మాంద్యం ఉందా? లేదా? ఈ ‘పండుగల సీజన్’ తేల్చేస్తుంది!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా పయనిస్తున్న నేపథ్యంలో ఆ ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తోందని, సామాన్యుడి కొనుగోలు శక్తి తగ్గిందని, ఆ ప్రభావం ఇప్పటికే రియల్టీ, ఆటోమొబైల్, ఇతర రంగాల్లో కనిపిస్తోందని పలువురు ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తుండగా.. కేంద్రం మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తోంది.
మన దేశ ఆర్థిక వ్యవస్థ మరీ అంత బలహీనంగా ఏమీ లేదని, మాంద్యం పరిస్థితులు అసలు మన ఆర్థిక వ్యవస్థలో లేవని చెబుతోంది. మరి ఆయా రంగాల్లో కొనుగోళ్లు ఎందుకు పడిపోయాయంటే మాత్రం ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రావడం లేదు. ఈ నేపథ్యంలో అసలు దేశంలో మాంద్యం నెలకొందా? లేదా? అన్నది రాబోయే 'పండుగల సీజన్' తేల్చేయనుంది.
ఆందోళన కలిగిస్తోన్న వృద్ధి రేటు...
మన దేశ జీడీపీ వృద్ధి ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయిందని, వృద్ధి రేటు కూడా 5 శాతానికి పడిపోయిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. దీనికితోడు సామాన్యుడి కొనుగోలు సామర్థ్యం తగ్గిపోవడం. ఈ ప్రభావం ఇప్పటికే రియాల్టీ, ఆటోమొబైల్, గృహోపకరణ వస్తువుల రంగాలపై కనిపిస్తోంది.
వ్యక్తిగత కొనుగోళ్లే ముఖ్యం...
మన దేశ ఆర్థిక వ్యవస్థను బతికిస్తున్నది వ్యక్తిగత కొనుగోళ్లే. దేశ జీడీపీలో ఈ వ్యక్తిగత కొనుగోళ్ల విలువ 60 శాతం వరకు ఉంటుంది. అయితే ఈ ఏడాది గడిచిన రెండు త్రైమాసికాల్లో ఈ వ్యక్తిగత కొనుగోళ్లు బాగా పడిపోయాయి. కొత్తగా ఉద్యోగాలు రాకపోవడం, ఉద్యోగాలు చేస్తున్న వారికి జీతాలు పెద్దగా పెరగకపోవడంతో ఎవరికి వారు వ్యయాలను తగ్గించుకుంటున్నారు.
ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించినా...
ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం గుప్పిట్లో ఇరుక్కుపోయిన 2008-09 ఆర్థిక సంవత్సరంలో కూడా మన దేశ జీడీపీ వృద్ధిరేటు మరీ ఇంత దయనీయంగా లేదు. నిజానికి వాహనాల అమ్మకాలు గత దసరా-దీపావళి సీజన్కే భారీగా పడిపోయాయి. మాంద్యం పరిస్థితులు ఇతర రంగాలనూ ప్రభావితం చేశాయి. దీంతో కేంద్రం రెండు దఫాలుగా వివిధ రంగాలకు సంబంధించి ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించింది. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పూ కానరాలేదు.
ఈ-కామర్స్ రంగం తోడవడంతో...
అన్ని పండుగలకెల్లా దీపావళికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే.. ఈ పండుగ సందర్భంగా బంగారం, దుస్తులు, గృహోపకరణాలు పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం భారతీయులకు రివాజు. పైగా ఈ-కామర్స్ రంగం కూడా ఆయా వస్తువుల కొనుగోలును మరింత సులభతరం చేసింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు తక్కువ ధరలు, హోమ్ డెలివరీ, నో కాస్ట్ ఈఎంఐ తదితర సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడంతో కొనుగోళ్లు మరింత పెరిగాయి.
దసరా-దీపావళిపైనే అందరి దృష్టి...
ఈ నేపథ్యంలో దేశంలో వ్యాపార వర్గాల దృష్టి రాబోయే పండుగల సీజన్పైనే ఉంది. ప్రతి ఏటా దసరా, దీపావళి పండుగలు దగ్గరికి వచ్చేస్తున్నాయంటే సంబరపడిపోయేది ముందుగా ఆ వర్గాలే. ఎందుకంటే, ఏడాది మొత్తం జరిగే వ్యాపారంలో 35-40 శాతం ఒక్క దసరా-దీపావళి సీజన్లోనే జరుగుతుంది. ఈ ప్రభావం ఇతర రంగాలపైనా ఉంటుంది. అందుకే రాబోయే దసరా, దీపావళి పండుగలతో సామాన్యుల కొనుగోలు శక్తికి, భారత ఆర్థిక వ్యవస్థ తీరుకు ఒక కొలమానంగా ఆర్థిక రంగ నిపుణలు భావిస్తున్నారు.