేసుకోగా, సౌదీ వాటా 40.33 మిలియన్ టన్నులు. ఈ క్రమంలో తగ్గిన సౌదీ చమురు ఉత్పత్తి దేశీయ మార్కెట్లో పెట్రో ధరలకు మరింతగా రెక్కలు తొడిగే వీలుందని అంచనా.