ఈ-సిగరేట్ ఏమిటి, ప్రభుత్వం ఎందుకు నిషేధించింది?
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం బుధవారం ఈ-సిగరేట్లపై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-సిగరేట్ అంటే ఎలక్ట్రానిక్ సిగరేట్. ధూమపానం అలవాటును తగ్గించే పేరుతో మొదలైన ఈ-సిగరేట్లు ఇప్పుడు వ్యసనంగా మారి, యువత ప్రాణాలను హరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ-సిగరెట్స్ తయారీ, ఎగుమతి, దిగుమతి, సరఫరా, అమ్మకం, ప్రచారంపై నిషేధం విధించింది.
ఈ-సిగరేట్లపై నిషేధం: కేంద్రం కీలక ప్రకటన, జరిమానా ఏమంటే
ఉల్లంఘిస్తే శిక్ష ఎలా?
ఈ-సిగరేట్ నిషేధాన్ని మొదటిసారి ఉల్లంఘిస్తే ఏడాది జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. ఆ తర్వాత కూడా ఉల్లంఘనకు పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.5 లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం. ఈ-సిగరెట్లను నిల్వ చేస్తే ఆరు నెలల జైలు లేదా రూ.50వేల వరకు జరిమానా లేదా రెండూ విధింపు.
ఈ-సిగరేట్ స్టాక్స్ కలిగి ఉంటే పోలీస్ స్టేషన్లో అప్పగించాలి
ఈ-సిగరేట్ స్టాక్స్ కలిగిన యజమానులు దగ్గరలోని పోలీస్ స్టేషన్లలో అప్పగించారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుంది. ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతారు. కేంద్రం నిర్ణయంపై ఈ-సిగరెట్ ఇండస్ట్రీ, కస్టమర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయ సిగరెట్ పరిశ్రమను రక్షించేందుకే ఈ నిర్ణయమని ఆరోపిస్తున్నారు.
అధిక మొత్తంలో నికోటిన్
మనదేశంలో 400కు పైగా ఈ-సిగరెట్ బ్రాండ్స్, 150 ఫ్లేవర్లలో లభిస్తున్నాయి. ఈ-సిగరెట్ పొగలో అధిక మొత్తంలో నికోటిన్ ఉంటుంది. దానిని పీల్చిన వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అమెరికా, ఇతర దేశాల్లో వీటిపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో పాఠశాల విద్యార్థుల్లో ఈ-సిగరెట్ల వినియోగం 77 శాతానికి పైగా పెరిగినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ-సిగరేట్స్ కారణంగా ఏడుగురు చనిపోయారు కూడా. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
వేటిపై నిషేధం...
ఈ-సిగరేట్లు, హీట్-నాట్ బర్న్ ధూమపాన పరికరాలు, వేపింగ్ పరికరాలు, ఈ-నికోటిన్ ఫ్లేవర్డ్ హుక్కాలపై నిషేధం విధించారు.
ఈ-సిగరేట్ అంటే ఏమిటి?
సిగరేట్ లేదా పెన్నులా ఉండే ఎలక్ట్రానిక్ పరికరం ఇది. ఇందులో పొగాకు ఉండదు. రకరకాల ఫ్లేవర్లతో కూడిన నికోటిన్ ద్రావకం, ఇతర రసాయనాలు ఉంటాయి. సిగరేట్ అంత ప్రమాదకరం కాదు. కానీ వీటిలో వినియోగించే రసాయనాలు చాలా హానికరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ-సిగరేట్ వినియోగిస్తున్నప్పుడు అందులోని నికోటిన్ ద్రావకం పొగలా మారి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. సిగరేట్ తాగిన అనుభూతిని ఇస్తుంది. అందుకే సిగరేట్ మానాలనుకునేవారు ఈ-సిగరేట్ల వైపు మళ్లుతారని అంచనా. అయితే సిగరేట్ అలవాటు లేని యువత ఈ-సిగరేట్ వైపు ఆకర్షితులవుతోంది. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
చైనాలో ప్రారంభం...
ఈ-సిగరేట్లు 1963లో అమెరికాలో తయారు చేశారు. ధూమపానం ఫ్యాషన్గా ఉన్న కాలంలో దీనిని ఎవరూ పట్టించుకోలేదు. 2003లో చైనాకు చెందిన హాన్ లిక్ అనే శాస్త్రవేత్త తీవ్ర ఒత్తిడితో బంధించిన నికోటిన్ను అల్ట్రా సౌండ్ పరికరంతో ఆవిరిగా మార్చి మండించవచ్చునని గ్రహించాడు. 2004లో ది రుయాన్ ఈ-సిగరేట్ పేరుతో దీనిని చైనాలో విడుదల చేశాడు. ఆ తర్వాత ఎన్నో కంపెనీలు పుట్టుకు రావడంతో పాటు బ్యాటరీ సాయంతో నడిచే వేపర్స్ వచ్చాయి.
విష రసాయనాలు...
తొలుత ఈ-సిగరెట్లు వినియోగించే వారిలో పొత్తి కడుపులో నొప్పి, కళ్లు మసకబారడం, నోరు, గొంతులో దురద, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. ఆ తర్వాత సాధారణ సిగరెట్లతో కలిగే అన్ని దుష్ప్రభావాలు మొదలయ్యాయి. అమెరికా హార్ట్ అసోసియేషన్ ప్రకారం రెండుసార్లు ఈ-సిగరెట్ తాగడం ఒకసారి సాధారణ సిగరెట్ తాగడంతో సమానమని తేల్చింది. వేపర్స్ పీల్చేవారిలో అరవై శాతం మందికి గుండెపోటు వచ్చే ప్రమాదముందని తెలిపింది. వేపర్స్తో క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు డీఎన్ఏ, మెదడు పనితీరు దెబ్బతింటుంది. కండరాల జబ్బులు వస్తాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించింది. మింట్, మెంథాల్ ఫ్లేవర్ ఈ-సిగరెట్, పొగరాని సిగరెట్లలో పుల్ గాన్ అనే క్యాన్సర్ కారకం వెయ్యి రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ-లిక్విడ్లో నికోటిన్తో సహా దాదాపు 60 రకాల విష రసాయనాలు ఉన్నట్లు తేలింది.
సంప్రదాయ సిగరేట్ కంపెనీల షేర్లకు డిమాండ్
ఎలక్ట్రానిక్ సిగరేట్ల ఉత్పత్తి, దిగుమతి, పంపిణీ, అమ్మకం నిషేధం నేపథ్యంలో సిగరేట్లు తయారు చేస్తున్న కంపెనీల షేర్ల ధరలు పెరిగాయి. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా షేరు 5.55 శాతం, గోల్డెన్ టుబాకో షేరు 4.69 శాతం, వీఎస్టీ షేరు 3.43 శాతం, ఐటీసీ షేరు 1.03 శాతం పెరిగింది.