Corporate tax: ఆఫర్లతో సహా ధరలు తగ్గించండి... నో చెబుతున్న కంపెనీలు
ముంబై: కేంద్ర ప్రభుత్వం ఇటీవల కార్పోరేట్ ట్యాక్స్ తగ్గిస్తూ కంపెనీలకు పెద్ద శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం మార్కెట్లు పరుగులు పెట్టాయి. కార్పోరేట్లకు 10 నుంచి 12 శాతం వరకు ట్యాక్స్ తగ్గిస్తున్నట్లు గత శుక్రవారం ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దేశీయ కంపెనీలకు సెస్, సర్ఛార్జ్లు కలిపి 25.17 శాతం మాత్రమే. ఈ కొత్త ట్యాక్స్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. రూ.1.45 లక్షల కోట్ల ఉద్దీపన ప్రకటించారు. దీనిని కార్పోరేట్ కంపెనీలు స్వాగతించాయి. ఇండియా టుడే కాన్క్లేవ్లో పలువురు ప్రముఖులు మాట్లాడారు.
జగన్ రూ.58 కోట్లు ఆదా చేశారా? సేవింగ్ పేరుతో రూ.32వేలకోట్లు!
ఇది గొప్ప ప్రకటన
ఇది చాలా గొప్ప ప్రకటన అని, ఇది ఆర్థిక పురోగతిని మారుస్తుందని, కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించిన కారణంగా ఎంతో సానుకూలత ఏర్పడుతుందని, ముందు ముందు అద్భుత గొప్ప ఫలితాలు చూస్తామని గోద్రేజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రేజ్ అన్నారు. కార్పోరేట్ పన్ను తగ్గింపు నేపథ్యంలో ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా అర్థమవుతోందని, సమస్యలను వినేందుకు ఆసక్తి చూపిస్తోందని, ఇది మంచి దశ అని, అయితే డిమాండ్ పెంచవలసి ఉందని పిరమిల్ గ్రూప్ అజయ్ పిరమిల్ అన్నారు.
చాలా పెద్ద ముందడుగు
మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ మాట్లాడుతూ... ట్యాక్స్ కట్ చాలా పెద్ద ముందడుగు అన్నారు. మానుఫ్యాక్చరింగ్ గ్రోత్ రేట్ లేదా జీడీపీ వాటాలో ఎక్కడా అవసరమైన స్థాయిలో లేదన్నారు. మానుఫ్యాక్చరింగ్ 5 శాతం వరకు తగ్గిందని, దీనిని 15 శాతం పెంచవలసి ఉందన్నారు.
పన్ను తగ్గింపులు సరఫరా వైపు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని, అయితే డిమాండ్ వైపు ఉన్న సమస్యను కూడా పరిష్కరించాల్సి ఉందని హీరానందాని గ్రూప్కు చెందిన నిరంజన్ హీరానందానీ అన్నారు.
ఇక ధరలు తగ్గించాలి...
ఈ కార్యక్రమానికి నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ హాజరయ్యారు. ప్రభుత్వం కార్పోరేట్ ట్యాక్స్ను తగ్గించిందని, ఈస్ట్ ఏసియన్ దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల ఉత్తమ ట్యాక్స్ విధానాలకు సమానంగా తగ్గించిందని చెప్పారు. కార్పోరేట్ ట్యాక్స్ కట్ వల్ల కంపెనీలపై భారం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. మారుతీ, మహింద్రా, గోద్రేజ్ వంటి కంపెనీలు కార్పోరేట్ కట్ ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని అభిప్రాయపడ్డారు. కంపెనీలు తమ ధరలు తగ్గించి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు రావాలన్నారు.
కస్టమర్లకు భారీ డిస్కౌంట్..
కార్పోరేట్ ట్యాక్స్ను భారీగా తగ్గించిన నేపథ్యంలో కంపెనీలు మంచి డిస్కౌంట్స్తో కస్టమర్లకు ఉత్పత్తులను అందించాలన్నారు. పరిశ్రమలు, సంస్థల డిమాండ్ పునరుద్ధరించేందుకు, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు భారీ తగ్గింపులు ప్రకటించాలని, వినియోగదారులలో అనిమల్ స్పిరిట్ క్రియేట్ చేయాలన్నారు.
ట్యాక్స్ కట్ చేస్తే ధరలు అంతే తగ్గించలేం
అయితే, అమితాబ్ కాంత్ అభ్యర్థనతో ఆది గోద్రేజ్ ఏకీభవించలేదు. పన్ను కోతలతో సమానంగా ధరలు తగ్గించలేమని అభిప్రాయపడ్డారు. వినియోగదారులకు మంచి ప్రోత్సాహకాలు ఇవ్వవచ్చునని, కానీ ఇది ఉత్పత్తుల రిటైల్ ధరలు తగ్గించేందుకు మాత్రం సరిపోదన్నారు.